కలసి తింటే.. కలదు సుఖం | dining culture in hyderabad | Sakshi
Sakshi News home page

కలసి తింటే.. కలదు సుఖం

Dec 4 2024 8:24 AM | Updated on Dec 4 2024 8:24 AM

dining culture in hyderabad

బంధుమిత్రులతోనే మీ(ఈ)టింగ్‌ ... 

సినిమాకి ముందూ వెనుకా.. విందు  

కొత్త రుచుల అన్వేషణపై ఆసక్తి సైతం   

సిటీజనుల డైనింగ్‌ కల్చర్‌పై ఐఎఫ్‌ఎస్‌ఆర్‌ రిపోర్ట్‌

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ, ఉత్తర భారత సంప్రదాయ వంటకాలతో పాటు నగర విందు వైవిధ్యభరితంగా ఉంటుంది. అమెరికన్, మెక్సికన్, ఇటాలియన్‌ సహా పాశ్చాత్య వంటకాలు, క్లాసిక్‌ చైనీస్‌ వంటకాలు ఇక్కడ డిమాండ్‌లో ఉన్నాయి. మరోవైపు సుసంపన్నమైన వంటల వారసత్వానికి ప్రసిద్ధి చెందింది మన నగరం. దీంతో రెస్టారెంట్‌ల సంఖ్యలో వృద్ధితో పాటే సిటీ జనుల ఆహారపు అలవాట్లలో వేగవంతమైన మార్పును చవిచూస్తోంది. నేషనల్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా వారి ఇండియా ఫుడ్‌ సరీ్వసెస్‌ రిపోర్ట్‌ (ఐఎఫ్‌ఎస్‌ఆర్‌) 2024 ప్రకారం, సిటీజనులు నెలకు సగటున ఏడు సార్లు బయటే భోజనం చేస్తారు లేదా ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తారు. ఇది జాతీయ సగటు 8కి అతి దగ్గరగా ఉంది. ఇంకా ఈ ఐఎఫ్‌ఎస్‌ఆర్‌ నివేదిక తెలిపిన అంశాల్లో మరికొన్ని ఇలా.. 

సరికొత్త వంటకాలు.. రెస్టారెంట్‌ల అన్వేషణ.. 
సామాజిక సమూహాలు, కుటుంబాలు, స్నేహితులతో సమావేశాలు సిటీలో డైనింగ్‌ కల్చర్‌ను ప్రభావితం చేస్తున్న ముఖ్యాంశాలు. హైదరాబాదీలు కూడా  విహారయాత్రలతో పాటు సినిమాలను చూడటం దాకా రెస్టారెంట్ల సందర్శనను కూడా జత చేస్తారు. అంతేకాక కొత్త వంటకాలు సరికొత్త రెస్టారెంట్లను అన్వేషించడానికి ఎల్లప్పుడూ ఆసక్తిని కలిగి ఉంటారు. 

అవుట్‌సైడ్‌ ఫుడ్‌.. రీజన్స్‌ ఇవే.. 
బయటి ఆహారం తినడానికి కుటుంబం, స్నేహితులతో గెట్‌– టుగెదర్‌  28.9 శాతం మందికి ప్రధాన కారణంగా ఉంది. అదే విధంగా థియేటర్‌లో సినిమా చూడడానికి ముందు, ఆ తర్వాత 19.3 శాతం మంది బయటే తింటున్నారు. అలాగే పండగ లేదా నేషనల్‌ హాలిడేస్‌ వచి్చనప్పుడు 19.3 శాతం మంది, పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, ప్రమోషన్‌లు వంటి ఆనందకరమైన సందర్భాలను సెలబ్రేట్‌ చేసుకోవడానికి 19.3 శాతం మంది, కొత్త అవుట్‌లెట్స్, రెస్టారెంట్స్‌ వచ్చినప్పుడు ఎలా ఉందో చూడడానికి అని13.3 శాతం మంది బయటి ఫుడ్‌కి ఓటేస్తున్నారు.  

దేశంలోనే 5వ స్థానంలో... 
నగరంలో అన్ని సంఘటిత, అసంఘటిత రంగాల్లో ఉన్నవి  కలిపితే 74,000 పైగా ఆహార విక్రయశాలలు ఉన్నాయి. నగరం వ్యవస్థీకృత రంగాన్నే తీసుకుంటే రూ. 10,161 కోట్ల విలువ చేస్తుందని అంచనా. మన భాగ్యనగరానిది దేశంలోనే ఐదో అతిపెద్ద మార్కెట్‌. నగరం 40 వేలకుపైగా రెస్టారెంట్లు కలిగి ఉంది. వీటిలో క్లౌడ్‌ కిచెన్‌లూ పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఇవి మొత్తం మార్కెట్‌లో 40 శాతం వాటా కలిగి ఉండడం క్లౌడ్‌ కిచెన్‌ల వృద్ధికి అద్దం పడుతోంది.  

అనారోగ్యాలకూ ఆహ్వానం.. 
సిటీలో అవుట్‌సైడ్‌ ఫుడ్‌ తినడం అనేది పెరగడం ఆరోగ్యపరమైన సవాళ్లను తెచి్చపెడుతోంది. కొన్నిచోట్ల అపరిశుభ్ర నిల్వ పద్ధతులు, నాసిరకం వంట పద్ధతులు ప్రమాణాలు పాటించని విధానాలు సిటీజనులకు రోగాలను కొని తెచ్చిపెట్టుకున్నట్టుగా చేస్తున్నాయి. అంతేకాకుండా.. కేలరీలు అధికంగా ఉండే రెస్టారెంట్‌ ఫుడ్‌ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు పెరగడం, స్థూలకాయం సంబంధిత ఆరోగ్య సమస్యలకు దోహదపడవచ్చు. వీటిని గుర్తించి అవగాహనతో మాత్రమే అవుట్‌సైడ్‌ డైనింగ్‌ను ఆస్వాదించాల్సి ఉంది.  

Advertisement
 
Advertisement
Advertisement