ఘట్‌కేసర్‌​ ఘటన: అంతా కట్టుకథ | cp mahesh bhagwat Revels On Ghatkesar Kidnap Case | Sakshi
Sakshi News home page

బీఫార్మసీ విద్యార్థిని కేసులో సంచలన విషయాలు

Feb 13 2021 12:40 PM | Updated on Feb 13 2021 1:07 PM

cp mahesh bhagwat Revels On Ghatkesar Kidnap Case - Sakshi

తనపై అ‍త్యాచారం జరిగినట్లు పోలీసులను నమ్మించడానికి తన దుస్తులను తానే చింపుకుందని తెలిపారు.

సాక్షి, హైదరాబాద్‌ : ఘట్‌కేసర్‌ భీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్‌, అత్యాచారం కేసులో సంచలన విషయాలను పోలీసులు వెల్లడించారు. యువతి కిడ్నాప్‌ను ఓ కట్టుకథగా తేల్చిచెప్పారు. బీఫార్మసీ విద్యార్ధినిపై అత్యాచారం జరగలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ శనివారం మీడియా సమావేశం నిర్వహించి ఘటనకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. యువతి కావాలనే కట్టుకథలు అల్లిందని, పోలీసులను, తల్లిదండ్రులను తప్పుదోవపట్టిందని పేర్కొన్నారు. తొలుత యువతిని కిడ్నాప్ చేశారన్న సమాచారంతో అలర్ట్ అయ్యామని, యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కిడ్నాపు కేసు నమోదు చేశామని తెలిపారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్ ఆధారంగా ట్రేస్‌ చేశామని, విచారణలో యువతి పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అసలు వాస్తవాలు బయటపడ్డయన్నారు.

సీసీ ఫుటేజ్‌ ఆధారంగా విచారణలో వాస్తవాలను గుర్తించామన్నారు. యువతి చెప్పినట్టు కేసులో ఆటో డ్రైవర్ పాత్ర లేదని సీపీ స్పష్టం చేశారు. తనపై అ‍త్యాచారం జరిగినట్లు పోలీసులను నమ్మించడానికి తన దుస్తులను తానే చింపుకుందని తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థిని తనకు తానే ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. కిడ్పాప్‌ లేదు, రేప్‌ లేదన్నారు. యువతి అందరినీ తప్పుదోవ పట్టిందని చెప్పారు. యువతి డ్రామాతో మూడు రోజులుగా పోలీసులు నిద్రలేకుండా గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో ఆటో డ్రైవర్లు తమకు బాగా సహకరించారన్నారు. యువతి కిడ్నాప్‌, అత్యాచారం కేసును తప్పుడు కేసుగా సీపీ మహేష్‌ భగవత్‌ తేల్చిచెప్పారు.

కాగా కండ్లకోయలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో బీఫార్మసీ చదువుతున్న రాంపల్లిలోని ఆర్‌ఎల్‌నగర్‌ వాసి బుధవారం కాలేజీకి వెళ్లి తిరిగి వస్తూ.. నాగారంలో బస్సు దిగి రాంపల్లిలోని ఆర్‌ఎల్‌నగర్‌ బస్టాప్‌ వెళ్లేందుకు ఆటోలో ఎక్కింది. ఆటో అక్కడ ఆపకుండా ముందుకు తీసుకెళ్లి ఆటోడ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు కిడ్నాప్‌ చేసేందుకు యత్నించారని చెప్పడంతో తొలుత పోలీసులు కిడ్నాప్‌గా కేసు నమోదు చేశారు. గురువారం బాధితురాలిని లోతుగా విచారించిన పోలీసులు నిర్భయ చట్టం కింద వివిధ కేసులు నమోదు చేశారు. అనంతరం పోలీసులు విచారించిన ఇదంతా కట్టుకథగా తేలింది. 

ఘట్‌కేసర్‌ అత్యాచారం కేసు: కొత్త ట్విస్టు

Advertisement
 
Advertisement
Advertisement