
హైదరాబాద్, సాక్షి: హైడ్రా (Hyderabad Disaster Response and Action) కంట్రోల్ రూమ్ సేవలు బంద్ అయ్యాయన్న కథనాలపై కమిషనర్ రంగనాథ్ స్పందించారు. హైడ్రా విధులు ఎక్కడా ఆగలేదని.. ప్రజా వాణి యధాతథంగా కొనసాగుతోందని సోమవారం మధ్యాహ్నాం స్పష్టం చేశారాయన.
ఈ ఉదయం.. జీతాలు తగ్గించడంతో మార్షల్స్ విధులు బహిష్కరించారన్నది తెలిసిందే. ఆపై బైక్ ర్యాలీ చేపట్టారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్లోని 150 డివిజన్లలో వీళ్లు అందించే ఎమర్జెన్సీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇది ఇలాగే కొనసాగితే హైడ్రా వర్షాకాల సేవలపై ప్రభావం పడుతుందని అంతా భావించారు. ఈలోపు.. సేవలేం ఆగిపోలేదని హైడ్రా ప్రకటించడం గమనార్హం.
హైదరాబాద్ నగరంలో వర్షాకాలం నేపథ్యంలో HYDRA యంత్రాంగం మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్లు రంగంలోకి దిగి సేవలు ప్రారంభించింది. ఈ సేవల్లో మార్షల్స్, DRF బృందాలు, ట్రాఫిక్ సపోర్ట్ టీమ్లు, క్లీన్-అప్ సిబ్బంది భాగంగా ఉన్నారు. మొత్తం 150 డివిజన్లలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్లు (METs): ఒక్కో టీమ్లో 4 మంది, మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు.
ఇందులో డీఆర్ఎఫ్ బృందాలు 51 టీమ్లు ఉండగా.. మొత్తం 918 మంది సిబ్బంది ఉన్నారు. అలాగే.. స్టాటిక్ బృందాలు 368 ఉండగా.. నీటి నిలయాల వద్ద 734 మంది ఉన్నారు. 21 బైకులతో ఎమర్జెన్సీ బైక్ బృందాలను ఏర్పాటు చేశారు. ఇక ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల భధ్రత, సమన్వయం కోసం మార్షల్స్ను ఏర్పాటు చేశారు. వీళ్లలో మాజీ సైనికులే ఎక్కువగా ఉన్నారు. మొత్తంగా.. మాన్పవర్ 4,100 మంది ఉన్నారు.
వానా కాలంలో నీరు తొలగించేందుకు పంపులు, చెట్ల కట్ మిషిన్లు, క్లీన్-అప్ టూల్స్ వీళ్లకు అందిస్తున్నారు. ప్రతి బృందానికి ఒక్కరోజులోనే సత్వర శిక్షణ ఇప్పించారు. హైడ్రా, జీహెచ్ఎంసీ సమన్వయంతో ఈ సిబ్బంది సేవలు అందిస్తూ వస్తున్నారు.