విద్యార్థులు తగ్గుతున్నారు | Government schools decline in Telangana | Sakshi
Sakshi News home page

విద్యార్థులు తగ్గుతున్నారు

Jun 17 2025 12:51 AM | Updated on Jun 17 2025 12:52 AM

Government schools decline in Telangana

ఇదీ సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం మొగ్గాయిగూడెం ప్రాథమిక పాఠశాల. విద్యార్థుల్లేరని గతేడాది మూసేశారు. అక్కడున్న ఇద్దరు టీచర్లను సమీపంలోని పాఠశాలలో సర్దుబాటు చేశారు.గ్రామంలోని 15 మంది విద్యార్థులను వారి తల్లిదండ్రులు ఇంగ్లిష్‌ మీడియం కోసం ప్రైవేట్‌ స్కూల్‌కు పంపిస్తున్నారు.

గతంలో మూతపడిన స్కూళ్లు ఈసారైనా తెరుచుకునేనా? 

గతేడాది విద్యార్థుల్లేక, పది మందికంటే తక్కువ ఉండి మూతపడినవి 1,980 

విద్యార్థులను చేర్పించి అందులో కొన్నింటిని ప్రారంభిస్తున్న యంత్రాంగం 

మిగతా పాఠశాలలు ఈసారైనా తెరుచుకునేనా?

ప్రభుత్వ పాఠశాలల్లో ఏటేటా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. ఇంగ్లిష్‌ మీడియం ప్రారంభిస్తున్నా విద్యార్థుల తల్లిదండ్రుల్లో ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం కలగడం లేదు. దీంతో ప్రభుత్వ స్కూళ్లకు మూసివేత ప్రమాదం పొంచి ఉంది. గడిచిన నాలుగేళ్లలో ఒక్క నల్లగొండ జిల్లాలోనే 310 వరకు స్కూళ్లు జీరో ఎన్‌రోల్‌మెంట్‌తో మూతపడ్డాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పాఠశాలల్లో విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న కారణంతో గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా సర్దుబాటు చేయగా దాదాపు 1,980 స్కూళ్లు మూతపడ్డాయి. ఇక విద్యా సంవత్సరంలోనూ మరిన్ని స్కూళ్లపైనా మూసివేత కత్తి వేలాడుతోంది.     – సాక్షి ప్రతినిధి, నల్లగొండ

సిద్దిపేటలో తెరుచుకున్నస్కూళ్లు
సిద్దిపేట జిల్లాలో 12 జీరో ఎన్‌రోల్‌మెంట్‌ స్కూళ్లు ఈసారి తెరుచుకున్నాయి. అక్కన్నపేట మండలం రేగొండ ప్రాథమిక పాఠశాల గత ఏడాది జీరో ఎన్‌రోల్‌మెంట్‌తో మూతపడింది. టీచర్లు గ్రామంలో అవగాహన కల్పించి 35 మంది విద్యార్థులను చేర్పించారు. ఆ పాఠశాలను ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రారంభించారు.

అత్యధికంగా వరంగల్‌లో మూసివేత 
2024–25 విద్యా సంవత్సరంలో అత్యధికంగా వరంగల్‌ జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూత పడ్డాయి. 135 స్కూళ్లు విద్యార్థుల్లేక, తక్కువ మంది (పది మందిలోపే) విద్యార్థులు ఉండటంతో టీచర్లు, విద్యార్థుల సర్దుబాటుతో అవి మూత పడ్డాయి.

ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలో 94 స్కూళ్లు మూతపడ్డాయి. నల్లగొండ జిల్లాలో 24, మంచిర్యాల జిల్లాలో 32, ఆసిఫాబాద్‌లో 34, నిర్మల్‌లో 48, నిజామాబాద్‌లో 38, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 89, కరీంనగర్‌ జిల్లాలో 50, రాజన్నసిరిసిల్లలో 18, జగిత్యాలలో 61, పెద్దపల్లిలో 29, హనుమకొండలో 41, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 48, నాగర్‌కర్నూల్‌లో 15, వనపర్తిలో 33, గద్వాలలో 4, నారాయణపేటలో 37 స్కూళ్లు మూత పడ్డాయి.  

మూడేళ్లలో గణనీయంగా తగ్గిన విద్యార్థులు 
ప్రభుత్వ పాఠశాలలు మూత పడుతూనే ఉండగా, ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. గడిచిన మూడేళ్ల గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. విద్యాశాఖ లెక్కల ప్రకారమే 2022–23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 30,09,212 మంది విద్యార్థులు ఉంటే ప్రస్తుతం వారి సంఖ్య 23,71,772కు తగ్గిపోయింది. అదే క్రమంలో ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యా ర్థుల సంఖ్య 37,26,220కి పెరిగింది.

ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లలో పెరిగిన విద్యార్థులు  
ఖమ్మం జిల్లాలోనూ రామలింగాలపల్లి క్రాస్‌ రోడ్డు, ఆలియాతండా, గంగారంతండా కొత్తతండా పాఠశాలలు మూతపడ్డాయి. అయితే ఓవరాల్‌గా చూస్తే ఈ మూడేళ్లలో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రైవేటు స్కూళ్లలోనూ రెట్టింపు స్థాయిలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2022–23లో ప్రభుత్వ స్కూళ్లలో 1,08,715 మంది విద్యార్థులు ఉంటే వారి సంఖ్య 2024–25లో 1,10,934కు పెరిగింది. ప్రైవేట్‌ స్కూళ్లలో గతంలో 1,22,781 మంది ఉంటే 1,26,421కి పెరిగింది.  

ఏటేటా పెరుగుతున్న జీరో ఎన్‌రోల్‌మెంట్‌ 
ప్రభుత్వ పాఠశాలల్లో జీరో ఎన్‌రోల్‌మెంట్‌ ఏటేటా పెరుగుతోంది. అక్కడక్కడ బడిబాటలో టీచర్లు విద్యార్థుల తల్లిదండ్రులను ఒప్పించి ఒకటీ రెండు మూత పడిన స్కూళ్లను తెరిపిస్తున్నా, వందల సంఖ్యలో మూత పడుతూనే ఉన్నాయి. 

2021–22 విద్యా సంవత్సరంలో జీరో ఎన్‌రోల్‌మెంట్‌ స్కూళ్ల సంఖ్య 1,086 ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య రెట్టింపునకు దగ్గరైంది.  
జీరో ఎన్‌రోల్‌మెంట్‌ స్కూళ్ల సంఖ్య 2022–23 విద్యా సంవత్సరంలో 1,307కు పెరగగా, 2023–24 సంవత్సరంలో 1,745కు, 2024–25 సంవత్సరంలో వాటి సంఖ్య 1,980కి పెరిగింది.  
 ఈ నెల 19 వరకు నిర్వహించే బడిబాట తర్వాత వాటిల్లో ఎన్ని తెరుచుకుంటాయో, ఈసారి ఎన్ని స్కూళ్లు మూత పడతాయో త్వరలోనే తేలనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement