ప్రజారోగ్య డైరెక్టర్‌పై విచారణ | Government orders inquiry against Ravinder Naik | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్య డైరెక్టర్‌పై విచారణ

Mar 30 2025 2:09 AM | Updated on Mar 30 2025 2:09 AM

Government orders inquiry against Ravinder Naik

రవీందర్‌ నాయక్‌పై విచారణకు ప్రభుత్వం ఆదేశం 

మరో ఆరుగురు డీహెచ్‌ ఉద్యోగులపైన కూడా.. 

సాక్షి, హైదరాబాద్‌: వైద్య, ఆరోగ్యశాఖలో కీలకమైన ప్రజారోగ్య సంచాలకుడు (డీహెచ్‌) డాక్టర్‌ రవీందర్‌ నాయక్‌తోపాటు ఆరుగురు ఉద్యోగులపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. సీనియారిటీ జాబితాలో మొదటి వరుసలో ఉన్న ఆయనను కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డీహెచ్‌గా నియమించింది. ఆయన హయాంలో ఉద్యోగుల డిçప్యుటేషన్లు, బదిలీలలో అనేక అక్రమాలు జరిగాయని, డిప్యుటేషన్లు లేవంటూనే జోన్లు, క్యాడర్‌ పోస్టులతో సంబంధం లేకుండా ఉద్యోగులను బదిలీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో గతంలోనే మెమో ఇచ్చి విజిలెన్స్‌ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం.. తాజాగా పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల కమిషనర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ను ఆదేశించింది. ఆయనతో పాటు డీహెచ్‌ కార్యాలయంలో పనిచేసే మరో ఆరుగురిపై కూడా విచారణకు ఆదేశిస్తూ 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  

అవినీతి ఆరోపణలు, అక్రమ డిప్యుటేషన్లు 
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పారామెడికల్‌ బోర్డు కార్యదర్శిగా కీలక హోదాలో రవీందర్‌ నాయక్‌ పనిచేశారు. ఆ సమయంలో పారా మెడికల్‌ బోర్డులో అక్రమాలు, అవినీతి చోటుచేసుకున్నట్లు ఫిర్యాదు లు రావడంతో పలువురు అధికారులను బదిలీ చే శారు. రవీందర్‌ నాయక్‌ను కూడా ఆ హోదా నుంచి తప్పించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వా త ఆరోగ్యశాఖకు డైరెక్టర్‌గా ఇన్‌చార్జి హోదాలో ఆయన వచ్చారు. 

గతేడాది ఆరోగ్యశాఖలో జరిగిన సాధారణ బదిలీల్లో డీహెచ్‌ ఆఫీస్‌ వేదికగా అక్ర మాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. డీహెచ్‌ కార్యాలయంలోనే కీలక పోస్టుల్లో పనిచేసిన మరో ఆరుగురు ఉద్యోగులకు ఈ అక్రమాల్లో పాత్ర ఉన్న ట్లు ఆరోపణలు వచ్చాయి. వీరిలో ఇద్దరు అధికారులు అర్హత లేకున్నా డిప్యుటేషన్లపై డీహెచ్‌ కార్యా లయానికి వచ్చినట్లు తెలిసింది. 

ఈ పరిణామాలపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గత సంవత్సరం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించారు. విజిలెన్స్‌ నివేదిక అనంతరం గత నవంబర్‌లో డీహెచ్‌తో పాటు మరో ఆరుగురికి చార్జి మెమోలు జారీ చేశారు. మెమోలకు వారిచి్చన వివరణలను పరిశీలించిన సర్కారు సంతృప్తి చెందకపోవడంతో మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశించింది.  

Advertisement
 
Advertisement
Advertisement