
ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఇప్పగూడెం, యాకన్న గూడెం ఇసుక రీచ్లో జేసీబీలతో టిప్పర్లో ఇసుక నింపుతున్న దృశ్యం
రాష్ట్రంలో జోరుగా అక్రమ దందా.. సర్కారు ఆదాయానికి భారీగా గండి
గోదావరి, మంజీరా, కృష్ణా నదుల్లో అధికారిక ఇసుక క్వారీలు
ఎక్కడికక్కడ అంతా కుమ్మక్కు.. అడ్డగోలుగా దోపిడీ
లారీల్లో నింపే ఒక్కో అదనపు బకెట్కు రూ.1,500 చొప్పున వసూలు
అసలు ఆన్లైన్ ఆర్డర్ కాపీ లేకుండానే తరలింపు
లారీకి ఏక మొత్తంగా రూ.50 వేల వరకు దోచేస్తున్న కాంట్రాక్టర్లు
ఒక ఆర్డర్ కాపీ మీద మూడు, నాలుగు ట్రిప్పుల్లో సరఫరా
ప్రజా ప్రతినిధుల అండదండలు..చూసీ చూడనట్టుగా అధికారులు.... ‘ఉచితం’ ముసుగులోనూ అక్రమాలు.. రోజుకు రూ.50 కోట్ల దందా?
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. చాలా రీచ్ల వద్ద సీసీ కెమెరాలు లేవు. ఉన్నతస్థాయి పర్యవేక్షణ లేదు. దీంతో ఎక్కడికక్కడ ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఇష్టారాజ్యంగా ఇసుకను తోడేస్తున్నారు. ఒక్క రోజులోనే లక్షల రూపాయల విలువైన ఇసుకను అక్రమంగా తరలించేస్తున్నారు.
ఆ మేరకు సర్కారు ఆదాయానికి గండి కొడుతున్నారు. అధికారిక ఇసుక రీచ్లకు ఆన్లైన్ ఆర్డర్ కాపీ తీసుకుని వచ్చే లారీలో అదనంగా ఇసుక నింపి అక్రమ వసూళ్లకు పాల్పడటం ఒక రకమైన దోపీడీ అయితే, అసలు ఆర్డర్ కాపీయే లేకుండా ఈ రీచ్ల నుంచి ఇసుకను తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక అనధికారిక రీచ్ల నుంచి తరలిపోయే ఇసుకకు లెక్కాపత్రమే ఉండక పోవడం గమనార్హం.
తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండగా.. పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది లేకపోవడంతో ఇసుక అక్రమ దందా జోరుగా సాగిపోతున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధుల అండదండలు, కనుసన్న ల్లోనే ఈ దందా సాగుతోందనే ఆరోపణలున్నాయి. మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు తమ వంతు పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.
ఆ నాలుగు నదుల్లో..
ప్రస్తుతం రాష్ట్రంలోని 11 జిల్లాల్లో 32 ఇసుక రీచ్లు అధికారికంగా నడుస్తుండగా, అనధికారికంగా 52 వరకు ఉన్నట్టు తెలుస్తోంది. గోదావరి, మంజీరా, కృష్ణా, తుంగభద్ర నదుల్లో అధికారిక ఇసుక క్వారీలు ఉన్నాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెంలో 12, ఉమ్మడి వరంగల్లో 9, కరీంనగర్లో 6 ఉండగా, ఖమ్మం, మంచిర్యాల, నారాయణపేట, మహబూబ్నగర్, నల్లగొండల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.
ఇసుక కావాల్సిన వారు క్యూబిక్ మీటర్ ఇసుకకు రూ.650 చొప్పున ఆన్లైన్లో చెల్లిస్తే ఆ మేరకు ప్రభుత్వం ఆర్డర్ కాపీ (ఓఆర్డీ) ఇస్తుంది. ఈ ఆర్డర్ కాపీ తీసుకుని రీచ్కు వెళితే కాంట్రాక్టర్ సిబ్బంది జేసీబీల ద్వారా లారీలో ఇసుకను నింపుతారు. ఈ విధంగా యంత్రాలు, సిబ్బందిని ఏర్పాటు చేసినందుకు గాను ప్రభుత్వం కాంట్రాక్టర్కు క్యూబిక్ మీటర్కు రూ.110 చొప్పున చెల్లిస్తోంది.
ఒకవేళ గిరిజన సొసైటీల నిర్వహణలో రీచ్లు ఉన్నట్టైతే వాటికి క్యూబిక్ మీటర్కు రూ.250 చొప్పున ఇస్తోంది. ఈ క్రమంలో రీచ్ల వద్ద మైనింగ్ (టీజీఎండీసీ), రెవెన్యూ శాఖలకు సంబంధించిన సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి ఉండాలి. అన్లైన్లో బుకింగ్ చేసిన ప్రకారమే ఇసుక నింపుతున్నారా? అక్రమాలకు పాల్పడుతున్నారా? అనేది చూడాలి. ప్రతి వాహనాన్ని జీపీఎస్ ద్వారా ట్రాక్ చేయాలి. కానీ అలా జరగడం లేదనే ఆరోపణలున్నాయి.
ఓఆర్డీ అసలే లేకుండా, ఒక్కో ఆర్డర్పై నాలుగైదు లారీల్లో..
చాలా క్వారీల్లో సిబ్బంది ఎటువంటి ఓఆర్డీలు లేకుండానే లారీకి రూ.50 వేలు తీసుకుని ఇసుక నింపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఒక్కరి పేరు మీద పర్మిట్ తీసుకుని, దానిపైనే నాలుగు, ఐదు లారీలల్లో ఇసుక సరఫరా చేస్తున్నట్లు సమాచారం. కాగా అలా నింపిన లారీలను ఎలాంటి ఆటంకం లేకుండా గమ్యస్థానం చేరేలా స్థానిక నేతల అండదండలతో మైనింగ్, రవాణా, పోలీస్ తదితర శాఖల అధికారులను మేనేజ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
మంత్రి ఇలాకాలో ఇసుకాసురులు!
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ మంత్రి ఇలాకాలో యథేచ్ఛగా ఇసుక దందా నడుస్తోంది. వెంకటాపూర్, వాజేడు, మంగపేట, ఏటూరునాగారం తదితర మండలాల్లోని గోదావరి రీచ్ల నుంచి సాగుతున్న ఇసుక దందాకు సదరు మంత్రి అనుచరులు కొందరి అండదండలు ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఇసుక దందాను నిలువరించేందుకు పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులు ప్రయత్నించక పోవడం, అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఈ ప్రచారం నిజమేననే వాదన విన్పిస్తోంది.
పై స్థాయి ప్రజా ప్రతినిధుల అండదండలు ఉండబట్టే.. కాంట్రాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా గోదావరిలోకి రోడ్లు వేసి మరీ ఇసుక తోడుతున్నారని, మామూళ్లు తీసుకుంటూ అధికారులు పట్టీపట్టనట్లు ఉంటున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేస్తే తమపైనే అక్రమ కేసులు బనాయిస్తారని స్థానికులు భయపడుతుండటం గమనార్హం.
అనధికారిక రీచ్లలో ఏం జరుగుతోంది?
అనధికారిక రీచ్లు పూర్తిగా చట్ట విరుద్ధం. చాలావరకు గతంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి విరమించుకున్న ప్రాంతాల్లోనే ఈ దందా సాగుతోంది. దీనిని నియంత్రించాల్సిన మైనింగ్, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై ములుగు టీజీఎండీసీ ప్రాజెక్టు అధికారి విష్ణువర్ధన్, భూపాలపల్లి పీవో శ్రీకాంత్ నుంచి ‘సాక్షి’ ఫోన్ ద్వారా వివరణ తీసుకునేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాలేదు.
ఉచితం పేరిట యధేచ్చగా..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక సరఫరాకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పథకాల (ఇందిరమ్మ) కింద ఇళ్లు నిర్మించునే వారు కేవలం రూ.1400 చెల్లిస్తే అతడికి రిజిస్టర్డ్ ట్రాక్టర్ యజమాని ఇంటికి వచ్చి ట్రాక్టర్ ఇసుక పోసి వెళ్లాల్సి ఉంటుంది. ఈ విధానంతో పేదలైన లబ్ధిదారులకు తక్కువ ధరకే ఇసుక లభిస్తుండగా, మరోవైపు స్థానిక ట్రాక్టర్ యజమానులకు ఉపాధి దొరుకుతోంది.
అయితే ఈ విధానాన్ని అనుకూలంగా మలచుకుని ఉమ్మడి వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో కొందరు ప్రజాప్రతినిధుల అండదండలతో గ్రామాల్లో ఉన్న చోటా మోటా నేతలు స్థానిక వాగులను తోడేస్తున్నారు. రహస్య ప్రాంతాల్లో ఇసుకను డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఆ ఇసుకను లారీల్లో ఇతర జిల్లాలకు, హైదరాబాద్కు తరలిస్తున్నారు.
ప్రతిరోజూ ఒక్కో జిల్లాలో ట్రాక్టర్ల ద్వారా 500 నుంచి 800 ట్రిప్పుల ఇసుకను ‘ఉచితం’ పేరిట తోడుతూ ఇష్టారాజ్యంగా అమ్మేసుకుంటున్నారే ఆరోపణలున్నాయి. ఇలా రోజుకు రూ.50 కోట్లకు పైగా విలువైన ఇసుక పక్కదారి పడుతున్నట్టు అంచనా. కాగా కొన్ని జిల్లాల్లో ఈ అక్రమ దందాను గ్రామ కమిటీలు వేలం ద్వారా కూడా నిర్వహిస్తుండటం గమనార్హం.
హైదరాబాద్కు ఇలా..
అక్రమంగా తోడేస్తున్న ఇసుక చాలావరకు హైదరాబాద్కు, ఇతర ముఖ్య నగరాలకు వస్తోంది. వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకోవడంతో ప్రభుత్వం ఇసుకను తక్కువ ధరకు అందించడానికి ‘తెలంగాణ ఇసుక బజార్’లను ఏర్పాటు చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి అబ్దుల్లాపూర్ మెట్, వట్టినాగులపల్లి, బౌరంపేట, ఆదిభట్లలో నాలుగు ఇసుక బజార్లను ప్రారంభించారు.
త్వరలో శామీర్పేట్, ఘట్కేసర్ ప్రాంతాల్లో కూడా వీటిని ఏర్పాటు చేస్తామని టీజీఎండీసీ ప్రకటించింది. బ్లాక్ మార్కెట్లో ఇసుక ధరలు విపరీతంగా పెరిగి.. ప్రైవేట్ వ్యాపారులు టన్ను ఇసుకను రూ.2,000 నుండి రూ.3,000 వరకు విక్రయిస్తున్న నేపథ్యంలో.. ఈ దందాను అరికట్టడానికి ఈ బజార్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ బజార్ల ద్వారా అందుబాటులో ఉండేది. వాస్తవ అవసరాలతో పోల్చుకుంటే నామమాత్రమేనని బహిరంగ రహస్యం.
ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏలికేశ్వరం ఇసుక రీచ్. బుధవారం ఇక్కడి నుంచి 7,356 టన్నుల ఇసుక తరలించేందుకు 228 ఆన్లైన్ ఆర్డర్లు బుక్ అయ్యాయి. అంటే 228 లారీల ద్వారా ఈ ఇసుకను తీసుకెళ్తారన్న మాట. లారీ సైజును బట్టి ఒక్కో దానిలో 16 టన్నుల నుంచి 35 టన్నుల వరకు లోడ్ చేస్తుంటారు. అయితే ప్రస్తుతం రీచ్ వద్ద సీసీ కెమెరాలు లేవు.
మైనింగ్ విభాగం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో ఒక్కో లారీలో నాలుగు నుంచి ఆరు బకెట్ల (జేసీబీ ఒక్కసారి తోడే ఇసుక) ఇసుక అక్రమంగా తరలిపోతున్నట్టు సమాచారం. ఇందుకోసం బకెట్కు రూ.1,500 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. ఒక్కో లారీలో సగటున మూడు బకెట్లు వేశారనుకుంటే మూడు బకెట్లకు రూ.4,500 చొప్పున 228 లారీలకు గాను రూ.10.26 లక్షలు దోచుకుంటున్నారన్న మాట.
టన్నుల కొద్దీ అక్రమాలు...
రాష్ట్రంలోని 32 అధికారిక రీచ్ల వద్ద అక్రమాలు జరుగుతున్నాయని లారీ డ్రైవర్లు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం..ఆర్డర్ కాపీ మేరకు.. ఆరు టైర్ల లారీలో 7–8 క్యూబిక్ మీటర్లు (11.5– 12.5 టన్నులు), 10 టైర్ల వాహనంలో 12 క్యూబిక్ మీటర్లు (19.5 టన్నులు), 12 టైర్ల లారీలో 16 క్యూ.మీ. (26 టన్నులు), 14 టైర్ల వాహనంలో 20 క్యూ.మీ. (32 టన్నులు) మాత్రమే నింపాలి.
కానీ సామర్థ్యానికి మించి, అలాగే బుక్ చేసుకున్న దాని కంటే అధికంగా సగటున 3 బకెట్ల వరకు ఇసుక అదనంగా నింపుతున్నారు. బకెట్కు రూ.1,500 చొప్పున వసూలు చేస్తున్నారు. కొన్ని రీచ్ల వద్ద ప్రభుత్వ, ప్రైవేటు సిబ్బంది.. లారీల్లో అదనంగా ఇసుకను నింపుకోవాలని, అందుకు డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. కొన్నిచోట్ల ఇసుక లోడింగ్ సమయంలో ఒక్కో లారీకి (బకెట్ డబ్బులు కాకుండా) రూ.1,000–1,500 వరకు అక్రమంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.