Ganesh Idol Immersion: హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనం.. ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా..

Ganesh Idol Immersion: Traffic Restrictions In Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్‌): బొజ్జ గణపయ్య నిమజ్జనోత్సవానికి సర్వం సన్నద్ధమైంది. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. లక్షలాది మంది ఈ శోభాయాత్రలో పాల్గొంటారని, సుమారు 320 కిలోమీటర్ల మేర గణేష్‌ శోభాయాత్ర జరుగుతుందని, ఆయా రహదారులలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రహదారుల మరమ్మతులు చేపట్టవలసిన ప్రాంతాలను గుర్తించి వెంటనే చేయాలని, విగ్రహాలకు అడ్డంగా ఉండే విద్యుత్‌ తీగలు, చెట్ల కొమ్మలు తొలగించాలని సూచించారు.

శుక్రవారం ట్యాంక్‌ బండ్, ఎన్టీఆర్‌ మార్గ్‌లో చేపట్టిన ఏర్పాట్లను మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్, కలెక్టర్‌ శర్మన్, వాటర్‌ వర్క్స్‌ అధికారి సత్యనారాయణ, వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో కలిసి మంత్రి పర్యవేక్షించారు. ట్యాంక్‌ బండ్‌పై ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిమజ్జనం ఏర్పాట్లను తెలియజేశారు. 

ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగే విధంగా పటిష్టమైన పోలీసు బందోబస్తు నిర్వహించనున్నట్లు చెప్పారు. సుమారు 19 వేల మంది వివిధ స్థాయిలలో పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు.  ప్రతి క్రేన్‌ వద్ద ఒక పోలీసు అధికారిని నియమించడంతో పాటు ప్రతి విగ్రహం వెంట నిమజ్జన యాత్రలో ఒక పోలీసు అధికారి ఉంటారు. నిమజ్జనం దృష్ట్యా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా  ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు.  

ఎంఎంటీఎస్‌ స్పెషల్‌ ... 
► ట్యాంక్‌బండ్‌కు తరలి వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా లింగంపల్లి– సికింద్రాబాద్, ఫలక్‌నుమా–సికింద్రాబాద్, లింగంపల్లి–నాంపల్లి రూట్లో  ఎంఎంటీఎస్‌ ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు.  
 ఆదివారం రాత్రి  11 గంటల వరకు ప్రతి 3 నిమిషాలకు ఒకటి చొప్పున  మెట్రో రైళ్లను అన్ని రూట్లలో నడుపనున్నట్లు  అధికారులు తెలిపారు.  

ప్రత్యేక బస్సులు.. 
► నిమజ్జనం సందర్భంగా  భారీగా తరలి రానున్న భక్తజనసందోహం కోసం  గ్రేటర్‌  ఆర్టీసీ  ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఆదివారం ఉదయం నుంచి నిమజ్జన వేడుకలు పూర్తయ్యే వరకు  565  ప్రత్యేక బస్సులను  నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 
 బషీరాబాగ్‌ – కాచిగూడ, బషీర్‌బాగ్‌–రాంనగర్, ఓల్డ్‌ ఎమ్మెల్యేక్వార్టర్స్‌–దిల్‌సుఖ్‌నగనర్, ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌–ఎల్‌బీనగర్, ఓల్డ్‌ ఎమ్మెల్యేక్వార్టర్స్‌ – వనస్థలిపురం, మిధాని రూట్లలో బస్సులు రాకపోకలు సాగించనున్నాయి.  
  ఉప్పల్‌– ఇందిరాపార్కు, మల్కాజిగిరి–ఇందిరాపార్కు,  ఇందిరాపార్కు నుంచి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్, జామై ఉస్మానియా వరకు 
► లక్డీకాపూల్‌ నుంచి టోలీచౌకి,ఖైరతాబాద్‌ నుంచి బీహెచ్‌ఈఎల్‌వరకు, లకిడికాఫూల్‌ నుంచి కొండాపూర్, యూసుఫ్‌గూడ, రాజేంద్రనగర్‌ రూట్లలో ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. 
  ఆల్‌ఇండియా రేడియో నుంచి కోఠీ, ఖైరతాబాద్‌ నుంచి జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, కూకట్‌పల్లి,బోరబండ, బాచుపల్లి,లింగంపల్లి, పటాన్‌చెరు. తదితర ప్రాంతాలకు  బస్సులు రాకపోకలు సాగించనున్నాయి.

నిమజ్జన మార్గాల్లో మళ్లింపు.. 
► పాతబస్తీ నుంచి  హుస్సేన్‌సాగర్‌ వరకు కొనసాగనున్న నిమజ్జన శోభాయాత్ర దృష్ట్యా పాతబస్తీ మీదుగా రాకపోకలు సాగించే బస్సులను అఫ్జల్‌గంజ్‌ వరకే పరిమితం చేస్తారు. 
► సికింద్రాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ మీదుగా వెళ్లే బస్సులు ఇందిరాపార్కు వరకు పరిమితమవుతాయి. ఉప్పల్‌ నుంచి మెహదీపట్నం వైపు  వెళ్లే బస్సులు కూడా ఇందిరాపార్కుకే  పరిమితమవుతాయి. 
  ప్రత్యేక బస్సులన్నింటికీ  ‘గణేశ్‌ నిమజ్జనం స్పెషల్‌’ అనే డెస్టినేషన్‌ బోర్డులను ఏర్పాటు చేస్తారు. అర్ధరాత్రి తరువాత కూడా  ఈ బస్సులు 
తిరుగుతాయి.  

హెచ్‌ఎండీఏ.. 
  హుస్సేన్‌సాగర్‌లోని విగ్రహాలు, పూజాసామాగ్రి తదితర వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించడంతోపాటు జీహెచ్‌ఎంసీ పారిశుధ్యవిభాగంతో సమన్వయంతో తరలిస్తుంది. 
   ఈ పనుల కోసం వెయ్యిమంది సిబ్బంది విధుల్లో ఉంటారు. 

వాటర్‌బోర్డు.. 
   101 ప్రాంతాల్లో తాగునీటి సదుపాయానికి జలమండలి ఏర్పాట్లు చేపట్టింది. 

గణేశ్‌ యాత్రలో ఇంకా.. 
  గణేశ్‌ శోభాయాత్ర మార్గంలో 38 ఫైర్‌ వాహనాలు ఉంచుతారు. 
  సరూర్‌నగర్, కాప్రా, ప్రగతినగర్‌ చెరువుల వద్ద బోట్లు అందుబాటులో ఉన్నాయి. 
 టూరిజం శాఖ ఆధ్వర్యంలో హుస్సేన్‌సాగర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు 3 బోట్లు, నెక్లెస్‌రోడ్‌ వైపు 2 బోట్లు అందుబాటులో. వీటితోపాటు 4 స్పీడ్‌బోట్లు.  10 మంది గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారు 
  విద్యుత్‌ విభాగం ఆధ్వర్యంలో హుస్సేన్‌సాగర్‌ చుట్లూ 48 ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు. సరూర్‌నగర్‌ చెరువు వద్ద 5 ట్రాన్స్‌ఫార్మర్లు. వీటితో సహా వివిధ ప్రాంతాల్లో మొత్తం 101 ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు 
  జీహెచ్‌ఎంసీ పరిధిలో దాదాపు రూ. 1.52 కోట్లతో 41284 తాత్కాలిక లైటింగ్‌ ఏర్పాట్లు.   

చదవండి: నా భర్తను వెతికి పెట్టండి: కెనడాలో తెలుగు మహిళ ఆవేదన

చదవండి: ఇదే చివరిసారి.. గణేశ్‌ నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top