రెడ్‌ కార్నర్‌ నోటీస్‌ జారీ సులువు కాదు | Issuance of red corner notice is not easy | Sakshi
Sakshi News home page

రెడ్‌ కార్నర్‌ నోటీస్‌ జారీ సులువు కాదు

Sep 25 2024 4:44 AM | Updated on Sep 25 2024 4:44 AM

Issuance of red corner notice is not easy

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో రెడ్‌ కార్నర్‌ జారీ ప్రక్రియ సీబీఐ వద్ద ఉంది: డీజీపీ జితేందర్‌  

రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం లేదు  

పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉంది 

ఉగ్రవాదుల కదలికలపై పూర్తి స్థాయి నిఘా పెట్టాం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితులకు రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ ప్రక్రియ సీబీఐ వద్ద ప్రాసెస్‌లో ఉందని డీజీపీ జితేందర్‌ చెప్పారు. రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీకి సమయం పట్టొచ్చన్నారు. ‘రెడ్‌ కార్నర్‌ నోటీస్‌ జారీ అనేది చాలా పెద్ద ప్రాసెస్‌. అందులో అంతర్జాతీయ మార్గదర్శకాలు, ఇంటర్‌పోల్‌ గైడ్‌లైన్స్‌ పాటించాలి. దేశాల మధ్య ఒప్పందాలనూ పరిశీలించాలి. 

ఇలా ఎన్నో స్థాయిల్లో ప్రొటోకాల్స్‌ పాటించాల్సి ఉంటుంది. స్థానికంగా ఒక పోలీస్‌స్టేషన్‌ నుంచి నోటీసులు ఇచ్చినట్టుగా రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ చేయలేం. ఈ ప్రక్రియకు సమయం పడుతుంది’అని జితేందర్‌ పేర్కొన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును హైదరాబాద్‌ సీపీ, వెస్ట్‌జోన్‌ డీసీపీల పర్యవేక్షణలో స్పెషల్‌ టీం దర్యాప్తు చేస్తోందని, కేసు కోర్టు పరిధిలో ఉన్నందున తాను ఇంతకుమించి మాట్లాడలేనన్నారు. 

ఇటీవల గణేశ్‌ నిమజ్జనం, మిలాద్‌ ఉన్‌ నబీ ర్యాలీలను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులపై జితేందర్‌ మంగళవారం డీజీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.  

డీజేల వాడకాన్ని తగ్గిస్తున్నాం..: ‘ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కదలికలు ఇంకా ఉన్నాయి. తెలంగాణలో మావోయి స్టుల ప్రభావం లేదు. పోలీసుల పట్టు కొనసాగుతోంది. తమ ఉనికి చాటుకునేందుకు కొన్నిసార్లు తెలంగాణ ప్రాంతంలోకి వచి్చనా.. పోలీసు బలగాలు గట్టిగా తిప్పికొడుతున్నాయి. రాష్ట్రంలో ఉగ్ర కదలికలపై పూర్తిస్థాయిలో నిఘా కొనసాగుతోంది’అని డీజీపీ చెప్పారు. 

జైనూర్‌లో ఇటీవల ఓ గిరిజన మహిళపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత దురదృష్టకరమని, తదనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలకు బాధ్యులైన 38 మందిపై కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పండుగలు, ఉత్సవాల్లో డీజేల ను వాడొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని, వీలైనంత వరకు డీజేల వాడకాన్ని తగ్గిస్తూ వస్తున్నామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎమ్మెల్యే అరికెపూడి గాందీ.. కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడిన ఘటనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నామన్నారు. 

సివిల్‌ తగాదాల్లో ఉన్నట్టుగా చిక్కడపల్లి ఏసీపీపై వచి్చన ఆరోపణలపై హైదరాబాద్‌ సీపీ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా గణేశ్‌ నవరాత్రులు, నిమజ్జనాలు, మిలాద్‌ ఉన్‌ నబీ ర్యాలీలను విజయవంతంగా పూర్తి చేసినట్టు పేర్కొన్నారు. ఈ సమావేశంలో శాంతిభద్రతల అడిషనల్‌ డీజీ మహేశ్‌ భగవత్, ఐజీలు రమేశ్, సత్యనారాయణ, చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement