ఎలక్షన్ కమిషన్ అధికారులపేరుతో వాట్సాప్ సందేశాలు
వివరాల సవరణ పేరుతో లింకులు.. రూ.5 చెల్లించాలంటూ వల
అప్రమత్తంగా ఉండాలంటూ టీజీసీఎస్బీ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్ : ఓటర్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి తెరతీశారు. ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఫారం పేరుతో నకిలీ సందేశాలు పంపుతూ ఓటర్ల వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల సంఘం అధికారుల పేరుతో వాట్సాప్, ఇతర డిజిటల్ వేదికల ద్వారా సందేశాలు పంపుతూ.. ఓటరు వివరాల్లో తప్పులున్నాయని, ఎస్ఐఆర్ ఫారం తిరస్కరణకు గురైందని నమ్మిస్తున్నారు. అనంతరం వివరాలను సరిచేసుకోవాలంటూ హానికర లింకులు పంపి సైబర్ వలలోకి లాగుతున్నారు.
ఇలాంటి మెసేజ్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) హెచ్చరించింది. ఈ మేరకు టీజీ సీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయల్ గురువారం ఒక ప్రకటన జారీ చేశారు. కాగా, ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) పేరుతో ఓటర్లకు మోసపూరిత సందేశాలు వస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి దృష్టికి వచ్చినట్టు సీఈఓ కార్యాలయం సైతం గురువారం మరో ప్రకటనలో పేర్కొంది. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) లేదా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) కార్యాలయం ఎటువంటి సందేశాలను పంపబోరని పేర్కొంది.
మోసపోతే వెంటనే ఫిర్యాదు చేయాలి: సైబర్ మోసానికి గురై డబ్బు పోగొట్టుకున్నట్లయితే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు ఫోన్ చేయాలని టీజీసీఎస్బీ అధికారులు సూచించారు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (cybercrime.gov.in) ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే లావాదేవీలను నిలిపివేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు.
ఈ సందేశాల విషయంలో జాగ్రత్త..
» ‘మీ ఎస్ఐఆర్ ఫారం తిరస్కరణకు గురైంది’అంటూ వచ్చే సందేశాలు.
» ఓటరు వివరాలను అప్డేట్ చేయాలంటూ పంపే వాట్సాప్ లింకులు.
» ఫారం ధ్రువీకరణ లేదా సవరణ కోసం రూ.5 లేదా ఇతర స్వల్ప మొత్తం చెల్లించాలనే అభ్యర్థనలు.
» ఎన్నికల సంఘం అధికారుల పేరుతో వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ సమాచారం కోరే సందేశాలు.
» వెంటనే స్పందించకపోతేఓటరు హక్కు కోల్పోతారని భయపెట్టే సందేశాలు.
» ఇలాంటి వాటిపై ప్రత్యేక అప్రమత్తత అవసరమని సైబర్ పోలీసులుసూచిస్తున్నారు.


