ఒక్కో గుడ్డు రూ.7 నుంచి రూ.8
ఎండకు చనిపోయిన కోళ్లు.. తగ్గిన గుడ్ల ఉత్పత్తి
యుద్ధంతో పెరిగిన దాణా ధరలు
పెరిగిన ఉష్ణోగ్రతలతో లేయర్ కోళ్లు అనేకం చనిపోయాయి. ఫలితంగా కోడిగుడ్ల ఉత్పత్తి పడిపోయింది. ఇదే సమయంలో పశ్చిమాసియాలో యుద్ధంతో దాణా ధరలు కూడా పెరిగిపోయాయి. ఈ ప్రభావంతో కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయి. పది రోజుల క్రితం ఒక ట్రే(30 గుడ్లు) ధర రూ.180 ఉండగా.. ఇప్పుడు రూ.200కి చేరింది. హోల్సేల్గా ఒక్కో గుడ్డు ధర రూ.6.60 పలకడంతో రిటేల్గా కిరాణా దుకాణాల్లో రూ.7 నుంచి రూ.8లకు విక్రయిస్తున్నారు.
ఎండలకు తగ్గిన ఉత్పత్తి..
గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు దంచికొట్టడంతో చాలా కోళ్ల ఫారాల్లో గుడ్ల కోళ్లు చనిపోయాయి. ఎండ వేడిమికి గుడ్ల ఉత్పత్తి భారీగా తగ్గింది. గతంలో 95 శాతం గుడ్ల ఉత్పత్తి ఉంటే ఇప్పుడు 65 శాతానికి పడిపోయింది. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో సుమారు కోటి సామర్థ్యం గల లేయర్స్ కోళ్ల ఫారాలు ఉన్నాయి. ఇందులో కరీంనగర్ నుంచి హైదరాబాద్ మార్గంలో సుమారు 30 నుంచి 40 లక్షల కెపాసిటీ గల లేయర్స్ ఫారాలు ఉన్నాయి.
రోజుకు 70 లక్షల గుడ్ల ఎగుమతి..
ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి అస్సాం, హిమాచల్ప్రదేశ్, కశ్మీర్, యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, నాగ్పూర్, కోల్కత తదితర రాష్ట్రాలకు రోజూ సుమారు 70 లక్షల గుడ్ల వరకు ఎగుమతి అవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో సైతం భారీగా కోడిగుడ్ల వాడకం ఉంది. ప్రస్తుతం రోజుకు సుమారు రూ.5 కోట్ల నుంచి రూ.6కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నాయి. - కరీంనగర్ జిల్లా, బోయినపల్లి:


