
సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు.
సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు(72) కన్నుమూశారు. గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మధ్యాహ్నం 12:45కు మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నెల 14న ఆసుపత్రిలో చేరారు. రేపు(ఆదివారం) సొంతూరు నారావారి పల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
రామ్మూర్తి నాయుడు 1952లో నారా కర్జూర నాయుడు, అమ్మణమ్మ దంపతులకు రెండో సంతానంగా జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరు నారా రోహిత్ కాగా, మరొకరు గిరీష్. 1994 నుండి 1999 వరకు చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా రామ్మూర్తి నాయుడు పనిచేశారు. రెండోసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.