గ్రేటర్‌లో సిటీ బస్సు ప్రయాణికుల వేదన | city No Bus shelters In Greater Hyderabad | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌లో సిటీ బస్సు ప్రయాణికుల వేదన

Apr 22 2025 12:15 PM | Updated on Apr 22 2025 12:15 PM

 city No Bus shelters In Greater Hyderabad

బస్‌షెల్టర్లు లేక రహదారులపైనే వేచి చూడాల్సిన పరిస్థితి

90 శాతం ప్రాంతాల్లో ఇదే పరిస్థితి

ఏసీ షెల్టర్లున్నా వేసవిలో చెమటలే..

కొన్నింట్లో దుకాణాలు, జిరాక్స్‌ సెంటర్లు

యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నా పట్టని అధికారులు

అటు హయత్‌నగర్‌ నుంచి పటాన్‌చెరు, ఆరాంఘర్‌ నుంచి సికింద్రాబాద్, ఇటు గచ్చిబౌలి నుంచి అఫ్జల్‌గంజ్, కూకట్‌పల్లి నుంచి కోఠి వరకు మాత్రమే కాదు..నగరంలో ఎటువైపు నుంచి ఎటు వెళ్లాలన్నా, ఒక దిక్కు నుంచి మరో దిక్కుకు పోవాలన్నా దాదాపు 20 లక్షల మంది సామాన్య ప్రజలు ప్రయాణిస్తున్నది సిటీ బస్సుల్లోనే. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన సిటీ బస్సు ప్రయాణికుల విషయంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కని్పస్తోంది. వేల సంఖ్యలో ప్రజలు బస్సుల కోసం నిరీక్షించే ప్రాంతాల్లో ఎలాంటి షెల్టర్లు లేవు. 

మండుటెండల్లో మలమల మాడుతున్నారు. అకాల వర్షాలతో తడుస్తున్నారు. బస్‌ షెల్టర్లు ఉన్న ప్రాంతాల్లో అవి ప్రజలకు ఉపయోగపడటం లేదు. తూతూ మంత్రంగా ఏర్పాటు చేసిన షెల్టర్లు..కేవలం కొన్ని ప్రైవేటు ఏజెన్సీలను మేపేందుకేననే విమర్శలు ఎంతోకాలంగా వెల్లువెత్తుతున్నా సంబంధిత యంత్రాంగాలకు చీమకుట్టినట్లు కూడా లేదు. ఈ నేపథ్యంలో గ్రేటర్‌లో బస్‌షెల్టర్లు దుస్థితి..ప్రయాణికుల వెతలపై ‘సాక్షి’ బిగ్‌ స్టోరీ..   

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని వివిధ జంక్షన్లను, ఫ్లై ఓవర్లను రంగుల హంగులతో తీర్చిదిద్దుతున్న యంత్రాంగం..బస్సుల కోసం వేచి చూసే లక్షల ప్రయాణికులకు కనీసం నీడ కల్పించలేక పోతోంది. అధికారుల లెక్కల మేరకు నగరంలో 1300కు పైగా బస్‌షెల్టర్లున్నాయి. కానీ, వాటిల్లో సగం కూడా ప్రయాణికులకు ఉపయోగపడటం లేదు. మెజార్టీ షెల్టర్లు ఎంపిక చేసిన కొన్ని ప్రైవేటు ఏజెన్సీలకు ప్రకటనల ద్వారా  కాసుల వర్షం కురిపించేందుకు తప్ప, లక్షల సంఖ్యలో ఉన్న ప్రజలకు కనీసం నీడనివ్వడం లేవు. అన్నీ తెలిసినా సంబంధిత యంత్రాంగం నిద్ర నటిస్తోంది. వాటిని ఏర్పాటు చేసిందే ‘పై వాళ్ల’ కోసం అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. అంతేకాదు..ఫిర్యాదులందినప్పుడో, పత్రికల్లో వచ్చినప్పుడో చర్యలు తీసుకోమన్నా కిందిస్థాయి సిబ్బంది డోంట్‌ కేర్‌ అన్నట్లుగా వ్యవహరిసున్నారంటే పరిస్థితి అంచనా వేసుకోవచ్చు.  



చెమటలు పుట్టిస్తున్న ఏసీ షెల్టర్లు  
పేరుకు ఏసీ షెల్టర్లయినా, వాటిల్లో ఉండలేక ప్రజలకు చెమటలు పడుతున్నాయి. నగరంలో 19 ఏసీ షెల్టర్లుండగా పేరుకే ఏసీ చందంగా మారాయి. కొన్ని ప్రయాణికులకు షెల్టర్లుగా కాకుండా,  ప్రైవేటు దుకాణాలుగా బాగా ఉపయోగపడుతున్నాయి. జ్యూస్‌ సెంటర్లు, జిరాక్స్‌ సెంటర్లుగానే కాక జనరల్‌ స్టోర్స్‌గానూ లాభాలు కురిపిస్తున్నాయి. ఖైరతాబాద్, దిల్‌సుఖ్‌నగర్, సికింద్రాబాద్‌లలో ఇలాంటివి చూడవచ్చు. సికింద్రాబాద్‌తో సహ పలు ప్రాంతాల్లో బస్‌òÙల్టర్ల ముందే చిరు దుకాణాలుండటంతో ప్రజలు వాటిల్లోకి వెళ్లలేక బయటే నిలబడాల్సిన దుస్థితినెలకొంది.  

ప్రయాణికులున్నా, షెల్టర్లు లేవు 
బస్‌షెల్టర్లుకు అనుమతులిచ్చేది జీహెచ్‌ఎంసీ. షెల్టర్లు ఏర్పాటు చేసి లాభాలు పొందేది ప్రైవేటు ఏజెన్సీ. ప్రయాణికుల కోసం బస్సులాపేది ఆరీ్టసీ. ఒకరితో ఒకరికి సంబంధం లేదు. అనుమతులిచ్చాక నిర్వహణ లోపాలపై జీహెచ్‌ఎంసీ చర్యల్లేవు. ఎక్కడ అడ్వర్టయిజ్‌మెంట్లు బాగా కనిపిస్తాయో అక్కడ ఏర్పాటు చేస్తున్నారే తప్ప ప్రజలు అవస్థలు పడుతున్న బస్టాపుల్లో షెల్టర్లు ఏర్పాటు చేయడం లేదు. సికింద్రాబాద్, పంజగుట్ట, ముషీరాబాద్, రామంతాపూర్, ఎల్‌బీనగర్‌ వంటి అనేక ముఖ్య ప్రాంతాల్లో అసలు షెల్టర్లే లేవు. రోడ్లపైనే నుంచుని ప్రజలు అవస్థలు పడుతున్నా అధికారుల కళ్లకు  కనిపించడం లేదు.

 వారి దృష్టిలో అక్కడ బస్‌షెల్టర్లు అవసరం లేదు. ఆర్టీసీ అధికారుల లెక్కల మేరకు తగినంత మంది ప్రయాణికులు లేనందున అక్కడ బస్‌షెల్టర్‌లు అవసరం లేదని జీహెచ్‌ఎంసీ చెబుతోంది. ఉన్న ప్రాంతాల్లోనూ చాలా చోట్ల  విరిగిన బెంచీలు, చెత్తా చెదారాలు, పాన్, జర్దా మరకలు, వాటిల్లోనే ఆవాసముంటున్న కుక్కలు, పిల్లులతో మురికిమయంగా మారాయి. వాటి కంటే బయట ఎండలో ఉండేందుకే ప్రజలు మొగ్గుచూపుతున్నారు. చాలా ప్రాంతాల్లో రాత్రుళ్లు లైట్లు వెలగక, తిష్టవేసే పోకిరీలతో అక్కడ ఉండాలంటే మహిళలు భయపడాల్సిన పరిస్థితి.  

ఇవ్వడం వరకే జీహెచ్‌ఎంసీ వంతు.. 
డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేషన్, ట్రాన్స్‌ఫర్‌(డీబీఎఫ్‌ఓటీ) కింద జీహెచ్‌ఎంసీ షెల్టర్ల ఏర్పాటుకు కొన్ని ప్రైవేటు ఏజెన్సీలకు మాత్రమే అనుమతులిచి్చంది. ఏసీ షెల్టర్లకు అనుమతులిచ్చి దాదాపు ఎనిమిదేళ్లయింది. లెక్క ప్రకారం పదేళ్ల గడువు కాగా, మరో ఐదేళ్లు అదనంగా పొడిగించే సదుపాయాన్నీ ఇచ్చేసినట్లే పరిగణిస్తున్నారు. మిగతా షెల్టర్లదీ అదే పరిస్థితి. షెల్టర్లకు గ్రేడ్లున్నప్పటికీ,ఉండాల్సిన సదుపాయాల్లేవు. ఇన్నేసి ఏళ్లపాటు ప్రైవేటుకు కట్టబెట్టి, ప్రజలకు సమస్యలు మిగులుస్తున్నారు.  

ఏసీ షెల్టర్లున్న ప్రాంతాలు 
ఖైరతాబాద్, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్, బోరబండ, కేపీహెచ్‌బీ, ఆరాంఘర్, దిల్‌సుఖ్‌నగర్, కొండాపూర్, మలేసియన్‌ టౌన్‌íÙప్, కోఠి, తార్నాక, మదీనాగూడ, శిల్పారామం, విద్యానగర్, బేగంపేట్‌.  

ఇబ్బందిగా ఉంది..  
చందానగర్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో పీఈటీగా ఉద్యోగం చేస్తున్నా. కూకట్‌పల్లికి వెళ్ళడానికి చందానగర్‌ గంగారం బస్టాప్‌లో నిలబడ్డా. బస్‌ షెల్టర్‌ లేక అరగంట నుంచి  మండుటెండలో బస్సు కోసం ఎదురుచుస్తున్నా. చాలా ఇబ్బందిగా ఉంది. వస్తున్న బస్సులు సైతం ఫుల్‌ రష్‌తో ఉంటున్నాయి.  
 – అరవింద్, టీచర్‌  

ఎఫ్‌ఓబీ నీడలో.. 
నేను దీప్తిశ్రీనగర్‌లో ఉంటా. రుద్రారంలోని తోషిబా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. మదీనాగూడ దీప్తిశ్రీనగర్‌ బస్టాప్‌లో బస్‌òÙల్టర్‌ లేక ఎండాకాలంలో ఎఫ్‌ఓబీ కింద నిల్చుంటున్నాం. ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు సమస్య వివరించినా పట్టించుకున్నవారే లేరు.  
రవికుమార్, ప్రైవేట్‌ ఉద్యోగి  

మండుటెండలో అవస్థలు  
బస్‌ షెల్టర్‌ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. సమయానికి బస్సులు రాక, కూర్చునే సదుపాయం లేక ఎంతో సేపు వేచి చూసేందుకు నరకం అనుభవిస్తున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి అడ్డగుట్ట డివిజన్‌లో బస్‌ షెల్టర్లు ఏర్పాటు చేయాలి.     
 – మహేష్‌, అడ్డగుట్ట  

గాల్లో దీపంలా..  
బస్టాప్‌ల వద్ద ప్రయాణికుల భద్రత గాలిలో దీపంలా మారింది. అత్యంత రద్దీగా ఉండే టోలిచౌకి  కూడలి వద్ద ఒక్క బస్‌òÙల్టర్‌ కూడా లేదు. ప్రతి గంటకు ఈ చౌరస్తా నుంచి వేలాది మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. వృద్ధులు, మహిళలు సైతం ఇబ్బంది పడుతున్నారు. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్‌òÙల్టర్లు ఉండాలి.  
–సయ్యద్‌ ఇమ్రోజ్, టోలిచౌకి 

దుకాణాల ముందే నిల్చుంటున్నాం.. 
బస్‌షెల్టర్లు లేక  రోడ్డుపైనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. చిన్నారులు, మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఎండకు తాళలేక దుకాణాల ముందు నిలబడి చీవాట్లు తినాల్సి వస్తోంది. జీహెచ్‌ంఎసీ, ఆర్టీసీ అధికారులు çసమన్వయంతో బస్‌ షెల్టర్లు నిర్మించాలి.  
–అంబటి రాజేష్, ఛత్రినాక

పేరుకే ఏసీ.. 
నిత్యం ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు తిరిగే  తిరిగే ప్రదేశం మాదాపూర్‌. ఇక్కడ పేరుకు ఏసీ బస్‌òÙల్టర్‌ ఉన్నా కూర్చోడానికి వీలులేకుండా, అపరిశుభ్రంగా మారింది. చెత్తా చెదారం, దుమ్ముధూళితో నిండి ఉంది. నిర్వహణ లేదు. ఏసీ లేని బస్‌షెల్టర్లు ఎందుకు?.  
– రాజేశ్, స్థానికుడు, మాదాపూర్‌

చర్యలు తీసుకుంటున్నాం.. 
బస్‌ షెల్టర్ల నిర్వహణపై ఫిర్యాదులను పరిశీలించి ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ (అడ్వర్టయిజ్‌మెంట్స్‌) వేణుగోపాల్‌రెడ్డి చెప్పారు. సంబంధిత ఏజెన్సీలు యూనియాడ్స్, ప్రకాశ్‌ఆర్ట్స్, మీడియా కార్ట్‌లకు రూ.2,45,000 జరిమానా విధించినట్లు తెలిపారు. ప్రస్తుతానికి మరమ్మతులు చేశారన్నారు. ఎక్కడైనా పనిచేయకుంటే ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement