
రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పు డు నిర్వహిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ను హైకోర్టు ప్రశ్నించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తా మని చెప్పి, ఎందుకు చర్య లు చేపట్టలేదని అడిగింది. దీనిపై స్పష్టత ఇచ్చేందుకు 25 రోజులు సమయం కావాలని సర్కార్ బదులిచ్చింది. అక్కడి నుంచి తమకు దాదాపు రెండు నెలల సమయం పడుతుందని ఎస్ఈసీ పేర్కొంది.
అనంతరం పిటిషనపై తీర్పును న్యాయస్థానం రిజర్వు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని కోరుతూ నల్లగొండ జిల్లా మల్లెపల్లి సర్పంచ్ పార్వతి, కుర్మపల్లి సర్పంచ్ శ్రీనివాస్, జనగాం జిల్లా కాంచనపల్లి సర్పంచ్ విజయ, నిర్మల్ జిల్లా తల్వెడ సర్పంచ్ అనిల్కుమార్, కరీంనగర్ జిల్లా చంగర్ల సర్పంచ్ వేణు గోపాల్, నిజాయితీగూడెం సర్పంచ్ మురళీధర్ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై జస్టిస్ టి మాధవీదేవి సోమవారం విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్లను ఖరారు చేసి, వార్డు సభ్యులు, సర్పంచ్ల సీట్లను కులాల వర్గాల వారీగా ప్రకటించడానికి ప్రభుత్వానికి దాదాపు నెల రోజులు అవసరమని అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇమ్రాన్ఖాన్ తెలియజేశారు. ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిన వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తామని, అప్పటి నుంచి రెండు నెలల సమయం పడుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరపున సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ చెప్పారు.
ఏడాదిన్నర పూర్తయినా ఎన్నికలు లేవు
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది జె.ప్రభాకర్, జి.భాస్కర్రెడ్డి, సీహెచ్.నరేశ్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఎన్నికలు నిర్వహిస్తామని గత అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు హామీ ఇచ్చి.. నిలబెట్టుకోలేదన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మౌన ప్రేక్షకుడిలా వ్యవహరిస్తోందని, ఎన్నికల ఆలస్యంపై రాష్ట్రాన్ని ప్రశ్నించడం లేదన్నారు.
కిషన్సింగ్ తోమర్ వర్సెస్ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పునకు కట్టుబడి ఉండాల్సిందేన్నారు. పరిపాలన ప్రక్రియలు, విధానపరమైన అవసరాలతో కలిగే జాప్యాలను కారణాలుగా చూపుతూ ఎస్ఈసీ ఆ తీర్పును ఉల్లంఘించజాలదని చెప్పారు. సకాలంలో ఎన్నికలు జరిగేలా చూడటంలో ఎస్ఈసీ స్వతంత్రత, విధి అని నొక్కి చెప్పారు.
విపత్తులు లాంటి అసాధారణ పరిస్థితుల్లో తప్ప ఎన్నికలు వాయిదా వేయడానికి వీలు లేదన్నారు. 2024, జనవరి 31తో సర్పంచ్ల పదవీ కాలం ముగిందన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కాలపరిమితి ముగిసిన తర్వాత ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని నిబంధనలు ఉన్నా పట్టించుకోవడం లేదని చెప్పారు. దాదాపు ఏడాదిన్నర అవుతున్నా ప్రభుత్వం, ఎస్ఈసీ ఎన్నికలు నిర్వహించడం లేదని నివేదించారు.
తాజా మాజీ సర్పంచ్లను పక్కన పెట్టి గ్రామ పంచాయతీలను పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను నియమించడం రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 243ఈ, 243కేను, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018 నిబంధనలను ఉల్లంఘించడమేనని వాదించారు.
రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా నిధులను అందిస్తామని ప్రభుత్వం చెప్పడంతో తమ గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యకలాపాలకు కొందరు సర్పంచ్లు వ్యక్తిగతంగా నిధులు సమకూర్చారని, ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదన్నారు.
వెంటనే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అన్ని పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. సర్కార్, ఎస్ఈసీ మరింత సమయం కోరడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, పిటిషన్లలో తీర్పును రిజర్వు చేసింది.