‘రిమాండ్‌’ను కొట్టివేయలేం | High Court on Patnam Narender Reddy remand | Sakshi
Sakshi News home page

‘రిమాండ్‌’ను కొట్టివేయలేం

Dec 5 2024 4:02 AM | Updated on Dec 5 2024 4:02 AM

High Court on Patnam Narender Reddy remand

లగచర్ల ఘటనపై నరేందర్‌రెడ్డికి హైకోర్టు స్పష్టీకరణ

మెరిట్స్‌ ప్రకారం బెయిల్‌పై ఆదేశాలు ఇవ్వండి

జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌కు హైకోర్టు ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: లగచర్ల ఘటనలో కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి జిల్లాకోర్టు విధించిన రిమాండ్‌ను కొట్టివేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పట్నం దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని.. తామిచ్చిన ఉత్తర్వుల ప్రభావం ఉండబోదని ఆదేశించింది. మెరిట్స్‌ ఆధారంగా తీర్పు వెలువరించాలని ట్రయల్‌ కోర్టుకు సూచించింది. పిటిషన్‌ను కొట్టివేసింది. 

లగచర్ల ఘటనలో తనను అరెస్టు చేసి రిమాండ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ నరేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ట్రయల్‌ కోర్టు డాకెట్‌­(రిమాండ్‌) ఆర్డర్‌ను క్వాష్‌ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ గత నెల తీర్పు రిజర్వు చేశారు. పిటిషన్‌ను కొట్టివేస్తూ బుధవారం తీర్పునిచ్చారు. 

అయితే, బెయిల్‌ పిటిషన్‌పై వికారాబాద్‌ కోర్టు చేసిన వ్యాఖ్యలను నరేందర్‌రెడ్డి న్యాయవాది జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ దృష్టికి తీసుకొచ్చారు. బెయిల్‌ పిటిషన్లు తమ పరిధిలోకి రావని స్పెషల్‌ కోర్టు చూస్తుందని వెల్లడించిందన్నారు. దీంతో స్పెషల్‌ కోర్టు వివరాలు తెలపాలని న్యాయమూర్తి నరేందర్‌రెడ్డి న్యాయవాదిని ఆదేశించారు. గత నెల 13న నరేందర్‌రెడ్డిని అరెస్టు చేయగా, ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement