వేడుకగా బ్యూటీ విత్‌ చారిటీ | Heart of Gold event for 200 orphaned children | Sakshi
Sakshi News home page

వేడుకగా బ్యూటీ విత్‌ చారిటీ

May 29 2025 12:52 AM | Updated on May 29 2025 9:18 AM

Heart of Gold event for 200 orphaned children

మిస్‌ వరల్డ్‌ వేదికపై వినూత్న కార్యక్రమం 

200 మంది అనాథ పిల్లల కోసం ‘హార్ట్‌ ఆఫ్‌ గోల్డ్‌’ఈవెంట్‌ 

రూ.2 కోట్ల చెక్కు, పిల్లలకు 200 కిట్లు అందజేసిన దాతలు 

పిల్లలతో ఆడి, పాడిన సుందరీమణులు..సెల్ఫీలు, వీడియోలు 

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ సుందరి అంటే అత్యంత అందమైన అమ్మాయనే కాదు.. అంతకు మించిన మానవీయ విలువలున్న హృదయం, స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం అని మిస్‌ వరల్డ్‌ వేదిక నినదిస్తోంది. బుధవారం హైదరాబాద్‌లోని ట్రైడెంట్‌ హోటల్‌ వేదికగా నిర్వహించిన ‘హార్ట్‌ ఆఫ్‌ గోల్డ్‌’చారిటీ ఈవెంట్‌ అలాంటి వ్యక్తిత్వాలను, మనస్సులను ప్రతిబింబించింది. మిస్‌ వరల్డ్‌ పోటీదారులతో నిర్వహించిన ఈ వినూత్న కార్యక్రమం ద్వారా.. ఫార్చ్యూన్‌ హాస్పిటాలిటీ, సుదీక్ష ఎస్టేట్స్‌ సంస్థల సహకారంతో ప్రభుత్వ బాలసదన్‌లకు చెందిన 200 మంది అనాథ పిల్లలకు ఏడాది పాటు సహాయం చేసేందుకు స్పాన్సర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. 

ఈ కార్యక్రమంలో భాగంగా ఒక్కో చిన్నారికి పాఠ్య పుస్తకాలు, పోషకాహారం, ప్రోటీన్‌ పౌడర్, సప్లిమెంట్లు, నెలవారీ రేషన్‌ సరఫరా, దుస్తులు, స్వెటర్లు, రెయిన్‌ కోట్లు, డ్రెస్సులు, స్కూల్‌ కిట్లు (స్కూల్‌ బ్యాగ్‌లు, వాటర్‌ బాటిళ్లు, టిఫిన్‌ బాక్స్‌లు), టాయిలెట్రీలు, డిజిటల్‌ వాచ్‌లు, విద్యా సంబంధిత ఆట బొమ్మలు, వ్యక్తిగత వస్తువుల కోసం ట్రాలీ బ్యాగ్‌లతో కూడిన ఒక్కొక్కటి దాదాపు రూ.25 వేల విలువైన 200 కిట్లను చిన్నారులకు అందించి సామాజిక బాధ్యతకు నిదర్శనంగా నిలిచింది. 

ఐసీడీఎస్‌ బాలసదన్‌ల చిన్నారులకు మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంట్‌లు కిట్‌లు అందించడంతో పాటు ఆ చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించారు. ఆ పసి హృదయాల సంతోషాన్ని, బాధను పంచుకున్నారు. కష్టాలను అధిగమించి తమలాగే ప్రపంచ వేదికలపై ప్రత్యేకతను చాటుకునేలా ఎదగాలంటే చదువొక్కటే మార్గమని, ఆ దారిలో విశ్వాన్ని చదివేయొచ్చనే సందేశాన్ని తెలియజేశారు.

పిల్లలు అడిగిన పలు ప్రశ్నలకు ‘థింక్‌ బిగ్, థింక్‌ డిఫరెంట్‌.. అచీవ్‌ గోల్స్‌’అంటూ స్ఫూర్తిదాయక సందేశాన్ని ఇచ్చారు. కాగా 200 మంది విద్యార్థులకు కిట్లతో పాటు ఏడాది పాటు అన్ని విధాలా సహకరించేందుకువ వీలుగా రూ.2 కోట్ల చెక్కును మిస్‌ వరల్డ్‌ క్రిస్టీనా చేతుల మీదుగా దాతలు అందజేశారు. విక్టోరియా మెమోరియల్‌ పాఠశాల పూర్తిస్థాయి పునరుద్ధరణకు కూడా దాతలు ముందుకు వచ్చారు.  

తెలుగు పాటలకు స్టెప్పులేస్తూ.. 
వికారాబాద్, నారాయణపేట జిల్లాల ప్రభుత్వ ఐసీడీఎస్‌ బాలసదన్‌లలోని అనాథ చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంట్‌లను కలిసే అవకాశం చిన్నారులకు కల్పించాలని ప్రభుత్వం ప్రత్యేకంగా ‘హార్ట్‌ ఆఫ్‌ గోల్డ్‌’పేరిట ఈ చారిటీ కార్యక్రమాన్ని చేపట్టింది. కాగా మిస్‌ వరల్డ్‌ పోటీదారులు చిన్నారులతో ముచ్చటిస్తూ, వారితో కలిసి ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ ఉల్లాసంగా గడిపారు. 

చిన్నారులను తమ ఒడిలో కూర్చోబెట్టుకొని సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. మిస్‌ వరల్డ్‌ పోటీదారుల్లో చాలవరకు సామాజిక సేవలో ఉన్నవారు కాబట్టి ఈ పసి హృదయాలతో ఆత్మీయంగా ముచ్చటించారు. లైవ్‌ బ్యాండ్‌ అందించింన సంగీతానికి, తెలుగు పాటలకు వారు చిన్నారులతో కలిసి నృత్యం చేయడం హైలెట్‌గా నిలిచింది. కొందరైతే చిన్నారుల దగ్గర స్టెప్స్‌ నేర్చుకుని మరీ నర్తించారు. 

నేటి చారిటీ కార్యక్రమం బ్యూటీ విత్‌ పర్పస్‌ సారాన్ని ప్రతిబింబించింది. మిస్‌ వరల్డ్‌ పోటీదారులు చిన్నారులతో మమేకమైన తీరు వారి సేవా నిబద్ధతను చాటింది. ఈ పోటీల్లో భాగంగా ఇంతటి ప్రభావవంతమైన సేవా కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది. – జూలియా మోర్లే, మిస్‌ వరల్డ్‌ సంస్థ చైర్‌పర్సన్, సీఈఓ.

మిస్‌ వరల్డ్‌ సంస్థతో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉంది. రూ.2 కోట్ల విలువైన సేవా కార్యక్రమాలకు మేం కట్టుబడి ఉన్నాం. దశల వారీగా ఈ సేవా కార్యక్రమాలను విస్తరిస్తాం.  – డాక్టర్‌ రామకృష్ణ, ఫార్చ్యూన్‌ హాస్పిటాలిటీ చైర్మన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement