మూసీపై హెరిటేజ్‌ పడగ! | Heritage industries Dairy waste being discharged into Musi River: Telangana | Sakshi
Sakshi News home page

మూసీపై హెరిటేజ్‌ పడగ!

Jul 4 2026 2:33 AM | Updated on Jul 4 2026 2:33 AM

Heritage industries Dairy waste being discharged into Musi River: Telangana

మూసీలో వ్యర్థాలను పోసి తిరిగి వస్తున్న ట్యాంకర్‌ను అడ్డుకున్న శ్రీసహదేవ్‌సింగ్‌ నగర్‌ కాలనీవాసులు

డెయిరీ వ్యర్థాలు నదిలో కలిపేస్తున్న చంద్రబాబు కుటుంబ సంస్థ

శామీర్‌పేట నుంచి నాగోల్‌కు ట్యాంకర్ల ద్వారా తరలింపు

ప్రతిరోజూ రాత్రివేళ 50 వేల లీటర్లకు పైగా స్కిమ్డ్‌ వెయ్‌ పారబోత

శుద్ధి చేసిన తర్వాతే బయటకు విడుదల చేయాల్సి ఉన్నా బేఖాతర్‌

నీటిలో ఆక్సిజన్‌ తగ్గడంతో చేపలు, జలచరాలు చనిపోయే ప్రమాదం

స్థానిక కాలనీవాసులు గమనించి అడ్డుకోవడంతో విషయం వెలుగులోకి..

ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న కాలనీ సంఘం

    కృష్ణా, గోదావరి, యమున, సరస్వతి..అన్ని నదుల పేర్లను మన ఆడబిడ్డలకు పెట్టుకుంటాం. ఏ తండ్రి అయినా ఆయన బిడ్డకు ‘మూసీ’అని పేరు పెట్టుకున్నాడా? మూసీ నది కంపు కొడుతూ విషం చిమ్ముతోంది కాబట్టే పెట్టుకోలేదు. అందుకే ఆ మూసీ మురికిని ప్రక్షాళన చేయాలని అనుకుంటున్నా.      – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: మూసీ నది అభివృద్ధిపై వెనక్కి తగ్గేది లేదని సీఎం రేవంత్‌రెడ్డి వేర్వేరు సందర్భాల్లో, వేర్వేరు వేదికలపై స్పష్టం చేశారు. ఒక పక్క సీఎం ఈ విధంగా మూసీ నది అభివృద్ధి కోసం పరితపిస్తుంటే.. ఇవేమీ పట్టనట్టు మరో పక్క ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి కుటుంబ సంస్థ హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ ఆ నదిని మరింత కాలుష్య కాసారంగా మార్చేస్తోంది.

శామీర్‌పేటలోని జగన్‌గూడలో ఉన్న ప్లాంట్‌ నుంచి స్కిమ్డ్‌ వెయ్‌ను ట్యాంకర్లలో తరలించి నాగోల్‌ లోని శ్రీ సహదేవ్‌సింగ్‌ నగర్‌ కాలనీ వద్ద మూసీలో కలిపేస్తోంది. ప్రతిరోజూ వేల లీటర్ల డెయిరీ వ్యర్థాన్ని రాత్రి పూట గుట్టు చప్పుడు కాకుండా తీసుకువచ్చి నదిలోకి వదిలేస్తోంది. కొన్ని రోజులుగా ఈ వ్యవహారాన్ని గమనించిన కాలనీ వాసులు గత సోమవారం ఓ ట్యాంకర్‌ను అడ్డుకోవడంతో విషయం వెలుగులోకి వచి్చంది.

ఏకంగా 50 కిలోమీటర్ల నుంచి తరలించి..
    స్కిమ్డ్‌ వెయ్‌ అనేది పాల నుంచి చీజ్‌ (జున్ను), కాసీన్‌ (ప్రొటీన్‌ పదార్థం) వంటి పాల ఉత్పత్తుల తయారీ ప్రక్రియలో మిగిలిపోయే ద్రవ వ్యర్థం. ఇందులో సాధారణంగా నీరు, లాక్టోజ్, వెయ్‌ ప్రోటీన్లు, కాల్షియం, పొటాíÙయం వంటి ఖనిజ లవణాలతో పాటు లాక్టిక్‌ యాసిడ్‌ ఉంటాయి. ఇది విషపూరిత రసాయనం కానప్పటికీ అధిక సేంద్రియ భారం (ఆర్గానిక్‌ లోడ్‌) కలిగి ఉండటం వల్ల పర్యావరణానికి హాని కలిగిస్తుంది.

అందువల్ల దీన్ని నేరుగా బయట పారబోయ కూడదు. పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధి చేసే ప్లాంట్‌ (ఈటీపీ) ద్వారా శుద్ధి చేసిన తర్వాతే బయటకు విడుదల చేయాలి. కానీ హెరిటేజ్‌ సంస్థ మాత్రం ఈ హానికారక డెయిరీ వ్యర్థాన్ని దాదాపు 50 కిలోమీటర్లు ట్యాంకర్ల ద్వారా తీసుకువచ్చి మూసీలో పారబోస్తోంది.

జలచరాలకు ప్రమాదం
    స్కిమ్డ్‌ వెయ్‌ లాంటి వ్యర్థాలను జనావాసాల మధ్య, నదీ జలాల్లో పారబోస్తే తీవ్ర పర్యావరణ సమస్యలు తలెత్తుతాయి. ప్రధానంగా చెరువులు, వాగులు, కాలువల్లో కలిస్తే నీటిలో బయోకెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ (బీఓడీ), కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ (సీఓడీ) గణనీయంగా పెరుగుతాయి. అంటే ఈ వ్యర్థాలు నీటిలో కరిగితే అందులో ఉన్న ఆక్సిజన్‌ స్థాయి తగ్గిపోతుంది. తగిన ఆక్సిజన్‌ లేకపోవడంతో చేపలు, ఇతర జలచరాలు చనిపోయే ప్రమాదం ఉంటుంది.

మరోవైపు ఈ వ్యర్థాన్ని నేల మీద పోస్తే కొద్ది రోజుల్లోనే అది తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతుంది. పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి. బ్యాక్టీరియా, ఫంగస్‌లు ఇందులో వేగంగా పెరిగి ఈగలు, దోమలతో పాటు ఇతర కీటకాలను ఆకర్షిస్తుంది. పెద్ద మొత్తంలో ఒకేచోట పారబోస్తే నేలలో పోషకాల అసమతుల్యత ఏర్పడుతుంది. భూగర్భ జలాల నాణ్యతపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.

ప్రతిరోజూ మూడు ట్యాంకర్లు..
    శామీర్‌పేట మండలంలోని జగన్‌గూడలో ఉన్న హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ సంస్థ ప్లాంట్‌ నుంచి ఒక్కో ట్యాంకర్‌లో 18 వేల లీటర్ల చొప్పున రోజుకు కనీసం మూడు ట్యాంకర్లలో 50 వేల లీటర్లకు పైగా స్కిమ్డ్‌ వెయ్‌ను తీసుకువచ్చి మూసీలో పారబోస్తున్నారు. ప్రతిరోజూ సాయంత్రం సమయంలో ఆ ప్లాంట్‌ నుంచి బయలుదేరుతున్న ఈ ట్యాంకర్లు రాత్రి సమయానికి శ్రీ సహదేవ్‌సింగ్‌ నగర్‌ కాలనీకి చేరుతున్నాయి.

కొన్నాళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని గమనించిన స్థానికులు గత సోమవారం రాత్రి మూసీలో పొసి తిరిగి వస్తున్న ఓ ట్యాంకర్‌ను అడ్డుకున్నారు. అందులో హెరిటేజ్‌ సంస్థ జారీ చేసిన స్టాక్‌ ట్రాన్స్‌ఫర్‌ అడ్వైజ్, ట్యాంకర్‌తో పాటు అందులోని స్కిమ్డ్‌ వెయ్‌ బరువును సూచించే పత్రాలు మాత్రమే ఉన్నాయి. స్టాక్‌ ట్రాన్స్‌ఫర్‌ అడ్వైజ్‌లో ఆ ట్యాంకర్‌లోని పదార్థం స్కిమ్డ్‌ వెయ్‌గా పేర్కొన్న హెరిటేజ్‌..బరువు సూచించే పత్రంలో మాత్రం ‘పనీర్‌ వాటి’గా పేర్కొనడం గమనార్హం.

సారూప్యత ఉన్నా ఒకటి కాదు..
    స్కిమ్డ్‌ వెయ్, పనీర్‌ వాటికి మధ్య సారూప్యత ఉన్నప్పటికీ రెండూ ఒకటి కావు. స్కిమ్డ్‌ వే అనేది కొవ్వు తొలగించిన (స్కిమ్డ్‌) పాలతో చీజ్‌ లేదా కాసీన్‌ తయారీ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే వ్యర్థం కాగా.. పనీర్‌ వాటి అనేది పనీర్‌ తయారీ సమయంలో పాలు విరిగిన తర్వాత మిగిలిపోయే ద్రవం. ఇది సాధారణంగా పూర్తి కొవ్వు లేదా టోన్డ్‌ పాలతో తయారవుతుంది. పనీర్‌ తయారీలో నిమ్మరసం, వెనిగర్‌ లేదా సిట్రిక్‌ యాసిడ్‌ వంటి ఆమ్ల పదార్థాలను ఉపయోగించడం వల్ల ఈ ద్రవం స్కిమ్డ్‌ వెయ్‌తో పోలిస్తే ఎక్కువ ఆమ్లత్వం (యాసిడిటీ) కలిగి ఉంటుంది.

దీనిపై శ్రీ సహదేవ్‌సింగ్‌ నగర్‌ కాలనీ వాసులు ఆ ట్యాంకర్‌ డ్రైవర్‌ను నిలదీశారు. అతడు తనకు ఏమీ తెలియని, తన యజమాని చెప్పినట్లు చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో అక్కడకు వచి్చన గస్తీ పోలీసులు ట్యాంకర్‌ డ్రైవర్‌ను మందలించి పంపారు. పాల పరిశ్రమలు, డెయిరీలు తమ ద్రవ వ్యర్థాలను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం శుద్ధి చేసి మాత్రమే విడుదల చేయాల్సి ఉండగా.. ఇలా బహిరంగ ప్రదేశాల్లో, నీటి వనరుల్లో విడిచిపెట్టడం పర్యావరణ చట్టాల ఉల్లంఘనే అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేస్తాం
ఇప్పటికీ ట్యాంకర్లు అర్ధరాత్రి సమయంలో వచ్చి వ్యర్థాలను డంప్‌ చేసి వెళ్తున్నాయి. కొన్నాళ్లుగా వీటి రాకపోకలు గమనిస్తున్నాం. గత సోమవారం డంప్‌ చేసి తిరిగి వస్తున్న సమయంలో అడ్డుకుంటే హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ నుంచి వస్తున్న డెయిరీ వ్యర్థాలుగా తెలిసింది. దీనిపై సంబంధిత ప్రభుత్వ శాఖలకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించాం. – ఎం.నవీన్‌రెడ్డి, శ్రీ సహదేవ్‌సింగ్‌ నగర్‌ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement