బేగంపేటలో ఆగమాగం! | Heavy Traffic Jam At Begumpet, Public Suffering With This Traffic, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

బేగంపేటలో ఆగమాగం!

Jun 19 2025 9:54 AM | Updated on Jun 19 2025 12:24 PM

Heavy Traffic Jam At Begumpet

వాహనాలు ముందుకు కదిలితే ఒట్టు

 ప్రధాన రహదారిలో ట్రా‘ఫికర్‌’ తీరేదెన్నడో 

 ప్రస్తుత అవసరాలకు సరిపోని ఫ్లైఓవర్లు 

ప్రత్యామ్నాయ రహదారుల అభివృద్ధి తప్పనిసరి

హైదరాబాద్: బేగంపేట ప్రధాన రహదారి అంటే వీఐపీ, వీవీఐపీల రాకపోకలకు ప్రధాన రాస్తా. ఒక్క నిమిషం ట్రాఫిక్‌ ఆగిందంటే.. క్షణాల్లో వాహనాలు బారులుదీరుతాయి. దీనికి కారణం వాహన విస్ఫోటానికి తగ్గట్లుగా రహదారుల అభివృద్ధి జరగం లేదు. రోడ్ల మీదకు వచ్చే వాహనాల సంఖ్య అంతకంతకూ పెరుగుతుందే తప్ప రహదారుల విస్తరణ మాత్రం అలాగే ఉంటోంది. ఫలితంగా నత్తకు నడక నేరి్పస్తున్నట్లుగా తయారైంది వాహనదారుల ప్రయాణం. ఇక చినుకు పడిందంటే చాలు.. ట్రాఫిక్‌ చిక్కులు చుక్కలు చూపిస్తాయి. ఈ పరిస్థితి బేగంపేట ప్రధాన రహదారిలో సర్వసాధారణంగా మారింది.  

వీఐపీలు.. వీవీఐపీలతో.. 
బేగంపేట రహదారి అంటేనే వాహనదారులు వామ్మో అనాల్సిందే. సికింద్రాబాద్, హైదరాబాద్‌లను కలిపే బేగంపేట ప్రధాన రహదారిపై  ట్రాఫిక్‌ సమస్య దినదిన గండం నూరేళ్లాయుష్షుగా మారింది. ప్రధానంగా ఢిల్లీతో పాటు ఏపీ, ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగించే వీవీఐపీలు, వీఐపీలు ఎక్కువగా బేగంపేట విమానాశ్రయాన్నే ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో సాధారణంగానే ఈ రహదారి రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఇక వీవీఐపీలు, వీఐపీలు వస్తున్నారంటే ముందుగానే ట్రాఫిక్‌ను ఆపేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక్క నిమిషం ట్రాఫిక్‌ ఆగినా చాంతాడంత వాహనాల క్యూ నిలిచిపోతుంది. ఈ ప్రభావం కొన్ని గంటల పాటు ఉంటుంది. ట్రాఫిక్‌ను క్లియర్‌ చేయడానికి పోలీసులు కూడా నానా కష్టాలు పడాల్సిందే.  

వర్షాకాలంలో అయితే ఈ దారిలో ప్రయాణం అంటే సాహసంతో కూడుకున్నదే.  ఎందుకంటే చినుకు పడిందంటే చాలు..కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచి నరకం అంటే ఏమిటో వాహనదారులు చవిచూస్తున్నారు. అటు సికింద్రాబాద్‌ వైపు నుంచి బేగంపేట మీదుగా అమీర్‌పేట, పంజగుట్ట, బల్కంపేట, సనత్‌నగర్‌ వైపు వెళ్ళే వాహనాలు, ఇటు సికింద్రాబాద్‌ వైపు వెళ్లే వాహనాలతో ఎప్పుడు చూసినా రద్దీగానే కనిపిస్తుంది. ఈ రహదారిలో ఫ్లైఓవర్లు ఉన్నా ప్రస్తుత రవాణా అవసరాలను తీర్చలేకపోతున్నాయి. 

ముఖ్యంగా బేగంపేట పీ అండ్‌ టీ ఫ్లైఓవర్‌ వద్ద, రసూల్‌ ఫురా మెట్రో స్టేషన్‌ వద్ద ఒకవైపు మెట్రో పిల్లర్లు రోడ్డు మధ్యలో ఉండడం, మరోవైపు బాటిల్‌ నెక్‌ను తలపించేలా ఉండడంతో ఇక్కడకు వచ్చేసరికి వాహనాల వేగం ఒక్కసారిగా కుంటుపడుతుంది. దీంతో ఆ ప్రభావంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయే పరిస్థితులకు దారితీస్తోంది. ఇక ఏదైనా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తే మాత్రం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

ప్రత్యామ్నాయ మార్గాలే శరణ్యం..  
వాహనదారుల అవసరాలను ఇక్కడ ఫ్లైఓవర్లు, రహదారులు తీర్చలేకపోతున్నాయి.  ఈ క్రమంలో పలు ప్రత్యామ్నాయ రహదారులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రసూల్‌పురా చౌరస్తా నుంచి పాటిగడ్డ మీదుగా గతంలో రోడ్డును అభివృద్ధి చేయాలని నిర్ణయించినా అది ప్రతిపాదనలకే పరిమితమైందే తప్ప పట్టాలెక్కలేదు. ఈ మార్గంలో ఫ్లైఓవర్‌ నిర్మించడం ద్వారా పంజగుట్ట వైపు వెళ్లే వాహనదారులకు సులువవడంతో పాటు బేగంపేట రహదారిపై ఒత్తిడి తగ్గుతుంది. ఇక్కడి ఫ్లైఓవర్‌ నిర్మాణ ప్రతిపాదనపై ఇటీవల జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కర్ణన్‌ ఈ ప్రాంతంలో పర్యటించి ఈ ప్రాజెక్టు అమలుపై దృష్టిసారించడం ముదాహవం. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే బాగుంటుందని వాహనదారులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement