కరోనా సునామి.. పల్లెల్లో తగ్గుముఖం.. పట్టణాల్లో ఉత్పాతం..

Covid Second Wave  Spreading Faster In India - Sakshi

సాక్షి, వేములవాడరూరల్‌: పల్లె, పట్టణం తేడా లేకుండా కరోనా కేసుల సంఖ్య పెరిగాయి. కానీ ప్రస్తుతం పల్లెల్లో కరోనా కేసుల సంఖ్య కొంతవరకు తగ్గుముఖం పట్టినట్లు ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు. వేములవాడ మండలంలోని చాలా గ్రామాల్లో కరోనా కేసులు ఈ మధ్యకాలంలో పెరిగాయి. దీంతో గ్రామాల వారీగా ప్రత్యేకంగా కట్టడి చేసుకుని ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో కొంతవరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.

మండలంలోని ఫాజుల్‌నగర్, నూకలమర్రి గ్రామాలతో పాటు తదితర గ్రామాల్లో కరోనా వాక్సిన్‌ను వైద్యాధికారులు ప్రత్యేక క్యాంపు ద్వారా ప్రజలకు వేశారు. దీంతో పాటు మండలంలో అత్యధికంగా మల్లారం, జయవరం గ్రామాల్లో కేసులు పెరగడంతో ఆ రెండు గ్రామాల్లో సెల్ఫ్‌లాక్‌డౌన్‌ విధించుకున్నారు. ఇలా గ్రామీణ ప్రాంతాలలో వారు తీసుకున్న కరోనా నివారణ చర్యల్లో ప్రస్తుతం తగ్గుముఖం పట్టినట్లు తెలిసింది. 

కరోనా విలయ తాండవం
వేములవాడ: వేములవాడలో కరోనా సెకండ్‌ వేవ్‌ విలయ తాండవం ఆడుతున్నది. ఇది అత్యంత ప్రమాదకరంగా మారిందనడానికి వేములవాడలో నిత్యం వినిపించే మరణాలే నిదర్శనం. ఎలాంటి లక్షణాలు కనిపించకుండా అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడి ఆక్సీజన్‌ లెవెల్స్‌ తగ్గిపోయి కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే మృత్యువాత పడుతుండటం వేములవాడ ప్రాంతంలో జనం బేంబేలెత్తిపోతున్నారు. వారం రోజుల్లో ఇరవైకిపైగా కరోనా కాటుకు బలైన ఘటనలు ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. 

తేరుకునేలోగానే.. 
కాస్త జ్వరం, జలుబు, దగ్గు అనిపించి ఇంట్లోనే ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ కరోనా టెస్టులు చేయించుకుని హోమ్‌ క్వారంటైన్‌ ఉన్న నాగరాజు, స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందిన కొబ్బరికాయల రాజు, అర్చకులు దామెదర్‌లు కేవలం పాజిటివ్‌ వచ్చిన వారం రోజులకే మృత్యువాతపడ్డారు. ఏం జరుగుతుందోనని తెలుసుకునేలోగానే వీరంతా తుది శ్వాస విడిచారు. 

గుడికి పెరుగుతున్న రద్దీ.. విచ్చలవిడిగా తిరుగుతున్న జనం 
వేములవాడ ప్రాంతంలో కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్న క్రమంలో రాజన్న గుడికి భక్తులు, స్థానికులు రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతుండటం స్థానికంగా ఆందోళనలు నెలకొంటున్నాయి. రాత్రి 9 గంటల నుంచి చేపట్టే కర్ఫ్యూ సైతం అంతంత మాత్రంగానే కొనసాగుతుండటంతో మరింత భయం పెరిగింది. 

నాలుగు రోజుల్లోనే మాయమయ్యాడు
నిత్యం కళ్లముందే బుల్లెట్‌ తిరుగుతుండే నాగరాజు వారం రోజుల క్రితం పాజిటివ్‌ వ చ్చింది. దీంతో హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నాడు. నాలుగు రోజుల వ్యవధిలోనే శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని చెప్పడంతో హుటాహుటిన వేములవాడకు అక్కడ్నుంచి కరీంనగర్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఈనెల 25న మరణించాడని నాగరాజు బంధువులు పేర్కొంటున్నారు. 

వారం రోజుల్లో తుదిశ్వాస
అందరినీ ఆప్యాయంగా మందలిస్తూ రాజన్న గుడి ముందు కొబ్బరికాయలు, పువ్వులు అమ్ముకునే రాజు కరోనా కాటుకు బలయ్యాడు. కరోనా పాజిటివ్‌ రావడంతో స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో మూడు రోజులు చికిత్స పొందాడు. ఆక్సీజన్‌ లెవెల్స్‌ తగ్గడంతో కరీంనగర్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఈనెల 25న మరణించాడని సహచర వ్యాపారులు చెబుతున్నారు.  

ఏం జరిగిందోనని తెలుసుకునేలోగానే..
నాంపల్లి గుట్టకు వెళ్లిన భక్తులను నవ్వుతూ పలుకరించడమే కాకుండా ఆశీర్వాదాలు ఇచ్చి పంపించే అర్చకుడు దామోదర్‌ వారం రోజుల క్రితం పాజిటివ్‌ వచ్చింది. వారి సమీప బంధువు వైద్యశాఖలో పని చేస్తున్నారు. మందులు తీసుకొచ్చే వాడుకోమని చెప్పారు. నాలుగు రోజుల క్రితం శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని అనడంతో కరీంనగర్‌ ఆసుపత్రికి తరలించగానే ఆక్సీజన్‌ లెవెల్స్‌ 80 వరకే ఉన్నాయని చెప్పారు. దీంతో ఈనెల 26న ఉదయం మరణించాడని ఆలయ అధికారి ఒకరు వివరించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top