
డబుల్ బెడ్రూం ఇళ్లను ఆక్రమించిన లబ్ధిదారులు
ఇళ్ల కేటాయింపులో తీవ్ర జాప్యంతో నేరుగా ఆక్రమణ
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లి వద్ద ఘటన
మంచాల(రంగారెడ్డి): డబుల్ బెడ్రూం ఇళ్లను అందజేయటంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ.. లబ్ధిదారులు ఆ ఇళ్లను నేరుగా ఆక్రమించుకున్నారు. ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన మాటలపై నమ్మకం సన్నగిల్లిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లి గేట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని మంచాల, నోముల, లింగంపల్లి గ్రామస్తుల కోసం లింగంపల్లి గేట్ వద్ద డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించారు. ఏడాదిన్నర క్రితం లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇళ్లను మాత్రం అప్పగించలేదు.
అప్పటి నుంచి లబ్ధిదారులు అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఈ నెల 23న ఇళ్లు కేటాయిస్తామని అధికారులు తెలపటంతో లబ్ధిదారులు ఆశగా ఎదురుచూశారు. కానీ ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు. ఈ నెల 28న ఇస్తామని మరోసారి చెప్పారు. ఆ గడువు కూడా దాటిపోవడంతో విసిగిపోయిన లబ్ధిదారులంతా కలిసి ఇళ్లను శుభ్రం చేసుకొని ఆక్రమించారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమేశ్ అక్కడికి చేరుకొని లబ్ధిదారులతో మాట్లాడారు.
ప్రభుత్వం అధికారికంగా ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాతే రావాలని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా లబ్ధిదారులు ససేమిరా ఒప్పుకోలేదు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని ఇందిరమ్మ ఇళ్లు కూడా కేటాయించలేదని, ప్రస్తుతం తాము ఉన్న ఇళ్లు వర్షాలకు కురుస్తున్నాయని, ఎక్కడ తలదాచుకోవాలని నిలదీశారు. అప్పుడు, ఇప్పుడు అంటూ కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితిలో ఇళ్లను వదిలి వెళ్లేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో చేసేది లేక అధికారులు వెనుదిరిగారు.