సాక్షి, చెన్నై : చెన్నైలో ఓ మైనర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి స్నేహితుడి సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 17 ఏళ్ల బాలిక ఇటీవల జరిగిన పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో, మళ్లీ పరీక్ష రాయడానికి సిద్ధమవుతోంది.
ఈ క్రమంలో గురువారం రాత్రి చదువుకునేందుకు స్నేహితురాలి ఇంటి వెళ్లి, పొద్దు పోయిన తరువాత తిరిగి వచ్చేసరికి తీవ్ర అస్వస్థతకు గురైంది. తల్లిదండ్రులు అనుమానంతో ఆరా తీయగా, అక్కడ తనపై కొందరు దాడి చేసినట్టు ఏడుస్తూ చెప్పింది. షాక్ అయిన కుటుంబ సభ్యులు వెంటనే పోరూర్ మహిళా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలికను ఆస్పత్రికి తరలించారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలిక స్నేహితురాలి ఇంటి నుంచి బయలుదేరినప్పుడు అక్కడ ఆమెకు తెలిసిన ఓ స్నేహితుడు తాను ఇంటి దగ్గర దింపుతానని నమ్మించి బైక్పై ఎక్కించుకున్నాడు. ఆమెను ఇంటికి తీసుకెళ్లకుండా పోరూర్ సమీపంలోని కెరుగంబాక్కం ప్రాంతంలో ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ పథకం ప్రకారం వేచి ఉన్న స్నేహితులను పిలిపించి, ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి పారిపోయారు. ఈ కేసులో బాలిక స్నేహితుడితో పాటు ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.


