
విద్యార్థులు లేకున్నా.. మధ్యాహ్నం
భోజనంలో బగారా రైస్.. చికెన్కర్రీ
కలెక్టర్ ఆకస్మిక తనిఖీతో వెలుగులోకి.. ఉపాధ్యాయుల తీరుపై సీరియస్
చేర్యాల(సిద్దిపేట): పాఠశాలలో ఉపాధ్యాయులు దావత్ చేసుకున్నారు. బుధవారం విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపు నివ్వడంతో విద్యార్థులంతా ఇంటికెళ్లారు. అయినా ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనం సిద్ధం చేయడం.. అందులో బగారా రైస్, చికెన్ కర్రీ వండారు. కలెక్టర్ హైమావతి చేర్యాల పట్టణ కేంద్రంలోని పెద్దమ్మగడ్డ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది.
వంటగదిని పరిశీలించిన ఆమెకు మెనూలో లేని చికెన్, బగారా అన్నం కనిపించడంతో మండిపడ్డారు. పిల్లలు లేకుండానే వంట ఎందుకు చేశారని ఉపాధ్యాలను వివరణ కోరగా, విద్యార్థి సంఘాల బంద్ పిలుపు మేరకు విద్యార్థులను ఇంటికి పంపించామని చెప్పారు. వండిన వంటను వెంటనే హాస్టల్ విద్యార్థులకు పంపించాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచించారు. ఈ ఘటనతో ఉపాధ్యాయులపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.