ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నిత్యం విధి నిర్వహణలో నిమగ్నమయ్యే రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్ సోమవారం విద్యార్థిగా మారిపోయారు. మాస్టార్ చెప్పిన పాఠాన్ని శ్రద్ధగా విన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్(ఈఎంఆర్ఎస్)ను కలెక్టర్ గరీమా అగ్రవాల్ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇంటర్ ఫస్టియర్ ఎకనామిక్స్ పాఠ్యాంశం టీచర్ బోధిస్తుండగా.. కలెక్టర్ తరగతిగదిలోకి వెళ్లి విద్యార్థినులతో కలిసి పాఠ్యాంశ బోధనను పరిశీలించారు. బోధన పూర్తయ్యాక పాఠ్యాంశంపై విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. అనంతరం డైనింగ్హాల్కు వెళ్లి విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? అని అడిగి తెలుసుకున్నారు.
మాస్టారూ.. మాలాగే..
గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు శివారు పాటిమీదిగూడెం యూపీఎస్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు డాక్టర్ గోపీనాథ్ తనదైన శైలిలో గ్రామ విద్యార్థులు ఆ ఊరి పాఠశాలలోనే చదువుకునేలా చేపట్టిన ప్రయత్నాలు అభినందనలు అందుకుంటున్నాయి. పాఠశాలల ప్రారంభానికి ముందు ఇంటింటి ప్రచారం, ఆ తరువాత డప్పు కొడుతూ బడిబాటలో ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ పాఠశాలలో చదివే పిల్లలతో తానూ సమానమంటూ స్కూల్ యూనిఫాం ధరించి గ్రామంలో నడుచుకుంటూ పాఠశాలకు చేరుకున్నారు. స్కూల్ యూనిఫాం వేసుకొని పిల్లలతో సమానంగా కూర్చున్నారు. వారి మధ్యలో కూర్చుని పాఠాలు చెబితే పిల్లలకు సులభంగా అర్థమవుతుందని, అందుకే తాను ఈ ఆలోచన చేసినట్లు తెలిపారు. ఈయన పనితీరును గుర్తించిన హెచ్ఎం సుమలతతో పాటు గ్రామస్తులు ప్రశంసించారు.


