
2024–25లో రూ.84,610 కోట్లు ఇచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంకులు
సాక్షి, హైదరాబాద్: రైతులకు రుణాల మంజూరులో ప్రభుత్వ రంగ బ్యాంకులు ముందుంటూ ఆదుకుంటుంటే ప్రైవేటు బ్యాంకులు వెనుకంజలో ఉంటున్నాయి. ప్రైవేటు బ్యాంకులు అసలు రుణ మంజూరులో కాదు..రుణ మంజూరు లక్ష్యాలను నిర్దేశించుకోవడంలోనే ఉదాసీనంగా ఉంటున్నాయనే ఫిర్యాదులున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ కలిపి రూ.84,610 కోట్ల మేర రుణాలు ఇస్తే, ప్రైవేటు బ్యాంకులు కేవలం రూ.21,616 కోట్లు మాత్రమే ఇవ్వడం గమనార్హం.
రుణాల మంజూరుకు సంబంధించి 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ నిర్దేశిత లక్ష్యాలను 98.41 శాతం నెరవేర్చగా, 21 ప్రైవేటు రంగ బ్యాంకులు మొత్తంగా 84 శాతం అందుకున్నాయి. అయితే ఒకటీ రెండు బ్యాంకులు తమ నిర్దేశిత లక్ష్యాలకు చేరువగా రుణాలు మంజూరు చేయడంతో ఇది సాధ్యమైంది. కాగా కొన్ని ప్రైవేటు బ్యాంకులు రైతులకు రూపాయి కూడా రుణంగా ఇవ్వలేదు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) తాజా నివేదిక ఈ విషయం స్పష్టం చేస్తోంది.
లీడ్లో లీడ్ బ్యాంక్
రాష్ట్రంలోని 76 బ్యాంకులు వ్యవసాయ, అనుబంధ రంగాలు, మౌలిక సదుపాయాలకు రుణాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో 2024–25లో రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి రూ.1,52,052 కోట్ల రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకోగా, రూ.1,37,346 కోట్లు మాత్రమే ఇచ్చారు. ప్రభుత్వ రంగంలో లీడ్ బ్యాంక్గా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవసాయం, అనుబంధ, మౌలిక సదుపాయాల రంగాల్లో కలిపి అత్యధికంగా రూ.41,630 కోట్లు మంజూరు చేసింది. అయితే కేవలం వ్యవసాయం కోసం పంట రుణాల కింద కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ)ల ద్వారా 15.25 లక్షల మందికి రూ.11,146.35 కోట్లు ఇవ్వడం గమనార్హం.
మరే బ్యాంకు దాని దరిదాపుల్లోకి రాలేదు. ఇండియన్ బ్యాంక్ రూ.7,973 కోట్లతో రెండో స్థానంలో ఉండగా, కెనరా బ్యాంకు రూ.5,072 కోట్లతో మూడో స్థానంలో ఉంది. యూనియన్ బ్యాంక్ రూ.2,452 కోట్ల రుణాలను మంజూరు చేయగా, ఆ తర్వాతి స్థానాల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా (రూ.1,925.90 కోట్లు), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (రూ.1,116 కోట్లు) ఉన్నాయి. పంజాబ్ సింధు బ్యాంకు కేవలం 28 మందికి రూ.95 లక్షలు మంజూరు చేసింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా తక్కువ మొత్తంలోనే రుణాలు ఇచ్చాయి.
ప్రైవేటు బ్యాంకులు అంతంతే..
ప్రభుత్వ రంగంలోని బ్యాంకులతో పాటు వివిధ రంగాల్లోని బ్యాంకులు కూడా రైతులకు రుణాలు జారీ చేస్తున్నప్పటికీ అందులో పంట రుణాలకు ఇచ్చింది అంతంత మాత్రమే. 21 ప్రైవేటు రంగ బ్యాంకుల్లో కొన్ని జీరో రుణాలకే పరిమితం కాగా, కేవలం ఐదు బ్యాంకులే లక్ష్యాలకు కొంత చేరువగా వచ్చాయి. మిగతా బ్యాంకులన్నీ కలిపితే ఓ మోస్తరుగా మాత్రమే రుణాలను మంజూరు చేసినట్లు తేలింది. ప్రైవేటు రంగంలో రుణ మంజూరులో మొదటి స్థానంలో హెచ్డీఎఫ్సీ ముందుండగా, తర్వాత స్థానాల్లో ఐసీఐసీఐ, యాక్సిస్ నిలిచాయి.
ప్రైవేటు బ్యాంకుల రుణ లక్ష్యం రూ.25,731 కోట్లు కాగా, రూ.21,616 కోట్లు మాత్రమే ఇచ్చాయి. అయితే ఇందులో పంట రుణాల కింద ఇచి్చన మొత్తం 30 శాతం కంటే తక్కువేనని ఎస్ఎల్బీసీ నివేదిక వెల్లడించింది. ఇక సిటీ యూనియన్ బ్యాంకు, కరూర్ వైశ్య బ్యాంకు, సౌత్ ఇండియన్ బ్యాంకు, తమిళనాడు మర్కంటైల్ బ్యాంకు లాంటి కొన్ని బ్యాంకులు రైతులకు రూపాయి కూడా ఇవ్వలేదు.
గ్రామీణ బ్యాంకుల ద్వారా రూ.18,676 కోట్లు
రాష్ట్రంలో 2024–25లో రెండు గ్రామీణ బ్యాంకులు మనుగడలో ఉన్నాయి. తెలంగాణ గ్రామీణ బ్యాంకు (టీజీబీ), ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ (ఏపీజీవీబీ)లు విడివిడిగా రైతులకు రుణాలు ఇచ్చాయి. అయితే ఈ రెండు బ్యాంకులు గత డిసెంబర్లోనే విలీనం అయ్యాయి. ఇప్పుడు కేవలం తెలంగాణ గ్రామీణ బ్యాంకుగానే కొనసాగుతున్నాయి.
ఈ రెండు బ్యాంకులు కలిపి రూ. 26,500 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా, రూ.18,676 కోట్లు మాత్రమే ఇచ్చాయి. ఇందులో తెలంగాణ గ్రామీణ బ్యాంకు రూ. 11,014.91 కోట్లు, ఏపీజీవీబీ రూ.7,661.37 కోట్లు (70.47 శాతం)ఇచ్చాయి. అయితే విలీనం తర్వాత టీజీబీ ద్వారానే ఆర్థిక లావాదేవీలు నడిపిస్తున్నాయి. ఎస్బీఐ తరువాత రైతులకు చేరువైన ఏకైక బ్యాంకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు కాగా, ఇది ఎస్బీఐకే అనుబంధంగా కొనసాగుతుండడం గమనార్హం.
సహకార బ్యాంకుల రుణాలు రూ.10,297 కోట్లు
రాష్ట్రంలోని సహకార బ్యాంకులు గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.13,540 కోట్లు రుణంగా ఇవ్వాలని నిర్ణయించుకుని, రూ.10,297 కోట్లు ఇచ్చాయి. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టీఎస్కాబ్) పరిధిలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు (డీసీసీబీలు).. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్) ద్వారా నేరుగా రైతులకు వ్యవసాయ, అనుబంధ రంగాలకు రుణాలు అందిస్తాయి.
2024–25లో రూ.13,540 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుని రూ.10,297 కోట్లు మంజూరు చేశాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఏకంగా రూ.1,434 కోట్లు ఇచ్చాయి. అయితే ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కేవలం రూ.12 కోట్ల రుణ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం గమనార్హం. అలాగే విదేశీ బ్యాంకులు రూ.289 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకొని రూ.712 కోట్లు మంజూరు చేశాయి.