నిందితుడు అర్షద్ అలీ
హైదరాబాద్, బంజారాహిల్స్: హత్య కేసుల్లో నిందితుడు.. 23 సంవత్సరాలుగా తప్పించుకుతిరుగుతున్నాడు. ఎట్టకేలకు బంజారాహిల్స్ పోలీసులకు శుక్రవారం చిక్కాడు. ఇన్స్పెక్టర్ ఎస్.సుహాసన్ తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లోని సయ్యద్నగర్లో నివసించే అర్షద్ అలీ(50) 2003లో బంజారాహిల్స్, నిజామాబాద్ ఐదో టౌన్ పోలీసుస్టేషన్ల పరిధిలోని రెండు హత్యకేసుల్లో నిందితుడు.
జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చిన తర్వాత వనస్థలిపురంలో ఓ చోరీ కేసులో మళ్లీ జైలుకు వెళ్లాడు. బెయిల్పై వచ్చిన అనంతరం బెదిరింపులకు పాల్పడటంతో బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదైంది. నిందితుడు మహారాష్ట్రకు పరారై పాలఘడ్ జిల్లా వసాయి గ్రామంలో షకీల్గా పేరు మార్చుకున్నాడు. అక్కడే రేష్మ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి పోలీసులు గాలిస్తూనే ఉన్నారు.
రౌడీషీట్ కూడా తెరిచారు. వారెంట్ కూడా పెండింగ్లో ఉంది. కేసును సవాల్గా తీసుకున్న ఇన్స్పెక్టర్ సుహాసన్, ఎస్ఐ బీ శ్రీనివాస్, ఏఎస్ఐ ముజఫర్, హెడ్కానిస్టేబుల్ సుభాష్లతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసి రెండు నెలలుగా అతడి కదలికలపై దృష్టి పెట్టారు. సాంకేతికత ఆధారంగా మహారాష్ట్రలో పట్టుకున్నారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.


