ప్రయోగాత్మకంగా రెండు కారిడార్ల ఎంపిక
ఒవైసీ జంక్షన్ నుంచి తార్నాక వరకు..
కూకట్పల్లి వై జంక్షన్– గండిమైసమ్మ
పూర్తిస్థాయిలో అండర్డక్ట్లు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని వివిధ ప్రాంతాల్లో కారిడార్ల అభివృద్ధికి హెచ్ఎండీఏ అనుబంధ సంస్థ హుమ్టా ప్రణాళికలను రూపొందించింది. కారిడార్ ఇంప్రూవ్మెంట్ ప్లానింగ్లో భాగంగా రెండు మార్గాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఒవైసీ ఆస్పత్రి జంక్షన్ నుంచి తార్నాక వరకు, కూకట్పల్లి హౌసింగ్బోర్డు నుంచి గండిమైసమ్మ వరకు ప్రతిపాదించారు. ఒవైసీ నుంచి తార్నాక వరకు సుమారు 20 కి.మీ, కేపీహెచ్బీ వై జంక్షన్ నుంచి గండిమైసమ్మ వరకు 20 కి.మీ. వరకు ఉంటుంది. కామన్ డక్ట్ల నిర్మాణం వల్ల ఈ రూట్లో వాహనాలు నిరాటంకంగా రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంటుంది..
రోడ్లు 100 శాతం వినియోగం
వివిధ కారణాలతో ప్రస్తుతం పూర్తిస్థాయిలో రోడ్లను వినియోగించుకోలేకపోతున్నట్లు హుమ్టా గుర్తించింది. ఫైబర్ కేబుళ్లు, డ్రైనేజీపైపులైన్లు, విద్యుత్ వైర్లు వంటి వివిధ అవసరాల కోసం వేర్వేరుగా లైన్ల నిర్మాణం చేపట్టడంతో రోడ్ల కోసం కేటాయించిన స్థలంఆక్రమణకు గురవుతోంది. మరోవైపు ఫుట్పాత్లు, పేవెమెంట్లపైన కూడా ఆక్రమణలు కొనసాగుతున్నాయి. దీంతో 60 ఫీట్ల వెడల్పు రోడ్లు ఉన్నప్పటికీ పూర్తిగా వినియోగించుకోవడం సాధ్యం కావడం లేదు. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోతోంది. ఈ క్రమంలో అన్ని మార్గాల్లో కారిడార్ల అభివృద్ధి చేపడితే రహదారులను 100 శాతం వినియోగించుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కామన్డక్ట్లతో ఫుట్పాత్లు, పేవ్మెంట్లను సమర్థంగా ఉపయోగించుకోవడంతో పాటు రోడ్ల వినియోగం కూడా పూర్తిస్థాయిలో ఉంటుంది. రోడ్లపై వరదనీరు నిలువకుండా చేస్తుంది.
ప్రయోజనాలు ఇలా..
కారిడార్ల అభివృద్ధితో ప్రత్యేకంగా బస్ బేలు, బస్ లైన్ల ఏర్పాటు.
ప్రత్యేకంగా సైకిల్ ట్రాక్లు, నాన్ మోటరైజ్డ్ వాహనాల మార్గాలు.
ట్రాఫిక్ నిరాటంకంగా కొనసాగే అవకాశం.
అక్కడక్కడ బఫర్జోన్ల ఏర్పాటు. గ్రీనరీ అభివృద్ధి.
ఫుట్పాత్లు, పేవ్మెంట్లు వంద శాతం వినియోగం.
యూనిఫామ్ క్రాస్ సెక్షన్స్తో ఎక్కడా బాటిల్నెక్స్ ఉండవు.
రోడ్లు పూర్తిగా అందుబాటులోకి వస్తాయి.


