మధ్యాహ్న భోజనం బాగుందా? | Education Department prepares to inspect mid day meal quality in government schools | Sakshi
Sakshi News home page

మధ్యాహ్న భోజనం బాగుందా?

Jun 18 2025 12:22 AM | Updated on Jun 18 2025 12:22 AM

Education Department prepares to inspect mid day meal quality in government schools

భోజనశాలలు పరిశుభ్రంగానే ఉన్నాయా?

స్కూళ్లలో భోజన తనిఖీలకు రంగం సిద్ధం 

జిల్లా స్థాయిల్లో కమిటీలు.. రాష్ట్ర స్థాయిలో బృందాలు 

ప్రతిరోజూ ఉన్నతాధికారులకు నివేదిక అందించాలి 

జిల్లా అధికారులకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు 

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నాణ్యతపై విద్యాశాఖ తనిఖీలకు సిద్ధమైంది. ఇప్పటికే జిల్లా, మండల స్థాయిలో తనిఖీ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక బృందాలను సంసిద్ధం చేస్తోంది. ఇవి ఆకస్మిక తనిఖీలు చేపడతాయి. మధ్యాహ్న భోజన నాణ్యత, అందిస్తున్న తీరు, గతంలో ఎదురైన అనుభవాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించిననేపథ్యంలో మంగళవారం విద్యాశాఖ ఉన్నతాధికారులు దీనిపై సమీక్ష నిర్వహించారు. 

క్షేత్రస్థాయిలో భోజన నాణ్యతకు పాఠశాల ప్రధానోపాధ్యాయులను బాధ్యులను చేయాలని ప్రభుత్వం సూచించింది. భోజనం వంట దగ్గర్నుంచి, భోజన శాలల్లో పరిశుభ్రత పాటించడం వరకు హెచ్‌ఎంలే కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఎక్కడైనా తేడా వస్తే ఈ విద్యాసంవత్సరంలో హెచ్‌ఎంలకు చర్యలు తప్పవని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆహారం కలుషితమైనా, నాణ్యత తగ్గినట్టు తేలినా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై త్వరలో ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.  – సాక్షి, హైదరాబాద్‌

నాణ్యత ఎలా? 
గత సంవత్సరం అనేక చోట్ల ఆహారం కలుషితమై, విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలు రాజకీయ దుమారం రేపాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే మధ్యాహ్నం భోజనంలో నాణ్యత, శుభ్రతపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అయితే, అవసరమైన బడ్జెట్‌ లేకుండా ఆశించిన పురోగతి ఎలా సాధ్యమని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ప్రతిరోజూ మెనూ మార్చాలి. ఏ వారం ఏం పెట్టాలనే మెనూను పాఠశాల విద్య ఖరారు చేసింది. 

అన్నం, పప్పుచారు, బిర్యానీ, అరటి పండ్లు, గుడ్లు ఇలా రోజుకొకటి అందించాలి. 1–5 తరగతుల విద్యార్థులకు గుడ్డుతో కలిపి ఒక్కొక్కరికి రూ.8.69.. 6–8 తరగతుల వారికి రూ.11.79.. 9–10 తరగతుల విద్యార్థులకు రూ.11.79 చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. ప్రస్తుతం మధ్యాహ్న భోజనానికి రూ.99,22,56,492.5 బడ్జెట్‌ ఇస్తున్నారు. 

ఇంకా రూ. 38,10,38,935 అదనంగా ఇస్తే తప్ప నాణ్యమైన భోజనం అందించడం సాధ్యం కాదని రాష్ట్ర విద్యా కమిషన్‌ ప్రభుత్వానికి సూచించింది. దీనిపై ప్రభుత్వం ఇంత వరకూ స్పష్టత ఇవ్వలేదు. ఒకవైపున నిత్యావసరాలు పెరుగుతుంటే సరిపుచ్చడం ఎలా అని హెచ్‌ఎంలు అంటున్నారు. ఏం జరిగినా తమనే బలి చేయడం సరికాదని విన్నవిస్తున్నారు.  

ప్రతి రోజూ నివేదిక 
రాష్ట్రవ్యాప్తంగా 26 వేలకుపైగా ప్రభుత్వ స్కూళ్లున్నాయి. వీటిల్లో మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాల్సి ఉంటుంది. ఏ రోజు ఎంత మంది విద్యార్థులు హాజరయ్యారు? మధ్యాహ్న భోజనంలో ఏయే పదార్థాలు వినియోగించారు? వాటిని ఎక్కడ? ఎప్పుడు కొనుగోలు చేశారు? అనే వివరాలను హెచ్‌ఎంలు ఆన్‌లైన్‌లో పొందు పర్చేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందించేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. వీటిని మండల విద్యాశాఖాధికారి పర్యవేక్షిస్తారు. హెచ్‌ఎంలు పంపే వివరాలను ఎంఈవో పరిశీలించి, జిల్లా విద్యాశాఖాధికారి, అక్కడి నుంచి పాఠశాల విద్య డైరెక్టరేట్‌కు పంపుతారు. 

ఇందులోనే బియ్యం, నిత్యావసరాల నిల్వలను పేర్కొనాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఎంఈవోలు వారానికి కనీసం మూడు స్కూళ్లను పరిశీలిస్తారు. మధ్యాహ్న భోజనం అందించేటప్పుడు నేరుగా నాణ్యతను పరిశీలించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ అధికారులు, రాష్ట్ర స్థాయిలోని ప్రత్యేక బృందాలు స్కూళ్లను ఆకస్మికంగా తనిఖీ చేస్తాయి. ఎక్కడన్నా లోపాలుంటే తక్షణమే చర్యలు తీసుకునే వీలుందని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement