Nagalakshmi: సైక్లింగ్‌ ఫిఫ్టీస్‌! | Dr Nagalakshmi's Cycling Life Story Pirates Of Hyderabad | Sakshi
Sakshi News home page

Nagalakshmi: వందల కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణం..

Sep 26 2024 10:56 AM | Updated on Sep 26 2024 10:56 AM

Dr Nagalakshmi's Cycling Life Story Pirates Of Hyderabad

పైరేట్స్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ పేరుతో గ్రూప్‌

నిమ్స్‌ ఆయుష్‌ మాజీ ఇన్‌ఛార్జి డా.నాగలక్ష్మి

సాక్షి, సిటీబ్యూరో: ఓ వయసు దాటాక సాధారణంగా ఇంట్లో ఉండి.. మనవలు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తుంటారు.. లేదంటే పుణ్యక్షేత్రాలు చుట్టొస్తారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే తమలోని చిన్ననాటి అభిలాషను నెరవేర్చుకుంటారు. ఆ కోవకే చెందుతారు.. డాక్టర్‌ నాగలక్ష్మి. నిమ్స్‌ నేచురోపతి విభాగాధిపతిగా పనిచేసిన ఆమె.. 50 ఏళ్ల వయసులో సైక్లింగ్‌ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. సాధారణంగా ఆ వయసులో కిలోమీటర్‌ దూరం నడిస్తేనే అలసిపోతుంటారు. కానీ డాక్టర్‌ నాగలక్ష్మి మాత్రం అలవోకగా కిలోమీటర్ల మేర సైకిల్‌పై ఎంచక్కా షికారు చేస్తూ, యూత్‌కు ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తున్నారు.

ఉదయం నాలుగు గంటలకే..
సైక్లిల్‌ అనగానే ఉదయం నాలుగు గంటలకే మెలకువ వస్తుందని, ఆ వెంటనే రెడీ అయి సైక్లింగ్‌ చేస్తుంటామని పేర్కొన్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌ చుట్టుపక్కల గ్రామాల్లో సైక్లింగ్‌ చేస్తామని వివరించారు. మంత్లీ చాలెంజ్‌లా పెట్టుకుని, 30 రోజులు 30 ప్రదేశాలు వెళ్లాలనే టార్గెట్‌ పెట్టుకుని మరీ సైక్లింగ్‌ చేశామని చెప్పారు.

శారీరక, మానసిక ఆరోగ్యం..
సైక్లింగ్‌తో ఎన్నో లాభాలు ఉంటాయని, శారీరకంగా ఎంతో ఆరోగ్యంగా, రోజంతా యాక్టివ్‌గా ఉంటామని నాగలక్ష్మి వివరించారు. అంతేకాకుండా హ్యాపీ హార్మోన్లు విడుదల అవుతాయని, దీంతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని పేర్కొన్నారు.

సైకిల్‌ అంటే ఎమోషన్‌..
చిన్నప్పటి నుంచి తనకు సైకిల్‌ అంటే ఒక భావోద్వేగమని డా.నాగలక్ష్మి చెబుతున్నారు. చిన్నతనంలో తన తండ్రిని అడిగితే సైకిల్‌ కొనివ్వలేదని, అప్పటినుంచి ఆ కోరిక అలానే ఉండేదని చెప్పారు. చివరకు తన భర్త, పిల్లలు 50వ పుట్టిన రోజున సైకిల్‌ కొనిచ్చారని, అప్పటి నుంచి సైక్లింగ్‌ అలవాటుగా మారిందని వివరించారు. ఒక్కరోజు తాను 7 కిలోమీటర్లు సైకిల్‌పై వెళ్లిన విషయాన్ని స్టేటస్‌ పెట్టుకోవడంతో తన స్నేహితులు ఆశ్యర్యపోయి.. ఆ తర్వాత చాలామంది తమ గ్యాంగ్‌లో కలిసిపోయి చాలా దూరం వెళ్తుండేవారని చెప్పారు. అనంతరం హ్యాపీ హైదరాబాద్‌ అనే సైక్లింగ్‌ గ్రూప్‌లో చేరామని వివరించారు. ఆ తర్వాత పైరేట్స్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ పేరుతో 14 మంది స్నేహితులతో గ్రూప్‌ ఏర్పాటు చేశామని, అప్పటినుంచి కొత్త వారిని కలుస్తూ.. వారితో ఐడియాలు పంచుకుంటూ సైక్లింగ్‌ చేస్తూ సరదాగా గడుపుతుండేవారిమని పేర్కొన్నారు.

ఇవి చదవండి: డాలస్‌లో ఘనంగా అక్కినేని శతజయంతి వేడుకలు..!

Advertisement
 
Advertisement
Advertisement