కేంద్ర బడ్జెట్‌ 2025.. మురిపించేనా.. మొండిచెయ్యేనా? | Central budgets that have not benefited Telangana from several years | Sakshi
Sakshi News home page

కేంద్ర బడ్జెట్‌ 2025.. మురిపించేనా.. మొండిచెయ్యేనా?

Jan 29 2025 12:56 AM | Updated on Jan 31 2025 1:35 PM

Central budgets that have not benefited Telangana from several years

కొన్నేళ్లుగా రాష్ట్రం ఆశించిన మేర ప్రయోజనం చేకూర్చని కేంద్ర బడ్జెట్లు 

గత బడ్జెట్‌ కేటాయింపుల్లోనూ అనుకున్నట్టుగా రాని నిధులు 

ఈసారి ఫ్యూచర్‌ సిటీ,ట్రిపుల్‌ ఆర్, మెట్రోరైలు విస్తరణ ప్రాజెక్టులకు నిధులు ఆశిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 

కేంద్రం సహకరిస్తేనే మూసీ పునరుజ్జీవం, రేడియల్‌ రోడ్లు, గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పనులకు చాన్స్‌ 

పన్నుల్లో వాటా పెంపు,గ్రాంట్ల కోసం సర్కారు ఎదురుచూపులు

సాక్షి, హైదరాబాద్‌: ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్రం గంపెడాశలు పెట్టుకుంది. గత ఏడాది కేటాయింపులు కార్యరూపం దాల్చకపోవడం, ఆశించిన మేర నిధులు రాకపోవడంతో కించిత్‌ దూరంలో ఉన్న కీలక ప్రాజెక్టులు ఈసారైనా కేంద్ర సాయం దక్కక పోతుందా అని ఎదురుచూస్తున్నాయి. అలాగే ఫ్యూచర్‌ సిటీ మొదలు అనేక అభివృద్ధి ప్రణాళికలు, కార్యక్రమాలకు నిధులు కావాల్సి ఉంది. 

రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలు, పాలమూరు–రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదాలాంటి పాత డిమాండ్లు నెరవేర్చాలని కోరడంతో పాటు, ట్రిపుల్‌ ఆర్, మెట్రో రైలు విస్తరణ లాంటి కొత్త పనులకు కూడా నిధులు కావాలని రాష్ట్ర ప్రభుత్వం అడుగుతోంది. అయితే గత కొన్నేళ్లుగా కేంద్ర బడ్జెట్‌ ఆశించిన మేర రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చడం లేదు. దీంతో నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ఈసారైనా మంచి చేయకపోతుందా.. మరిన్ని నిధులు వచ్చేలా ప్రతిపాదనలు చేయకపోతుందా..పన్నుల్లో వాటా పెంచకపోతుందా, గ్రాంట్లు ఇవ్వకపోతుందా అనే ఆశతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.  

గ్రాంట్లు, పన్నుల్లో వాటా ఏం చేస్తారో? 
రాష్ట్రాలకు కేంద్రం నేరుగా ఇచ్చే నిధుల్లో కూడా కొన్నేళ్లుగా కోతలు పడుతున్నాయి. జనాభా ప్రాతిపదికన ఇచ్చే పన్నుల్లో వాటాను 41 శాతంగా 15వ ఆర్థిక సంఘం ప్రతిపాదించినా బడ్జెట్‌లో కేవలం 32 శాతానికి కుదిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఏడాదికి రూ.15 వేల కోట్లకు పైగా మాత్రమే పన్నుల్లో వాటా కింద తెలంగాణకు వస్తుండగా, పూర్తిస్థాయిలో ఇస్తే మరో రూ.5–8వేల కోట్లు అధికంగా వస్తాయని రాష్ట్రం ఆశిస్తోంది. 

ఇక గత మూడేళ్ల కాలంలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ వివరాలను పరిశీలిస్తే.. 2022–23లో రూ.41,001.73 కోట్లు ఇస్తారని ఆశిస్తే అందులో 32.14 శాతం అంటే కేవలం రూ.13,179.21 కోట్లు మాత్రమే వచ్చాయి. 2023–24లో రూ.41,259.17 కోట్లు అంచనా వేస్తే అందులో 23.58 శాతం అంటే రూ.9,729.91 కోట్లు మాత్రమే వచ్చాయి. కేంద్ర ప్రాయోజిత పథకాలైన ఉపాధి హామీ, ఇళ్లు, స్మార్ట్‌సిటీలు, రోడ్లు..తదితరాల కింద కూడా ఆశించిన మేర నిధులు రాకపోవడం గమనార్హం.  

ప్రతిష్టాత్మక ప్రాజెక్టులపై ఇప్పటికే ప్రతిపాదనలు 
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరుతూ ఇప్పటికే ప్రతిపాదనలు వెళ్లాయి. 2025–26 బడ్జెట్‌లో నిధుల కేటాయింపు కోరుతూ ప్రాజెక్టుల వారీగా నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పంపింది. రీజనల్‌ రింగు రోడ్డు, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, మెట్రో ప్రాజెక్టు విస్తరణ, హైదరాబాద్‌లో సీవరేజి మాస్టర్‌ప్లాన్, వరంగల్‌లో భూగర్భ డ్రైనేజీ, రేడియల్‌ రోడ్లు, గ్రీన్‌ఫీల్డ్‌ హైవే, ఇండ్రస్టియల్‌ హబ్‌లు, లాజిస్టిక్, రిక్రియేషన్‌ పార్కులు, ఫ్యూచర్‌ సిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు, పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు, కరీంనగర్, జనగామ జిల్లాల్లో లెదర్‌ పార్కులకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రానికి వెళ్లాయి. 

అలాగే తెలంగాణలోని గోదావరి వ్యాలీ బొగ్గు బ్లాక్‌లను సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌కు కేటాయింపు, సెమీకండక్టర్‌ మిషన్‌ కేంద్రంగా హైదరాబాద్‌ అభివృద్ధి, కేంద్రీయ విద్యాలయాలు, జిల్లాకో నవోదయ పాఠశాల, పాలమూరు–రంగారెడ్డికి జాతీయ హోదా, రాష్ట్రంలో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) ఏర్పాటు తదితరాలు కూడా వాటిల్లో ఉన్నాయి. 

వీటితో పాటు గత ఆరేళ్లుగా రాని వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు (బీఆర్‌జీఎఫ్‌) రూ.1,800 కోట్లు, 2014–15లో కేంద్ర ప్రాయోజిత పథకాల బకాయిలు రూ.495 కోట్లు, ఉమ్మడి సంస్థల నిర్వహణకైన ఖర్చులో ఏపీ వాటా కింద రూ.408.49 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ ప్రతిపాదనల్లో వేటికి ఎంత కేటాయింపులు జరుగుతాయో, అసలు జరుగుతాయో లేదో, ఆశించిన మేర ప్రయోజనం చేకూరుతుందో లేదో ఒకటవ తేదీన తేలనుంది. 

ట్రిపుల్‌ ఆర్‌ చూపెట్టి తప్పించుకునే చాన్స్‌? 
ఈసారి కేంద్ర బడ్జెట్‌ పరిమాణం 10 శాతం పెరిగి రూ.55 లక్షల కోట్లకు చేరుకుంటుందనే అంచనాలున్నాయి. ఆ మేరకు రాష్ట్రాలకు కేటాయింపులు పెరగాలి. డివిడెండ్‌ కింద ఆర్‌బీఐ ఈసారి కేంద్రానికి రూ.2 లక్షల కోట్లు ఇవ్వొచ్చు. ఆ డివిడెండ్, సెస్సులు, అదనపు ఆదాయాన్ని రాష్ట్రాలకు బదిలీ చేయాలి. తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ప్రాణహిత లేదంటే పాలమూరు ప్రాజెక్టులో ఒక దానికి ఖచ్చితంగా జాతీయ హోదా ఇవ్వాలి. కానీ కేంద్రం ఈసారి ట్రిపుల్‌ ఆర్‌కి అరకొర నిధులు చూపెట్టి చేతులు దులుపుకునే అవకాశముంది. 

ఈ ఏడాది జీడీపీ తగ్గినందున ఆదాయ పన్ను పరిమితి పెంచాలని అటు ప్రభుత్వం, ఇటు కార్పొరేట్‌ వర్గాల నుంచి వినిపిస్తోంది. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గినందునే జీడీపీ తగ్గిపోతోందని ఆర్‌బీఐ కూడా ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో ప్రజల కొనుగోలు శక్తి పెరగాలంటే అసంఘటిత రంగంలోని కారి్మకుల వేతనాలను నెలకు కనీసం రూ.28 వేలకు పెంచాలి. వేతన సవరణ కమిషన్‌ల సిఫారసులను త్వరితగతిన అమలు చేయడం వల్ల ఉద్యోగుల కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది. కేవలం రాయితీలకే పరిమితం కాకుండా ప్రజల నిజమైన ఆదాయం పెరిగే విధంగా కేంద్రం బడ్జెట్‌ ప్రతిపాదనలకు రూపకల్పన చేయాలి.  
– డాక్టర్‌ అందె సత్యం, ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement