ఇంత నిరంకుశ, నిర్బంధ పాలనా? | Government attitude towards Group1 candidates is terrible says ktr | Sakshi
Sakshi News home page

ఇంత నిరంకుశ, నిర్బంధ పాలనా?

Oct 20 2024 4:39 AM | Updated on Oct 20 2024 4:39 AM

Government attitude towards Group1 candidates is terrible says ktr

గ్రూప్‌–1 అభ్యర్థుల పట్ల ప్రభుత్వ తీరు దారుణం: మాజీ మంత్రి కేటీఆర్‌ ఫైర్‌ 

జీవో 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ వర్గాల వారికి అన్యాయం 

బండి సంజయ్‌ను ముందుపెట్టి గ్రూప్‌–1 అభ్యర్థుల గొంతునొక్కే ప్రయత్నమని మండిపాటు 

లాలాపేట (హైదరాబాద్‌): ‘‘గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలను ఒక నెలో, రెండు నెలలో, సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునేవరకో వాయిదా వేస్తే మీ కొంపలేమీ మునిగిపోవు. రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్‌–1 అభ్యర్థులను పిలిచి వారి సహేతుకమైన కారణాలను అడిగి తెలుసుకోవాలి..’’అని మాజీ మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను, నిరుద్యోగులను పశువుల్లా చూస్తుండటం చాలా దారుణమని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ నాయకుల గొంతు నొక్కుతూ, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను మాత్రం రాచమర్యాదలతో అశోక్‌నగర్‌కు వెళ్లనిచ్చారని.. సీఎం రేవంత్, బండి సంజయ్‌ దోస్తులేనని స్పష్టమవుతోందని పేర్కొన్నారు. శనివారం తార్నాకలోని ఐఐసీటీ ఆడిటోరియంలో జరిగిన ఓ కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘జీవో నంబర్‌ 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు చెందిన అభ్యర్థులు భారీగా నష్టపోతున్నారు. కేసీఆర్‌ హయాంలో తీసుకువచ్చిన 95శాతం లోకల్‌ రిజర్వేషన్‌ను తుంగలో తొక్కుతున్నారు. తెలుగు అకాడమీ పుస్తకాలను కాకుండా వికీపీడియాను ప్రామాణికంగా తీసుకోవాలనే అర్థం లేని వాదనలు చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ. అభ్యర్థులు 4 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. 

వారిపట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు శోచనీయం. వారిలో కాబోయే డీఎస్పీలు, ఆర్డీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు ఉన్నారు. అలాంటి వారిని పశువుల్లాగా ప్రభుత్వం చూస్తుండటం దారుణం. అభ్యర్థులతో ముఖ్యమంత్రిగానీ, చీఫ్‌ సెక్రెటరీ, పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ చైర్మన్‌గానీ ఎవరైనా చర్చలకు పిలిచి మాట్లాడాలి. 

ఏమిటీ నిరంకుశ, నిర్బంధ పాలన? 
గతంలో రాహుల్‌ గాం«దీ, రేవంత్‌రెడ్డిలో అశోక్‌నగర్‌కు వెళ్లి ప్రభుత్వం ఏర్పాటైన తొలి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని పొంకనాలు కొట్టారు. నేడు కనీసం అభ్యర్థుల మాటలను ఆలకించని పరిస్థితి ఉంది. తెలంగాణ భవిష్యత్‌కు సారథులుగా వ్యవహరించే గ్రూప్‌–1 అభ్యర్థులనే ప్రభుత్వం ఇలా చూస్తుంటే.. మిగతా యువత పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలి. గ్రూప్‌–1 అభ్యర్థుల తరఫున సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశాం. 

సోమవారం వాదనలు జరగనున్నాయి. గతంలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కూడా మొండిగా గ్రూప్‌–1 పరీక్ష నిర్వహించింది. కోర్టు తీర్పుతో మళ్లీ నిర్వ హించాల్సి వచ్చిందని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవా లి. తమది ప్రజాపాలన అని, తమ ద్వారాలు తెరిచే ఉన్నాయంటూ ఫోజులు కొట్టిన రేవంత్‌రెడ్డి.. ఇప్పు డు ఎందుకింత నిరంకుశ, నిర్బంధ పరిస్థితులు తీసుకువచ్చారు?’’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

బండి సంజయ్‌కు గ్రూప్‌–1 పరీక్ష గురించే అర్థంకాదు.. 
రాష్ట్ర ప్రభుత్వం శిఖండి రాజకీయాల్లో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను ముందుపెట్టి గ్రూప్‌–1 అభ్యర్థుల గొంతునొక్కే ప్రయత్నం చేస్తోంది. బండి సంజయ్‌ ఏమన్నా చదువుకున్నారా.. పరీక్ష రాసింది ఉందా? గ్రూ ప్‌–1 పరీక్షపై ఆయనకు చెప్పినా అర్థంకాదు, పేపర్‌ లీకులు మాత్రం చేస్తారు. రాష్ట్ర ప్రభు త్వం బండి సంజయ్‌ వంటి వారితో కాదు. ఓ 10 మంది గ్రూప్‌–1 అభ్యర్థులతో మాట్లాడాలి. 

రైతు బంధు ఏదీ? 
రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక రైతులకు ఎలాంటి భరోసా లేకుండా పోయింది. ఇప్పటికీ రైతు బంధు ఇవ్వలేదు. బీఆర్‌ఎస్‌ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు భారత రైతు సమితి. తప్పకుండా రైతుల తరఫున పోరాడుతాం...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement