50 శాతం శాలరీ హైక్‌.. సెలవుల పెంపు; డిమాండ్లు ఇవే | Coal India: Mine Workers Common Chapter of Demands, Basic Salary 50 Percent Hike | Sakshi
Sakshi News home page

50 శాతం శాలరీ హైక్‌.. సెలవుల పెంపు; డిమాండ్లు ఇవే

Jun 7 2021 8:14 PM | Updated on Jun 7 2021 8:21 PM

Coal India: Mine Workers Common Chapter of Demands, Basic Salary 50 Percent Hike - Sakshi

దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు గని కార్మికుల ఉమ్మడి చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్లను జాతీయ కార్మిక సంఘాలు సిద్దం చేశాయి.

గోదావరిఖని: దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు గని కార్మికుల ఉమ్మడి చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్లను జాతీయ కార్మిక సంఘాలు సిద్దం చేశాయి. ఈ నెలాఖరుతో 10వ వేతన సంఘం గడువు పూర్తి కానుంది. వచ్చే నెల నుంచి కొత్త వేతన ఒప్పందం అమలు కావాల్సి ఉంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న నాలుగు జాతీయ సంఘాలు ఒకేతాటిపైకి వచ్చి ఉమ్మడి చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్లు పొందు పర్చాయి. దేశంలోని 4 లక్షల మంది కార్మికులకు వర్తించనున్న డిమాండ్లపై బొగ్గు గని కార్మికుల్లో ఆసక్తి రేకిస్తోంది. తమకు సంబంధించి జాతీయ కార్మిక సంఘాలు ఏ విధంగా ముందుకు వెళ్తాయి.. 11వ వేతన కమిటీలో జీతభత్యాలు ఏ విధంగా పెరుగుతాయి.. అలవెన్సులు ఏ విధంగా ఉంటాయనే ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి.

దేశంలో ఉన్న జాతీయ కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూ యూనియన్లు తమ డిమాండ్లను ఉమ్మడిగా సిద్దం చేశాయి. ఈనెల 3న నిర్వహించిన వర్చువల్‌ సమావేశంలో దీనికి అంగీకరించారు. ప్రధానంగా మూల వేతనం, అలవెన్సులు, సెలవులు తదితర అంశాలపై ఇప్పటికే స్పష్టతకు వచ్చాయి. దీనిపై ఆదివారం మరోసారి వర్చువల్‌ సమావేశం నిర్వహించి పూర్తిస్థాయిలో అంగీకారం తెలుపనున్నాయి. ఈ ఒప్పందం పూర్తయితే 01.07.2021 నుంచి 30.06.2026 వరకు అమలులో ఉండనుంది.  

ప్రధాన డిమాండ్లు 

  • ప్రస్తుత మూల వేతనంపై 50 శాతం జీతం పెంచాలి. 
  • ఎల్‌ఎల్‌టీసీ రూ.75 వేలు, ఎల్‌టీసీ రూ .50 వేలు చెల్లించాలి  
  • రెస్క్యూ అలవెన్స్‌ వేతనంలో 15 శాతం చెల్లించాలి. 
  • క్వారీ, వాషరీ, క్రషర్, సీహెచ్‌పీల్లో పనిచేసే కార్మికులకు వేతనంలో 10 శాతం డస్ట్‌ అలవెన్స్‌ ఇవ్వాలి  
  • సాధారణ సెలవులు 11 నుంచి 15 రోజులకు పెంచాలి 
  • సిక్‌ లీవ్‌ 15 నుంచి 20 రోజులకు పెంచాలి. 
     
  • దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే కార్మికులు కోలుకునేంత వరకు పూర్తి స్థాయి వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలి 
  • మూడేళ్ల వరకు శిక్షణ, స్టడీ లీవ్‌ ఇవ్వాలి 
  • ప్రతి సంవత్సరం నిర్వహించే సమావేశాలకు టీఏ, డీఏతో పాటు నలుగురు ట్రేడ్‌ యూనియన్‌ ప్రతినిధులకు ప్రత్యేక సెలవులు ఇవ్వాలి.  
  • గ్రాడ్యువిటీ చెల్లింపునకు సీలింగ్‌ పరిమితి ఉండొద్దు 
  • విధుల్లో మరణించిన కాంట్రాక్టు కార్మికులతో సహా పర్మినెంట్‌ కార్మికులకు రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలి. ఆధార పడిన వారికి పర్మినెంట్‌ ఉద్యోగం ఇవ్వాలి.  
     
  • సీపీఆర్‌ఎంఎస్‌ స్కీంపై రూ.25 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందించాలి.  
  • ప్రతి గనిపై లైఫ్‌ సపోర్టు అంబులెన్సులు ఏర్పాటు చేయాలి 
  • పెన్షన్‌ ఫండ్‌ కోసం టన్ను బొగ్గుపై రూ.20 వసూలు చేయాలి.  
  • కనీస పెన్షన్‌ రూ.10 వేలకు తగ్గకూడదు 
  • వారంలో 40 పని గంటలు లేదా ఐదు రోజులు పనిదినాలు ఉండాలి  
  • కాంట్రాక్టు కార్మికులకు క్రమబద్ధీకరించాలి 
  • గనుల్లో కొత్త నియామకాలు ప్రారంభించాలి. 
  • కార్మికుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలి  
  • కాంట్రాక్టు కార్మికులకు జేబీసీసీఐ పరిధిలోకి రావాలి. 
  • పారామెడికల్‌ స్టాఫ్‌కు ప్రత్యేక క్యాడర్‌ స్కీం తయారు చేయాలి. 
  • యువత చదువుకు తగిన ఉద్యోగం ఇవ్వాలి. 

వీటితో పాటు మరికొన్ని డిమాండ్లపై జాతీయ కార్మిక సంఘాలు పూర్తి స్థాయి కసరత్తు చేసి బొగ్గు పరిశ్రమ ద్వైపాక్షిక కమిటీకి అందించనున్నాయి. ఈ డిమాండ్లపై కోలిండియా యాజమాన్యం జాతీయ కార్మిక సంఘాలతో చర్చించనుంది. ఇరువర్గాల సంప్రదింపుల అనంతరం పూర్తి స్థాయి నిర్ణయాలు వెలువడనున్నాయి.   

చదవండి: సింగరేణిలో ఇదేం వివక్ష ? 

Advertisement
 
Advertisement
Advertisement