ఫార్మా సిటీ భూములతో రియల్‌ దందా చేస్తావా.. | Harish Rao Comments On Revanth Reddy | Sakshi
Sakshi News home page

ఫార్మా సిటీ భూములతో రియల్‌ దందా చేస్తావా..

Oct 4 2024 4:48 AM | Updated on Oct 4 2024 4:48 AM

Harish Rao Comments On Revanth Reddy

అనుయాయులకు 10వేల ఎకరాలు కట్టబెట్టాలని చూస్తున్నాడు

డప్పూరు ఫార్మా విలేజ్‌కు వ్యతిరేకంగా గ్రీన్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తాం 

మాజీ మంత్రి హరీశ్‌రావు

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఫార్మాసిటీ కోసం హైదరాబాద్‌కు సమీపంలో సేకరించిన 15 వేల ఎకరాల భూములతో సీఎం రేవంత్‌రెడ్డి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలని చూస్తున్నారని, ఇందులో పది వేల ఎకరాలు తన అనుయాయులకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మాజీమంత్రి టి.హరీశ్‌రావు ఆరోపించారు. రేవంత్‌రెడ్డి.. నువ్వు సీఎంవా, రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌వా అంటూ హరీశ్‌ నిలదీశారు. రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని, ఇప్పుడు ఫార్మా విలేజ్‌ పేరుతో డప్పూరుపై ఈ రాయి పడిందన్నారు. 

సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలం డప్పూరులో ఫార్మా విలేజ్‌ ఏర్పాటుతో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు మద్దతు గా జరిగిన రచ్చబండకు హరీశ్‌రావు హాజర య్యారు. ప్రభుత్వం సేకరిస్తున్న పంట పొలా లను పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్‌ రావు మాట్లాడుతూ పచ్చని పల్లెల్లో ఫార్మా విలేజీ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిర్వాసితుల తరఫున న్యాయపోరాటం చేస్తామన్నారు. ఇందుకోసం గ్రీన్‌ ట్రిబ్యునల్‌తో పాటు, హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని చెప్పారు. 

వచ్చే అసెంబ్లీ సమా వేశాల్లో దీనిపై మాట్లాడతామని, మూడు పంటలు పండుతున్న ఈ భూముల్లో ఫార్మా పరిశ్రమ ఏర్పాటు చేయొద్దని, బలవంతంగా భూములను తీసుకోవాలని ప్రయత్నిస్తే బాధి తుల పక్షాన పోరాటాలు చేస్తామన్నారు. మూసీ ని శుద్ధి చేస్తానని చెప్పి అక్కడి పేదల ఇళ్లు కూల్చి వేస్తున్న రేవంత్‌రెడ్డి.. డప్పూరు పచ్చని పంట పొలాల్లో ఫార్మా విలేజ్‌ ఏర్పాటు చేసి ఇక్కడి చెరువులు, కుంటలు, పక్కనే ఉన్న మంజీర నదిని విషంతో నింపుతావా అని హరీశ్‌రావు నిలదీశారు. 

రాహుల్‌.. రేవంత్‌కు బుద్ధి చెప్పు..
‘మూసీ ప్రాజెక్టు పేరుతో పేదల ఇళ్లు కూలగొట్టుడు.. వారి భూములు కొల్ల గొట్టడమే ఇందిరమ్మ రాజ్యమా ’అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇందిరమ్మ గరీబీ హఠావో అంటే.. రేవంత్‌రెడ్డి గరీబోంకో హఠావో చేస్తున్నారని మండిపడ్డారు. పేదల భూములు లాక్కోవొద్దని రేవంత్‌రెడ్డికి రాహుల్‌గాంధీ బుద్ధి చెప్పాలని డిమాండ్‌ చేశారు. హరీశ్‌ వెంట ఆ పార్టీ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఉమ్మడి మెదక్‌ జిల్లా డీసీఎంఎస్‌ చైర్మన్‌ మల్కాపూరం శివకుమార్‌ తదితరులు ఉన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement