గుడ్‌న్యూస్‌! ఒక్కో బొగ్గు గని కార్మికుడికి లక్షన్నర నుంచి రూ.5 లక్షలు.. | Coal workers to receive 23 months arrears | Sakshi
Sakshi News home page

గుడ్‌న్యూస్‌! ఒక్కో బొగ్గు గని కార్మికుడికి లక్షన్నర నుంచి రూ.5 లక్షలు..

May 21 2023 3:24 AM | Updated on May 21 2023 3:05 PM

Coal workers to receive 23 months arrears - Sakshi

గోదావరి ఖని: దేశవ్యాప్త బొగ్గు గని కార్మికుల 11వ వేతన ఒప్పందం ఎట్టకేలకు శనివారం ఖరారైంది. 23నెలల ఆలస్యంగా జరిగిన లిఖితపూర్వక వేతన ఒప్పందంపై కోలిండియా యాజమాన్యం, జాతీయ కార్మిక సంఘాల నాయకులు సంతకాలు చేశారు. కోల్‌కత్తాలో రెండు రోజుల పాటు జరిగిన 11వ వేజ్‌బోర్డు 10వ సమావేశంలో కనీస వేతనాలపై 19శాతం పెరుగుదల, అలవెన్స్‌లపై 25శాతం పెరుగుదలతో ఒప్పందం పూర్తయ్యింది.

పెరిగిన వేతనాలు జూన్‌ నుంచి అమల్లోకి రానుండగా, జూలై నుంచి కార్మికులు అందుకోనున్నారు. పెరిగిన 19శాతం కనీస వేతనం బకాయిల మేరకు ఒక్కో కారి్మకునికి రూ.1.50లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఎరియర్స్‌ రూపంలో 23నెలల బకాయిలు అందనున్నాయి. ద్విచక్రవాహనాలకు పెట్రోల్‌ అలవెన్స్‌ చెల్లిస్తున్నట్టుగానే, ఈసారి కార్లకు కూడా చెల్లించేందుకు అంగీకరించింది. ట్రాన్స్‌పోర్టు, అడిషనల్‌ ట్రాన్స్‌పోర్టు, వాషింగ్‌ అలవెన్స్‌తో పాటు పలు అలవెన్స్‌లపై 25శాతం పెరిగింది.

ఈ ఒప్పందంతో దేశవ్యాప్తంగా 4లక్షల మందికి ప్రయోజనం చేకూరనుండగా, వీరిలో సింగరేణి కారి్మకులు 39వేల మంది ఉన్నారు. సమావేశంలో కోలిండియా చైర్మెన్‌ ప్రమోద్‌ అగర్వాల్‌తో పాటు సింగరేణి డైరెక్టర్‌(పా) బలరాం, పర్సనల్‌ జీఎం కుమార్‌రెడ్డి, జేబీసీసీఐ వేజ్‌బోర్డు సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య (ఏఐటీయూసీ), జనక్‌ప్రసాద్‌(ఐఎన్‌టీయూసీ), రియాజ్‌ అహ్మద్‌(హెచ్‌ఎంఎస్‌), మంద నర్సింహారావు(సీఐటీయూ), మాధవనాయక్‌(బీఎంఎస్‌) పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement