దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆవేదన
నియోజకవర్గ పరిధిలో గౌరవం లేదంటూ ఆక్రోశం
కనీస సమాచారం లేకుండానే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
ప్రభుత్వ శాఖల్లో, కొందరు అధికారుల్లో అవినీతి విపరీతంగా పెరుగుతోంది
ఈ అవినీతిని కట్టడి చేయకుంటే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది
డిప్యూటీ సీఎం భట్టికి దళిత ప్రజాప్రతినిధుల గోడు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని దళిత ప్రజా ప్రతినిధులు ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధపడ్డారు. పార్లమెంటు సభ్యులుగా, శాసనమండలి, శాసన సభ్యులుగా ప్రజాక్షేత్రంలో గెలిచినప్పటికీ... ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఉన్నతాధికారుల వద్ద కనీస మర్యాద లేకపోవడం పరాజయం కంటే ఘోర అవమానంగా భావిస్తున్నట్లు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి ప్రజాప్రతినిధిగా గెలిచినందుకే ఈ అవమానాలు పడాల్సి వస్తుందా? అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రజాప్రతినిధుల మాదిరిగా తమకు కూడా గౌరవ మర్యాదలు దక్కాలని, అందరితో సమానంగా ప్రభుత్వంలో సముచిత ప్రాధాన్యం పొందాలని వారు కోరుతున్నారు. ఇందులో భాగంగా ఎస్సీ ప్రజాప్రతినిధుల కమిటీ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ, కన్వీనర్ మల్లు రవి నేతృత్వంలో ఎస్సీ ఎంపీలు కడియం కావ్య, గడ్డం వంశీ, ప్రభుత్వ విప్లు అద్దంకి దయాకర్, వేముల వీరేశం, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, ఏఆర్ నాగరాజు, మట్టా రాగమయి, మందుల సామేల్, కడియం శ్రీహరి తదితరులు శనివారం ప్రజాభవన్లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి గోడును వెళ్లబోసుకున్నట్లు తెలిసింది.
విశ్వసనీయ సమాచారం మేరకు..
‘పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో విసిగిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో గెలిపిస్తే... ఆయా ఎస్సీ ప్రజాప్రతినిధులకు ఏమాత్రం గౌరవం దక్కడం లేదంటూ ఉపముఖ్యమంత్రి ఎదుట వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ నియోజకవర్గాల్లో డివిజన్ స్థాయి అధికారి నుంచి మండల స్థాయి అధికారి వరకు ఎవరికి బదిలీ అయినా తమ దృష్టికి రావడం లేదని, కనీసం కొత్త అధికారులకు పోస్టింగ్ ఇస్తున్న విషయం కూడా కనీస సమాచారం ఉండడం లేదని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమంత్రితో సహా ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల పర్యటన వివరాలు కూడా తమకు తెలిడయం లేదని వివరించారు. ఈ అంశంపై జిల్లా స్థాయిలో ఉన్నతాధికారులు, చివరకు కలెక్టర్ను అడిగినా స్పందన రావడం లేదని, సచివాలయంలోని సంబంధిత శాఖ కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తే వారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఎస్సీ ప్రజాప్రతినిధులంతా మూకుమ్మడిగా భట్టి ముందు విన్నవించారు.
ప్రాధాన్యత ఇస్తేనే నియోజకవర్గంలో పార్టీకి మరింత మంచిపేరు వస్తుందని, తదుపరి ఎన్నికల్లో మరింత మెజార్టీ వస్తుందన్నారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి భారీగా పెరుగుతోందని, కొందరు అధికారులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని, వారితో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని వివరించారు. ఈ అవినీతిని అరికట్టకుంటే, అవినీతి అధికారులపై చర్యలు తీసుకుని వ్యవహారాన్ని కట్టడి చేయకుంటే భవిష్యత్లో పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందనే అంశాన్ని కూడా వివరించినట్లు తెలిసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజల్లో సానుకూల వాతావరణం ఉందని, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతం అయ్యాయని, ఎస్సీ నియోజకవర్గాల్లో అదనంగా మరో వెయ్యి ఇళ్లు చొప్పున యూనిట్లు పెంచాలని ఎస్సీ ప్రజాప్రతినిధులు కోరారు.
అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.10 కోట్లు చొప్పున నియోజకవర్గ అభివృద్ధి నిధి ఇవ్వాలని కూడా వివరించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోపాటు భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవ తీసుకుని ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో పర్యటించాలని కోరినట్లు తెలిసింది. ఈ సమావేశంలో తుంగతుర్తి నియోజకవర్గ పంచాయతీ కూడా చర్చకు వచి్చనట్లు సమాచారం. ఎస్సీ ప్రజాప్రతినిధుల సమస్యలను సావధానంగా విన్న భట్టి వారికి నచ్చజెప్పినట్లు తెలిసింది. ఎస్సీ ప్రజాప్రతినిధుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. ఇకపై ఎలాంటి ఇబ్బందులున్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని భట్టి వారికి సూచించారు. అందరి ఐక్యతే పార్టీకి బలం అని, పార్టీకి నష్టం కలిగించే ఏ పనీ చేయవద్దన్నారు. తన పూర్తి సహకారం ఉంటుందని వారికి స్పష్టం చేశారు. అదేవిధంగా పార్టీనేతల మధ్య సమస్యలు వస్తే అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలని, లేకుంటే పార్టీ అధ్యక్షుడు, లేదా తన దృష్టికి తీసుకురావాలని, అలా కాకుండా రచ్చకెక్కితే మంచిది కాదంటే తుంగతుర్తి వ్యవహారంపై స్పందించినట్లు తెలిసింది.


