తొమ్మిది రోజుల్లో 9వేల కోట్లు ఇస్తాం: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy statement on Rythu Bharosa | Sakshi
Sakshi News home page

తొమ్మిది రోజుల్లో 9వేల కోట్లు ఇస్తాం: సీఎం రేవంత్‌

Jun 17 2025 1:01 AM | Updated on Jun 17 2025 1:02 AM

CM Revanth Reddy statement on Rythu Bharosa

‘రైతు నేస్తం’ ప్రారంభోత్సవంలో రైతులతో ముచ్చటిస్తున్న సీఎం రేవంత్‌

రైతు నేస్తం ప్రారంభోత్సవంలో రైతు భరోసాపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన

తొలిరోజు 41.25 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,349 కోట్లు జమ

ఎకరానికి రూ.6 వేల చొప్పున విడుదలకు కంప్యూటర్‌ బటన్‌ నొక్కిన ముఖ్యమంత్రి

ఎన్ని కష్టాలున్నా పెట్టుబడి సాయం ఆగదని స్పష్టీకరణ 

రాష్ట్రవ్యాప్తంగా 1,034 వేదికల్లో ‘రైతు నేస్తం’ ప్రారంభం 

అన్నదాతలకు సబ్సిడీపై పనిముట్లు ఇస్తామని వెల్లడి 

వరితోపాటు కూరగాయలు,పప్పు దినుసులు పండించాలని పిలుపు

సాక్షి, హైదరాబాద్‌: రైతు భరోసా పథకం కింద వానాకాలం సీజన్‌కు సంబంధించిన పెట్టుబడి సాయం విడుదలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని 70.11 లక్షల మంది రైతులకు చెందిన 1.49 లక్షల ఎకరాల సాగు యోగ్యమైన వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.6 వేల చొప్పున నిధులు విడుదల చేస్తూ కంప్యూటర్‌ బటన్‌ నొక్కారు. కేవలం 9 రోజుల్లో రైతులందరికీ మొత్తం రూ.9 వేల కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. తొలిరోజు సోమవారం 2 ఎకరాల లోపు 41,25,289 మంది రైతులకు రూ.2,349.83 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. 

39.16 లక్షల ఎకరాలకు గాను ఈ డబ్బులు జమయ్యాయి. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో రాష్ట్రంలోని 1,034 వేదికల్లో కొత్తగా ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు రైతులతో వర్చువల్‌గా సంభాషించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తూ రైతు భరోసా గురించిన ప్రకటన చేశారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. 

పదేళ్లలో వ్యవసాయాన్ని నీరుగార్చారు.. 
గడిచిన పదేళ్ల కాలంలో వ్యవసాయాన్ని నీరుగార్చారు. వరి వేస్తే ఉరే అని, వడ్లు కొనలేం అని పెద్దాయన చెప్పాడు. మేం పేద ప్రజలకు రేషన్‌ కార్డుల ద్వారా సన్న బియ్యం ఇవ్వాలని సంకల్పించి దొడ్డు ధాన్యంకు బదులు సన్న ధాన్యం పండించమని రైతులను కోరాం. సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇస్తామని ప్రకటించాం. ఈ మేరకు రైతులు సన్న వడ్లు పండిస్తే, సన్న బియ్యం పేదల కడుపు నింపుతున్నాయి. రాష్ట్ర రైతులు ఈ ఏడాది దేశంలోనే అత్యధికంగా 2.80 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించారు.  

రూ.1,29,000 కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టారు 
సర్పంచులు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని అంటున్నారు. మేం అధికారంలోకి వచ్చే నాటికే సర్పంచుల పదవీ కాలం ముగిసింది. కాంట్రాక్టర్లకు మరో రూ.60 వేల కోట్లు బకాయిలు పెట్టారు. మొత్తంగా రూ.1,29,000 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి, ఫీజు రీయింబర్స్‌మెంటు డబ్బులు వాడుకున్నారు. రిటైర్డ్‌ ఉద్యోగులకు ఇచ్చే బెనిఫిట్స్‌ రూ.12 వేల కోట్లు బకాయి పెట్టి పోయారు. 

పదేళ్లలో రూ.8 లక్షల 20 వేల కోట్ల అప్పు మా నెత్తిపై మోపి నడుం వంగిపోయే పరిస్థితి తెచ్చారు. రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసంలోకి నెట్టి పోయినా, ఒక్కొక్క మెట్టు పేర్చుకుంటూ సరి చేసుకుంటూ వస్తున్నాం. ఎన్ని కష్టాలు ఉన్నా రైతులకు పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించుకున్నాం. మంత్రులందరితో చర్చించి రైతులందరికీ 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు వారి ఖాతాల్లో వేయాలని నిర్ణయించాం.  

రైతు ఆశీర్వాదంతోనే ఏదైనా సాధ్యం 
వార్డు సభ్యుడి నుంచి సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, చివరకు ముఖ్యమంత్రి అయినా రైతు ఆశీర్వాదం ఉంటేనే అది సాధ్యపడుతుంది. కుర్చీ బలంగా ఉంటుంది. అందుకే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం. రైతును రాజును చేయడం, వ్యవసాయాన్ని పండుగ చేయడం లక్ష్యంగా నిర్ణయాలు తీసుకున్నాం. 

గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో రెండు విడతలుగా రుణమాఫీ కింద రైతులకు ఇచ్చింది రూ.17 వేల కోట్ల లోపే. ఊళ్లళ్ల పెళ్లిళ్లలో ఎక్కువ కటా్నల కోసం పిలగాని తండ్రులు కార్లు, మేడలు చూపించినట్లు..పెద్దాయన రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చారు. ఆనాటి గాయాలు మానలేదు. అయినా రైతుల కోసం రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్, రైతుబీమా, బోనస్‌ కింద 18 నెలల్లోనే రూ.1,01,720 కోట్లు ఖర్చు చేశాం. 

ఇంత తక్కువ సమయంలో అంత పెద్ద మొత్తంలో రైతుల కోసం ఖర్చు చేసిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. దీనిపై గ్రామ సభలు పెట్టి చర్చిద్దాం. ధాన్యం కొనుగోలు చేసి రైతులకు 24 గంటల్లో డబ్బులు జమ చేశాం. ధరణి స్థానంలో భూభారతి తీసుకొచ్చాం. రైతులకు మేలు చేసేందుకే ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది. 

చావుల పునాదుల మీద రాజకీయం చేస్తున్నారు 
రాష్ట్రంలో రైతుల కోసం, ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న కృషిని తక్కువ చేసే ప్రయత్నం జరుగుతోంది. చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తుంటే..మొన్ననే వచ్చాడు పిలగాడు కుదురుకోనిద్దాం అని లేకుండా రాజకీయం చేస్తున్నారు. విద్యార్థులు, రైతులు చనిపోతే సంతోíÙస్తున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆనందం పొందుతున్నారు. చావుల పునాదుల మీద రాజకీయం చేస్తున్నారు. నేను ఎవరినీ కలవకుండా ఫాం హౌస్‌లో లేను. అయినా రాజకీయం చేస్తూ విమర్శలు చేస్తున్నారు.   

విద్యార్థులు జొన్న రొట్టెలు తినాలి 
చిన్నప్పుడు మా ప్రాంతంలో కందులు, బుడమ కాయలు (దోసకాయలు) పండేవి. దోసకాయ కందిపప్పు కూరను జొన్నరొట్టెతో తింటే ఎంతో కమ్మగా ఉండేది. మటన్, చికెన్‌ కూడా పనికిరాదు. విద్యార్థులు జొన్నరొట్టెలు తినండి. మీ బట్టలు మీరే ఉతుక్కోండి. ఏ సిక్స్‌ ప్యాక్‌ ఎక్సర్‌సైజ్‌లు పనికిరావు. వరి ఒక్కటే కాదు. కూరగాయలు, కందులు, పెసర్లు వంటి మిల్లెట్లు పండించాలి. రైతులకు సబ్సిడీతో పనిముట్లు ఇస్తాం. 

అధునాతన పంటలు కాదు.. తాతలు, తండ్రులు పండించిన పంటలను మళ్లీ పండించాలి. కూరగాయలు పండిస్తే హైదరాబాద్‌లో అమ్ముకోవచ్చు. ఈ మేరకు రైతులకు అవగాహన కల్పించేందుకు అనుభవజ్ఞులైన రైతులతో రైతు వేదికల వద్ద పాఠాలు చెప్పించండి. భూమి రైతుకు ఆత్మగౌరవం.. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎవరు ఎన్ని ధర్నాలు చేసినా, బట్టలు చించుకున్నా పదేళ్లు మన ప్రభుత్వమే ఉంటుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement