సర్వే నంబర్లు గాయబ్‌! | Farmers complaint at Bhu bharathi conferences | Sakshi
Sakshi News home page

సర్వే నంబర్లు గాయబ్‌!

Jun 23 2025 1:14 AM | Updated on Jun 23 2025 1:14 AM

Farmers complaint at Bhu bharathi conferences

1.26 లక్షల.. సర్వే నంబర్ల మాయంపై భూభారతి సదస్సుల్లో రైతుల ఫిర్యాదు

8 లక్షల దరఖాస్తుల్లో ఈ తరహావి 15%

ధరణి పోర్టల్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ఆన్‌లైన్‌లో నమోదు కాని వైనం

సాదాబైనామాల కింద రిజిస్ట్రేషన్లు కోరిన వారు 2.42 లక్షలు

సాక్షి, హైదరాబాద్‌: ఒకటి కాదు...రెండు కాదు.. రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు సంబంధించిన లక్షకు పైగా సర్వే నంబర్లు గల్లంతయ్యాయి. పాత రికార్డుల్లో ఉన్నా కొత్త రికార్డుల్లోకి ఇవి ఎక్కలేదు. ధరణికి ముందున్న మాన్యువల్‌ రికార్డుల్లో నమోదైన ఈ సర్వే నంబర్లన్నీ ధరణి పోర్టల్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. 

దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న తమ భూముల సర్వే నంబర్లు కనిపించకపోవడంతో ఆయా సర్వే నంబర్లలో భూమి ఉన్న రైతాంగం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఇప్పటికే పలుమార్లు దరఖాస్తులు చేసుకున్నా ఫలితం లేకపోవడం, సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన భూభారతి సదస్సుల్లో ఈ రైతులందరూ మరోమారు దరఖాస్తు చేసుకున్నారు. 

ఈ నెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలోని 561 మండలాల్లో ఉన్న 10,239 రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించిన ఈ సదస్సుల్లో మొత్తం 8,00,999 దరఖాస్తులు రాగా, అందులో తమ భూముల సర్వే నంబర్లు మిస్సయ్యాయంటూ ఏకంగా 1,26,028 దరఖాస్తులు రావడం గమనార్హం. మొత్తం దరఖాస్తుల్లో 15 శాతం సర్వే నంబర్ల మిస్సింగ్‌ దరఖాస్తులే కావడం గమనార్హం. రెవెన్యూ రికార్డులకు సంబంధించి కీలకమైన, భూమి గుర్తింపు సంఖ్య అయిన సర్వే నంబరే లేకుండా పోవడంపై రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. 

మొత్తం 8 లక్షలకు పైమాటే 
రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం పేరిట ధరణి పోర్టల్‌ అమల్లోకి వచ్చి నాలుగేళ్లు దాటిపోయింది. ఆ పోర్టల్‌ను రద్దు చేసి భూభారతి అమల్లోకి తెచ్చి కూడా రెండు నెలలయింది. కానీ రాష్ట్ర రైతాంగం చేతిలో ఉన్న వ్యవసాయ భూములకు సంబంధించి ఇంకా లెక్కలేనన్ని సమస్యలు మిగిలి ఉన్నాయని భూభారతి సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

గ్రామస్థాయిలో జరిగిన ఈ సదస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షలకు పైగా వినతులు రావడం గమనార్హం. ఇందులో ఎక్కువగా సాదా బైనామాల రిజిస్ట్రేషన్ల దరఖాస్తులు వచ్చాయి. మొత్తం దరఖాస్తుల్లో 30 శాతం దరఖాస్తులు ఇవే కావడం గమనార్హం. కాగా సాదా బైనామాల క్రమబద్ధీకరణకు అవసరమైన నిబంధనలను భూభారతి చట్టంలో పెట్టినా..ఈ అంశం కోర్టులో పెండింగ్‌ ఉండడంతో అవి రెగ్యులరైజ్‌ చేసేందుకు వీలు కాలేదు. 

కోర్టులో కేసు ముగిసిన తర్వాత ఆగస్టు నెలలో వీటన్నింటినీ పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఆ తర్వాత సర్వే నంబర్ల మిస్సింగ్, అసైన్డ్‌ భూములకు సంబంధించిన రికార్డుల సమస్యలు, ఆ భూములను తమకు క్రమబద్ధీకరించాలంటూ వచ్చిన దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయి. అసైన్డ్‌ భూముల రెవెన్యూ రికార్డులకు సంబంధించి 90 వేలకు పైగా దరఖాస్తులు రాగా, ఆ భూములను తమకు రిజిస్ట్రేషన్‌ చేయాలంటూ మరో 50 వేల దరఖాస్తులు వచ్చాయి. 

ఆ తర్వాత వారసత్వం (విరాసత్‌) ద్వారా వచ్చిన భూమిని భాగస్వామ్య పంపకం చేయాలంటూ ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. అయితే భూభారతి పోర్టల్‌ ద్వారా ఈ భాగస్వామ్య పంపకాలకు అవకాశం కల్పించలేదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. 

ఇక మ్యుటేషన్‌ పెండింగ్‌/కోర్టు కేసులు, డిజిటల్‌ సంతకం పెండింగ్, విస్తీర్ణంలో తేడాలు.. ఇలా రెవెన్యూ రికార్డులకు సంబంధించి 13 రకాలు, ఇతర సమస్యలకు సంబంధించిన 17 రకాల దరఖాస్తులు ఇటీవల జరిగిన భూభారతి సదస్సుల్లో రావడం గమనార్హం. మొత్తం దరఖాస్తుల్లో 3.2 లక్షలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో నమోదు కాగా మిగిలిన దరఖాస్తులను కూడా నమోదు చేసే పనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. 

ఖమ్మంలో ఎక్కువ..మేడ్చల్‌లో తక్కువ 
జిల్లాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా ఖమ్మం జిల్లా రైతాంగం ఎక్కువగా భూమి సమస్యలు ఎదుర్కొంటున్నట్టు భూభారతి సదస్సుల్లో వచ్చిన గణాంకాలు చెబుతున్నాయి. ఈ జిల్లాలో అత్యధికంగా 67,378 దరఖాస్తులు రాగా, ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 61,145 దరఖాస్తులు వచ్చాయి. 

అంటే ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే 1.28 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం వచ్చిన 8 లక్షల దరఖాస్తుల్లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే 15 శాతం కంటే ఎక్కువ దరఖాస్తులు రావడం గమనార్హం. 

ఆ తర్వాత వరంగల్‌ (54,933), భూపాలపల్లి (48,651), సూర్యాపేట (44,501), సిద్దిపేట (42,639), నల్లగొండ (42,161) జిల్లాల్లో ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. ఇక అత్యల్పంగా మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో 2,857 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. 10 వేల కంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన జిల్లాల్లో ఆసిఫాబాద్‌ (3,712), మహబూబ్‌నగర్‌ (9,610), నారాయణపేట (4,052), రాజన్న సిరిసిల్ల (6,965), వనపర్తి (7,615) ఉన్నాయి.  

ఆగస్టు 15 నాటికి సమస్యల నుంచి విముక్తి 
భూభారతి సదస్సులను చాలా పకడ్బందీగా నిర్వహించాం. అధికారులే గ్రామాలకు వెళ్లి, ప్రజలకు ఒకరోజు ముందే దరఖాస్తులు ఇచ్చి, అన్ని వివరాలను తీసుకున్నారు. రూపాయి ఖర్చు లేకుండా రైతులు తమ భూ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసుకునే అవకాశాన్ని కల్పించడం సంతోషంగా ఉంది. 

పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్‌ చేసిన పాపాలకు, ధరణి తెచ్చిన కష్టాలకు భూభారతి సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల సంఖ్య నిదర్శనం. ధరణిని బంగాళాఖాతంలో కలిపేశాం. ఇప్పుడు రైతుల సమస్యల పరిష్కారమే మా ముందున్న తక్షణ కర్తవ్యం. ఆగస్టు 15 నాటికి తెలంగాణ రైతాంగాన్ని భూ సమస్యల నుంచి విముక్తులను చేస్తాం.  – రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 


(నోట్‌: ఇతరముల కేటగిరీలో ఎక్కువగా సాదా బైనామాలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయని, 2 లక్షలకు పైగా అవేనని రెవెన్యూ వర్గాలంటున్నాయి. అసైన్డ్‌ భూములను రిజిస్టర్‌ చేయాలంటూ 50 వేలకు పైగా, శివాయి జమేదార్‌ భూముల సమస్యలపై 12 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని సమాచారం. వీటితో పాటు పోడు భూములు, సరిహద్దు వివాదాలు, ఇండ్ల స్థలాలకు పాస్‌బుక్కులు, కోర్టు కేసులు, అప్పీళ్లు, భూదాన్‌ భూములు.. ఇలా 17 రకాల సమస్యలపై భూభారతి సదస్సుల్లో రైతులు దరఖాస్తులు సమర్పించారు.)   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement