ఐటీ కారిడార్‌లో 4 కొత్త లింకు రోడ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

HYD: Minister KTR  Inaugurates Four Link Roads In IT Corridor - Sakshi

నేడు ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

ఐటీకారిడార్, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్స్‌లో తగ్గనున్న ట్రాఫిక్‌ సమస్య

సాక్షి, రాయదుర్గం: ఐటీ కారిడార్, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్యను దూరం చేసేందుకు లింకురోడ్ల నిర్మాణం వేగవంతం చేశారు. ఇప్పటికే అనేక లింకురోడ్లు అందుబాటులోకి తీసుకురాగా, కొత్తగా మరో నాలుగు రోడ్లు సోమవారం అందుబాటులోకి వచ్చాయి. వీటిని  రాష్ట్ర ఐటీ శాఖమంత్రి కె. తారకరామారావు, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, నగర మేయర్‌ విజయలక్ష్మి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాందీతో కలిసి ప్రారంభించారు. రూ.23.43 కోట్ల వ్యయంతో హెచ్‌ఆర్‌డీసీఎల్‌ సంస్థ నాలుగు లింకురోడ్లను నిర్మించింది. నాలుగు లేన్ల రోడ్లు, సెంట్రల్‌ లైటింగ్, గ్రీనరీతో తీర్చిదిద్దారు. ఈ నాలుగు లింకురోడ్ల నిర్మాణంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్య చాలా వరకు పరిష్కారం కానుంది. 

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్ అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతోందన్నారు. నగర అభివృద్ధికి రహాదారులు చాలా ముఖ్యమని, ఇప్పటికే 16 లింక్ రోడ్లు పూర్తి చేశామని వెల్లడించారు. లింక్ రోడ్ల వల్ల ప్రధాన రహదారులపై భారం తగ్గుతుందని తెలిపారు. హైదరాబాద్‌ను చూసి ఇతర రాష్ట్రాల వాళ్ళు అడుగుతున్నారని పేర్కొన్నన్నా. దశల వారీగా 133 లింక్ రోడ్లను నిర్మిస్తున్నామన్నారు. శేరిలింగంపల్లిలో జనసాంద్రత ఎక్కువని, అందుకే ఇక్కడ పనులు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు.

నేడు ప్రారంభించిన రోడ్లు ఇవే.. 
► రూ.5.58 కోట్లతో నిర్మించిన 0.600 కిలో మీటర్ల బీటీ లింకురోడ్డు– నోవాటెల్‌ హోటల్‌ నుంచి కొండాపూర్‌ ఆర్టీఏ కార్యాలయం వరకు. 
►రూ.2.87 కోట్లతో నిర్మించిన 0.460 కిలో మీటర్ల బీటీ లింకురోడ్డు– మియాపూర్‌ మెట్రో డిపో నుంచి కొండాపూర్‌ మసీద్‌బండ జంక్షన్‌ వరకు. 
►రూ.7.41 కోట్లతో 0.750 కిలోమీటర్ల బీటీ లింకురోడ్డు – వసంతసిటీ నుంచి న్యాక్‌ వరకు. 
►రూ.7.57 కోట్లతో 1.010 కిలోమీటర్ల బీటీ లింకురోడ్డు– జేవీ హిల్స్‌ పార్కు నుంచి మసీదుబండ వరకు వయా ప్రభుపాద లేఅవుట్‌ హైటెన్షన్‌ లైన్‌. 

తగ్గనున్న దూరం... 
► కొత్తగా అందుబాటులోకి వచ్చే రోడ్లతో దూరభారం తగ్గనుంది.  
► కొత్త లింకురోడ్డులన్నీ నాలుగులేన్ల, మధ్యలో డివైడర్, సెంట్రల్‌ లైటింగ్, గ్రీనరీతో ఉండడంతో గతంలో కన్నా విశాలంగా రోడ్లు మారడం, లింకు కలుపడంతో చాలా వరకు ప్రధాన  రోడ్లకు కనెక్టివిటీ పెరగనుంది. 
►ట్రాఫిక్‌ సమస్యతోపాటు, వాహనదారులకు సమయం, ఇంధనం ఆదా అయ్యే అవకాశం కలుగుతుంది. 
►నోవాటెల్‌–ఆర్టీఏ ఆఫీస్‌ లింకురోడ్డుతో హఫీజ్‌పేట్, కొండాపూర్, మియాపూర్, గచ్చిబౌలి వాసులకు హైటెక్‌సిటీ ఎంఎటీఎస్‌ స్టేషన్, హైటెక్స్, నోవాటెల్‌ను తక్కువ సమయంలో  చేరుకోవచ్చు. 
►అంతేకాకుండా మూడు లింకురోడ్లతో మియాపూ ర్, సర్దార్‌పటేల్‌నగర్, వసంతనగర్, కేపీహెచ్‌బీ, 6,9 ఫేజ్‌ నుంచి హైటెక్‌సిటీ ప్రాంతానికి మరింత దగ్గరవుతుంది. 
►జాతీయ రహదారి నుంచి ప్రారంభమయ్యే లింకురోడ్డు ద్వారా డైమండ్‌హిల్స్‌ కాలనీ, ఐడీపీఎల్‌ ఎంప్లాయీస్‌కాలనీ, శిల్పాఎవెన్యూ కాలనీ, నోవాటెల్‌ హోటల్‌ రోడ్డు సర్కిల్‌ నుంచి  కొండాపూర్‌ మజీదుబండ జంక్షన్‌ వరకు సులువగా చేరుకోవచ్చు. 
►జేవీహిల్స్‌ పార్కు నుంచి మసీద్‌బండ రోడ్డు నిర్మాణంలో మాధవహిల్స్‌ ఎస్టేట్, ప్రభుపాద లేఅవుట్, మారుతీనగర్‌కాలనీ వారికి నేరుగా గచి్చ»ౌలికి వయా మసీదుబండ రోడ్డు ద్వారా వెళ్లే అవకాశం కలుగుతుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top