ఏడేళ్ల క్రితం స్పెర్మ్‌తో పండంటి బిడ్డ | Couple Got Baby With Seven Years Sperm In Hyderabad | Sakshi
Sakshi News home page

ఏడేళ్ల క్రితం స్పెర్మ్‌తో పండంటి బిడ్డ

Sep 4 2020 7:47 PM | Updated on Sep 5 2020 4:11 PM

Couple Got Baby Boy With Seven Years Sperm In Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌ : ఏడేళ్ల క్రితం ముందు జాగ్రత్తతో ఆ దంపతులు భద్రపరుచుకున్న స్పెర్మ్‌.. ఇప్పుడు వారికి పండంటి బిడ్డను ప్రసాదించింది. కేన్సర్‌ చికిత్సకు వెళ్లే ముందు వైద్యుల సలహా మేరకు ఆయన తన వీర్యాన్ని స్పెర్మ్‌ బ్యాంకులో భద్రపరుచుకున్నాడు. దాన్ని వినియోగించిన ఐసీఎస్‌ఐ (ఇంట్రాసైటోప్లాస్మిక్‌ స్పెర్మ్‌ ఇంజక్షన్‌) ద్వారా ఇప్పుడు వారు తల్లిదండ్రులయ్యారు. 2012లో 23 ఏళ్ల కార్తీక్‌ (పేరు మార్చాం)కు వివాహం జరిగింది. కొద్ది రోజులకే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఛాతీ, ఊపిరితిత్తుల మధ్య మెడియాస్టినల్‌ ట్యూమర్‌ (కేన్సర్‌)తో బాధపడుతున్నట్లుగా వైద్యులు గుర్తించారు. పెళ్లైన కొద్ది రోజుల్లోనే ఇలా జరగడంతో ఆ దంపతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. చికిత్సలో ఎదురయ్యే దుష్ప్రభావాలను దృష్టిలో పెట్టుకుని.. అతడి వీర్యాన్ని స్పెర్మ్‌ బ్యాంకులో భద్రపరుచుకోమని వైద్యుడు సలహా ఇచ్చారు.

దీంతో 2012లో కేన్సర్‌ చికిత్స ప్రారంభానికి ముందు కార్తీక్‌ తన వీర్యాన్ని ఒయాసిస్‌ ఫెర్టిలిటీ బ్యాంకులో భద్రపరిచాడు. సంవత్సరం క్రితం ఆయన కేన్సర్‌ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నాడు. అయితే.. కిమోథెరపీ, రేడియోథెరపీ మోతాదుల కారణంగా తండ్రి అయ్యే సామర్థ్యాన్ని కోల్పోయాడు. ఈ క్రమంలో భద్రపరిచిన వీర్యం ద్వారా సంతానం పొందాలని నిర్ణయించుకున్న ఆ దంపతులు.. ఒయాసిస్‌ ఫెర్టిలిటీని సంప్రదించారు. ఐసీఎస్‌ఐను మాక్స్‌(మాగ్నెటిక్‌ యాక్టివేటెడ్‌ సెల్‌ సార్టింగ్‌) వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 2019లో పిండాన్ని తయారుచేసి.. మహిళ గర్భాశయంలోకి ప్రవేశపెట్టారు. అలా గర్భం దాల్చిన ఆ మహిళ గత వారం పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఇటీవలే ఆస్పత్రి నుంచి తల్లిబిడ్డలు డిశ్చార్జయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement