సాక్షి, హైదరాబాద్: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ స్మృతివనం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఘట్కేసర్ ఎన్ఎఫ్సీ నగర్లో పోలీస్ లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు జరిగాయి. అందెశ్రీ అంత్యక్రియలకు సీఎం రేవంత్ హాజరయ్యారు. ఆయన అందెశ్రీ పాడెను మోశారు. అంత్యక్రియలు అనంతరం రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు.

అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామని.. కిషన్రెడ్డి, బండి సంజయ్ సహకరించాలని రేవంత్ కోరారు. ‘‘తెలంగాణ ఉద్యమకారుడిగా రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించిన వ్యక్తి అందెశ్రీ. వారిని కోల్పోవడం తెలంగాణ సమాజంతో పాటు వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనను కలిసి తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి మీ పాత్ర ఉండాలని కోరా. గద్దర్ అన్నతో పాటు అందెశ్రీ కూడా ప్రజల్లో స్పూర్తి నింపారు. ఆయన రాసిన ప్రతీ పాట తెలంగాణలో స్ఫూర్తిని నింపింది


..అందుకే ఆయన రాసిన “జయ జయహే తెలంగాణ” గీతాన్ని పాఠ్యాంశంగా చేర్చేందుకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటాం. ఆయన పేరుతో ఒక స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తాం. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆయన పాటల సంకలనం “నిప్పుల వాగు” ఒక భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా తెలంగాణ సమస్యలపై పోరాడేవారికి గైడ్గా ఉపయోగపడుతుంది. అందుకే 20 వేల పుస్తకాలను ముద్రించి తెలంగాణలోని ప్రతీ లైబ్రరీ లో ఆ పుస్తకాన్ని అందుబాటులో ఉంచుతాం’’ అని సీఎం రేవంత్ తెలిపారు.



