
సాక్షి, జోగులాంబ గద్వాల: జిల్లా కేంద్రంలో మొసలి కలకలం రేగింది. స్థానిక హమాలీ కాలనీలో అర్ధరాత్రి కుక్కలు గట్టి గట్టిగా అరవడంతో గమనించిన కాలనీవాసులు.. మొసలి సంచరించడం చూసి వణికిపోయారు. అయితే కొందరు ధైర్యం చేసి తాడుతో దానిని అతికష్టం మీద బంధించి ఉంచారు. మంగళవారం ఉదయం ఫారెస్టు అధికారులు వచ్చి మొసలిని తీసుకెళ్లారు.
అర్ధరాత్రి కావడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని కాలనీవాసులు చెబుతున్నారు. మొసలి సంచరించిన ప్రాంతం.. పిల్లలు ఆడుకునే పప్రాంతమని, అదృష్టవశాత్తూ ఘటన అర్ధరాత్రి జరగిందని అంటున్నారు.
హామాలి కాలనీకి సమీపంలో జూరాల ప్రాజెక్టు కుడి కాలువ ఉందని, అట్టి కాలువ నుంచి మొసలి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో.. చుట్టుపక్కల ఉన్న ముళ్లపొదలను తొలగించి.. వీధిలైట్లు ఏర్పాటు చేయించాలని అధికారులకు కాలనీవాసులు విజ్జప్తి చేస్తున్నారు.