హైదరాబాద్ మెట్రో రైల్ త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతోంది. ముందుకు వెళ్లేందుకు అవకాశం లేదు. అలాగని వెనుకడుగు వేయడం కూడా సాధ్యం కాదు. మొదటి దశ టేకోవర్లో భాగంగా ఐఆర్ఎఫ్సీతో కుదుర్చుకున్న ఒప్పందం స్తంభించింది. మరోవైపు కేంద్రం ప్రతిపాదించినట్లుగా మరోసారి ఆర్థిక మూల్యాంకనం చేసేందుకు ఎస్బీఐ క్యాపిటల్ సంస్థకు ఇప్పటి వరకు ఎలాంటి బాధ్యతలను అప్పగించలేదు. ఏప్రిల్ 29వ తేదీన ఎల్అండ్టీతో టేకోవర్ ఒప్పందం ఖరారైనప్పటి నుంచి ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. రుణాల చెల్లింపుల కోసం వడ్డీ భారం పెరుగుతోంది. ఇప్పటి వరకు రూ.150 కోట్ల వరకు ఆ భారం పడింది.
సెప్టెంబర్ వరకు ఈ భారం మరింత పెరగనుంది. సోమవారం జరిగిన ఎంపీల సమావేశంలోనూ ప్రభుత్వం మెట్రోరైల్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు ఇప్పటి వరకు జరిగిన పరిణాలను వివరించారు. నిధుల సేకరణకు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఒక సవాల్గా మారినట్లు పేర్కొన్నారు.
ఎస్పీవీ ఎప్పుడు..
ఇటీవల కేంద్రంతో జరిపిన చర్చల నేపథ్యంలో రెండు ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం ఉండేవిధంగా స్పెషల్ పర్పస్ వెహికల్ను (ఎస్పీవీ) ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రుణాల చెల్లింపుతో పాటు ప్రాజెక్టుల నిర్వహణలోనూ సమానమైన భాగస్వామ్యం ఉంటుందని పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు ఎస్పీవీ కూడా ఏర్పాటు కాలేదు. ఆరి్థక అంచనాలను రూపొందించేందుకు ఎస్బీఐ క్యాపిటల్ సంస్థకు బాధ్యతలు అప్పగించడంతో పాటు, ఎస్పీవీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి కోరుతూ లేఖ రాశారు. అయినప్పటికి కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లభించలేదు.
ఎల్అండ్టీకి చెల్లించవలసిన రూ.13 వేల కోట్ల రుణాల కోసం ప్రత్యామ్నాయ అవకాశాలను పరిశీలిస్తున్నప్పటికీ రకరకాల ఇబ్బందులు ఎదురవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ (ఎఫ్ఆర్ఎంబీ) చట్టం కింద రాష్ట్రం ఇప్పటికే పెద్ద మొత్తంలో అప్పులు తీసుకుంది. దీంతో నేరుగా అప్పు తీసుకోవడం కష్టంగా మారింది. దీంతో ఎఫ్ఆర్బీఎం నిబంధనల్లో సడలింపులిచ్చే అంశాన్ని కూడా పరిశీలించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు హెచ్ఎంఆర్ఎల్ అధికారి ఒకరు చెప్పారు.
మెట్రో స్వాదీనం మరింత ఆలస్యం...
ఈ పరిణామాల నడుమ మెట్రో మొదటి దశ స్వా«దీన ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. సెపె్టంబర్ నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నప్పటికీ సాధ్యాసాధ్యాలపైన అధికారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నుంచి ఇప్పటికిప్పుడు ఆమోదం లభించి ఎస్బీఐ క్యాపిటల్ సంస్థకు బాధ్యతలను అప్పగించినా అది నివేదికను అందజేసేందుకు కనీసం 3 నెలల సమయం పడుతుంది. ఆ నివేదిక ఆధారంగా రుణ సంస్థలను ఎంపిక చేయాలి. అందుకు మరికొంత సమయం పట్టవచ్చు. అలా అన్ని విధాలుగా మెట్రో స్వా«దీనం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.


