బదిలీ భారం! | Hyderabad restaurant fined for forcing customer to pay service charges | Sakshi
Sakshi News home page

బదిలీ భారం!

Nov 22 2025 3:30 AM | Updated on Nov 22 2025 3:30 AM

Hyderabad restaurant fined for forcing customer to pay service charges

బార్‌ అండ్‌ రెస్టారెంట్ల యజమానులపై అదనపు ఫీజు బాదుడు

ఉన్న ప్రదేశం నుంచి మరో చోటుకి మార్చుకునేందుకు సర్కారు వెసులుబాటు

కోర్‌ అర్బన్‌ పరిధిలో మార్చుకోవాలంటే అదనంగా రూ.18 లక్షలు చెల్లించాల్సిందే

సాక్షి, హైదరాబాద్‌: బార్‌ అండ్‌ రెస్టారెంట్ల షిఫ్టింగ్‌ (ప్రాంతం మార్పు) పేరుతో పెద్ద ఎత్తున సొమ్ము చేసుకునేందుకు ఎక్సైజ్‌ శాఖ రంగం సిద్ధం చేసింది. ౖజీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్కడ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ నిర్వహణకు అనుమతి ఉన్నా ఆ లైసెన్సును ఔటర్‌ రింగు రోడ్డు లోపల ఉండే జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని అన్ని నగర, గ్రామీణ స్థానిక సంస్థల సమాహారమైన తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (టీసీయూఆర్‌) పరిధిలో ఎక్కడికైనా మార్చుకునే అవకాశాన్ని కల్పించింది. అలా అవకాశాన్ని కల్పిస్తూనే ఈ లైసెన్సు తరలింపు కోసం ఫీజును భారీగా పెంచేసింది. టీసీయూఆర్‌ పరిధిలో ఎక్కడికైనా బార్‌ను షిఫ్టు చేసుకోవాలనుకుంటే కనీసం రూ.18 లక్షలు, ప్రస్తుతమున్న మున్సిపాలిటీ లేదంటే కార్పొరేషన్‌ పరిధిలోనే మరో ప్రాంతానికి మార్చుకోవాలనుకుంటే రూ.10 లక్షలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.  

ఇప్పుడే కనాకష్టంగా..!
కోర్‌ సిటీలోని బార్ల నిర్వహణ కష్టంగా మారింది. కూతవేటు దూరంలోనే వైన్‌ షాపులు ఉంటుండగా, నిర్వహణకు అధిక ఖర్చు, కిరాయిలు యజమానులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఇటీవలే కొత్త లైసెన్సుల కోసం నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో తమ ప్రాంతీ య పరిధిని పెంచాలని, కనీసం హైదరాబాద్‌ పరిధిలో అయినా తమ ప్రదేశాన్ని మార్చుకునే వెసు లు బాటును కల్పించాలని బార్‌ అండ్‌ రెస్టారెంట్ల యజమానులు కోరుతున్నారు.

వారి విజ్ఞప్తిని చాలా కాలం తర్వాత పరిగణనలోకి తీసుకున్న ఎక్సైజ్‌ శాఖ.. అలా అవకాశమిస్తూనే గతంలో 15 శాతం ఉన్న షిఫ్టింగ్‌ ఫీజుపై మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో అయితే 25 శాతం లేదంటే రూ.10 లక్షలు (ఈ రెండింటిలో ఏది ఎక్కువ అయితే అది), టీసీయూఆర్‌లో అయితే లైసెన్సు ఫీజులో 40 శాతం లేదంటే రూ.16 లక్షలు (ఈ రెండింటిలో ఏది ఎక్కువ అయితే అది) అదనంగా వసూలు చేయాలని నిర్ణయించింది. దీంతో పాటు బార్ల లైసెన్సు ఫీజు కోసం ఉన్న రూ.40 లక్షల శ్లాబ్‌ను రద్దు చేసి దాన్ని రూ.44 లక్షలకు పెంచింది. దీంతో షిఫ్టింగ్‌కు అనుమతినిచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపాలో, అధిక ఫీజు కట్టాల్సి వస్తున్నందుకు అలాంటి ఆలోచన విరమించుకోవాలో అర్థం కావడం లేదని బార్‌ అండ్‌ రెస్టారెంట్ల యజమానులు వాపోతున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement