
రాజధాని నగరంగా..తెలంగాణకు తలమానికంగా కీలకపాత్ర పోషిస్తున్న హైదరాబాద్ మహానగరంపై ప్రభుత్వం శీతకన్ను వేస్తోందా..అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. మహానగరాభివృద్ధిలో కీలకమైన జీహెచ్ఎంసీ నిర్వహణ తీరునే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. తరచుగా కమిషనర్లను మార్చడం..అభివృద్ధి పనులు నిలిచిపోవడం..నిధుల కొరత కారణంగా జీహెచ్ఎంసీ నిరీ్వర్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇలా చేయడంలో ప్రభుత్వం ఉద్దేశం ఏంటో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
బహుశా..ఎలాగూ రెండో, అంతకంటే ఎక్కువో కార్పొరేషన్లు చేసే యోచనలో ఉన్నందున కాబోలు ప్రభుత్వం జీహెచ్ఎంసీపై పెద్దగా శ్రద్ధ చూపుతున్నట్లు లేదు. పది నెలల వ్యవధిలోనే నలుగురు కమిషనర్లు రావడం అందుకు నిదర్శనమంటున్నారు జీహెచ్ఎంసీ గురించి తెలిసిన వారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేప్పటికి కమిషనర్గా ఉన్న రోనాల్డ్రాస్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ముగ్గురు కమిషనర్లు మారారు.
గత సంవత్సరం ఆగస్ట్లో కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి ఏపీకి వెళ్లాల్సి రావడంతో, అక్టోబర్లో అదనపు కమిషనర్గా నియమించిన ఇలంబర్తిని నవంబర్ 14 నుంచి రెగ్యులర్ కమిషనర్గా నియమించారు. ఐదు నెలల్లోనే ఆయన్ను బదిలీ చేసి ఆర్వీ కర్ణన్ను తాజాగా నియమించారు. కారణాలేవైనా తరచూ కమిషనర్లు మారుతుండటంతో పరిస్థితి గందరగోళంగా మారింది. 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 డివిజన్లతో ఉన్న జీహెచ్ఎంసీలో ఆరువేల మందికి పైగా రెగ్యులర్ ఉద్యోగులున్నారు. ఔట్సోర్సింగ్, ఇతరత్రా వెరసి 30 వేల మంది వరకున్నారు. ఇంతపెద్ద వ్యవస్థను అర్థం చేసుకోవడానికే కనీసం ఆర్నెళ్లు పడుతుంది. ఆలోగానే మారిస్తే..కొత్తగా వచ్చేవారికి అదే పరిస్థితి ఎదురవుతుంది.
తనదైన శైలితో..
ప్రస్తుతం జీహెచ్ఎంసీ నుంచి బదిలీ అయిన ఇలంబర్తి.. గతంలో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్గా పనిచేసిన అనుభవంతో కావచ్చు పాలనలో లోపాల్ని, ఇష్టారీతిన జరుగుతున్న వ్యవహారాల్ని, పెచ్చరిల్లిన అవినీతిని అడ్డుకునేందుకు నిశ్శబ్దంగానే పలు కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాదు.. సంస్థ ఆస్తులెన్నో తెలియని దిక్కుమాలిన స్థితిలో ఉన్న జీహెచ్ఎంసీని చక్కదిద్దే చర్యలకు శ్రీకారం చుట్టారు. ఆధునిక సాంకేతికతతో అంగుళం కూడా తేడా రాకుండా జీహెచ్ఎంసీ ఆస్తుల్ని గుర్తించే పనుల్ని చేపట్టారు. ఇంజినీరింగ్ పనుల్లో, కాంట్టాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో లోపాలకు అడ్డుకట్ట వేశారు. బర్త్, డెత్ సర్టిఫికెట్లలో అవకతవకల నివారణకు చర్యలు చేపట్టారు. స్ట్రీట్లైట్స్, సీఆర్ఎంపీ పనుల్లో అడ్డగోలు చెల్లింపులను గుర్తించి కట్టడి చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఉన్నాయి. అవన్నీ గాడిన పడి ఒక దశకు రాకముందే ఆయన్ను బదిలీ చేయడంతో..కొత్త కమిషనర్కు పరిస్థితి మళ్లీ మొదటికొచి్చంది.
వదలరు.. కదలరు
సుదీర్గకాలంగా జీహెచ్ఎంసీలో పాతుకుపోయిన వారి కొందరి ఆట కట్టించేందుకు తగిన చర్యలు తీసుకున్నారు.రిటైరయ్యాక సైతం జీహెచ్ఎంసీలో కొనసాగుతున్న వారందరినీ పంపించాలని,ఒకవేళ వారి సేవలు నిజంగా అవసరమైతే అందుకు కారణాలు తెలపాలని,ప్రభుత్వం అనుమతించాక తిరిగి కొనసాగించాలని గత నెలలో ప్రభుత్వం సూచించినప్పటికీ, జీహెచ్ఎంసీలో మాత్రం ఎక్కడి వారక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు ఇరవై మంది సేవలు మళ్లీ అవసరమని కోరినప్పటికీ, ప్రభుత్వం నుంచి అనుమతి రాకుండానే వారు కొనసాగుతూనే ఉన్నారు. మిగతా ప్రభుత్వ విభాగాల్లో ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాక అలాంటి వారు కొనసాగుతుండగా, జీహెచ్ఎంసీలో మాత్రం అందుకు విరుద్ధంగా నడుస్తుండటం ఈ సందర్భంగా గమనార్హం. అలా కొనసాగుతున్న వారిలో కొందరు జీహెచ్ఎంసీకి పనులు చేయడం కంటే, జీహెచ్ఎంసీని అడ్డుపెట్టుకొని సొంత ప్రయోజనాల కోసం సాగిస్తున్న ‘ప్రైవేట్’ దందానే ఎక్కువని జీహెచ్ఎంసీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఇప్పుడిప్పుడే..
ఇలంబర్తి చేపట్టిన కొన్ని చర్యలు తొలుత అర్థం కాకపోయినప్పటికీ, కనిపిస్తున్న ఫలితాలతో జీహెచ్ఎంసీ మెరుగవుతోందనుకుంటున్న తరుణంలో బదిలీ కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచి్చంది. రోనాల్డ్రాస్, ఆమ్రపాలి సైతం జీహెచ్ఎంసీని అర్థం చేసుకొని, గాడిలో పెట్టే తరుణంలోనే జీహెచ్ఎంసీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. ప్రభుత్వానికి అప్పట్లో వారిని పంపించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడలాంటి పరిస్థితి లేకున్నా ఇలంబర్తి బదిలీతో జీహెచ్ఎంసీ పరిస్థితి ఏం కానుందో వేచి చూడాల్సిందే !