‘కోటి’ సంపద సృష్టి | CM Revanth Launches 553 RTC Buses for Women SHGs Under Indira Mahila Shakti Scheme | Sakshi
Sakshi News home page

‘కోటి’ సంపద సృష్టి

Jun 10 2026 6:19 AM | Updated on Jun 10 2026 6:19 AM

CM Revanth Launches 553 RTC Buses for Women SHGs Under Indira Mahila Shakti Scheme

పరేడ్‌ గ్రౌండ్స్‌లో బస్సులను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, మండల మహిళా సమాఖ్యల సభ్యులు

ఆర్థిక వ్యవస్థలో మహిళలు కీలక భాగస్వాములు కావాలి  

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం 

మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా ప్రభుత్వం కృషి 

మహిళాశక్తి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

మహిళా సంఘాలకు చెందిన 553 బస్సులు ఆర్టీసీకి అందజేత  

సాక్షి, హైదరాబాద్‌: మహిళలు సంక్షేమ పథకాల లబ్ధిదారులుగానే కాకుండా ఆస్తుల యజమానులు, వ్యాపారవేత్తలు, సంపద సృష్టికర్తలుగా ఎదిగేవిధంగా సముచితమైన ప్రోత్సాహాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం ఎ.రేవంత్‌ రెడ్డి అన్నారు. వారిని రుణగ్రహీతల స్థాయి నుంచి ఆస్తుల యజమానుల స్థాయికి తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు.

రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మండల మహిళా సమాఖ్యలు కొనుగోలు చేసిన 553 టీజీఎస్‌ఆర్టీసీ బస్సులను సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో మంగళవారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన మహిళా సంఘాల సభ్యులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సంక్షేమం నుంచి సంపద సృష్టి వైపు మహిళలను తీసుకెళ్లే ఆర్థిక విప్లవానికి ఈ బస్సులు చిహ్నలుగా నిలుస్తాయని అన్నారు.  

ఆర్టీసీకి లీజుకు..  
మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 553 మండల మహిళా సమాఖ్యలు రూ.199.08 కోట్ల పెట్టుబడితో 553 బస్సులను కొనుగోలు చేసి టీజీఎస్‌ఆర్టీసీకి లీజుకు ఇచ్చినట్లు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రతి బస్సుకు నెలకు రూ.69,468 అద్దె లభిస్తుండగా, మొత్తం 553 బస్సుల ద్వారా మహిళా సమాఖ్యలకు నెలకు సుమారు రూ.3.84 కోట్ల ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ఇప్పటివరకు రూ.20.34 కోట్లకు పైగా అద్దె ఆదాయం మహిళా సమాఖ్యలకు అందినట్లు చెప్పారు.

మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద ఇప్పటివరకు 308 కోట్లకు పైగా మహిళా ప్రయాణాలు నమోదయ్యాయని, రూ.10,696 కోట్ల ప్రయాణ వ్యయాన్ని ఆదా చేసుకున్నారని వెల్లడించారు. మహిళా సంఘాలను రవాణా, వ్యవసాయం, మార్కెటింగ్, ఫుడ్‌ ప్రాసెసింగ్, సేవారంగం, వాణిజ్యం, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భాగస్వాములను చేస్తున్నామని రేవంత్‌రెడ్డి తెలిపారు. మహిళా సంఘాల ద్వారా 1000 మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.  

గ్రామీణ ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర 
రాష్ట్రంలో ఒకేరకమైన పంటలు పండించే విధానానికి స్వస్తి పలకాలని, అన్ని రకాల పంటలను పండించేవిధంగా పంట మార్పిడి విధానంపై మహిళా సంఘాలు రైతులకు అవగాహన కల్పించాలని సీఎం కోరారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, విలువ ఆధారిత ఉత్పత్తులు, మార్కెటింగ్‌ వ్యవస్థలు, గ్రామీణ ఆర్థికాభివృద్ధిలో మహిళా సంఘాలు మరింత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఇళ్లు, ఇతర ఆస్తులపై మహిళలకు యాజమాన్యం కల్పింస్తున్నట్లు చెప్పారు. మహిళలకు శాశ్వత మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 వేల ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మిస్తున్నామన్నారు.

మహిళా సంఘాల ఉత్పత్తులకు విస్తృత మార్కెట్‌ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక మార్కెటింగ్, వాణిజ్య మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దేశంలోనే అత్యంత విస్తృత మహిళా సాధికారత కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి సీతక్క చెప్పారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ, మహిళలను లబ్ధిదారుల నుంచి యజమానులుగా తీర్చిదిద్దిన చారిత్రాత్మక కార్యక్రమంగా ఈ బస్సుల పంపిణీ నిలుస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఎంపీలు వేం నరేందర్‌ రెడ్డి, అనిల్‌ కుమార్‌ యాదవ్, శాసనసభ్యులు నవీన్‌ యాదవ్, గణేష్, మల్‌రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ గద్వాల విజయలక్షి్మ, తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ కలువ సుజాత గుప్తా, టీజీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నాగిరెడ్డి, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రియాంక ఆలా తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement