
డాలస్లోని డాక్టర్ పెప్పర్ ఎరీనాలో సోమవారం జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, బీఆర్ఎస్ రజతోత్సవంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆ ప్రాజెక్టును సద్వినియోగం చేసుకోవాలి
కేసీఆర్కు పేరు వస్తుందనే పాలమూరును పండబెట్టారు
అమెరికన్ డ్రీమ్ స్ఫూర్తితోనే తెలంగాణ: కేటీఆర్
డాలస్లోని పెప్పర్ ఎరీనాలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరం ప్రాజెక్టు.. కూలేశ్వరం అయ్యిందని కొంతమంది మూర్ఖులు తెలిసీతెలియక మాట్లాడుతు న్నారు. అది 45 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే జల అక్షయపాత్ర. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాళేశ్వరంతోనే పునరుజ్జీవనం పొందింది. త్రీ గోర్జెస్ డ్యామ్ను నిర్మించేందుకు చైనాకు 16 ఏళ్లు పట్టింది. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తెలంగాణలో నాలుగేళ్లలోనే నిర్మించిన ఘనత కేసీఆర్ది. 371 పిల్లర్లు కలిగిన మూడు బరాజ్లలో రెండు పిల్లర్లకు నష్టం జరిగితే మొత్తం ప్రాజెక్టు కూలిపోయిందనే విష ప్రచారాన్ని ఆపి.. కాళేశ్వరం ప్రాజెక్టును సద్వినియోగం చేసుకోవాలి’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
దక్షిణ తెలంగాణకు వరప్రదాయిని అయిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మిగిలిన 10 శాతం పనులు పూర్తయితే కేసీఆర్కు మంచి పేరు వస్తుందని కాంగ్రెస్ పనులు చేపట్టడం లేదన్నారు. డాలస్లోని డాక్టర్ పెప్పర్ ఎరీనాలో భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, బీఆర్ఎస్ రజతోత్సవ సంబురాల్లో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 2023 నాటికి రెండు పంటలకు కలిపి 2.29 కోట్ల ఎకరాలకు నీళ్లు అందించి పంజాబ్, హరియాణాలను తలదన్ని ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను కేసీఆర్ అగ్రస్థానంలో నిలిపారన్నారు. పదేళ్లలో తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణ తప్పలేదని, మితిమీరి అప్పులు చేయలేదని చెప్పారు. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ చేయకూడని అప్పు, చేయకూడని తప్పులేవీ చేయలేదని కేటీఆర్ అన్నారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే...
అవకాశాల అక్షయపాత్ర తెలంగాణ
‘తెలంగాణను పదేళ్ల పాలనలో అవకాశాల అక్షయ పాత్రగా తీర్చిదిద్దాం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల స్ఫూర్తి డాలస్లో నూ కనిపిస్తోంది. ఎన్నారైలను చూసి తెలంగాణ తల్లి గర్వి స్తుంది. అమెరికన్ డ్రీమ్ తరహాలో కేసీఆర్ తెలంగాణ స్వ ప్నాన్ని మహాత్ముడు, అంబేడ్కర్, మార్టిన్ లూథర్కింగ్ స్ఫూ ర్తితో ముందుకు సాగి సాకారం చేశారు. మళ్లీ మూడేళ్లలో తిరిగి అధికారంలోకి వస్తాం. కేసీఆర్ సీఎం అవుతారు.
తెలంగాణను ప్రేమించడంలో వెనుకబడం
అధికారాన్ని బాధ్యతగా భావిస్తూ ఉద్యమ స్ఫూర్తితో ప్రభు త్వాన్ని నడిపి విడిపోతే విఫల రాష్ట్రం అవుతుందని హేళన చేసిన చోటనే విజయకేతనం ఎగరవేశాం. గేలి చేసిన నోళ్లతో నే మాకు కూడా మీలాంటి నాయకులు ఉంటే బాగుంటుంద నిపించాం. స్వరాష్ట్రాన్ని నంబర్వన్గా నిలపడంలో ఏ ఒక్క అవకాశాన్ని కూడా కేసీఆర్ నాయకత్వంలో వదులుకోలేదు. ఉద్యమంలో తెలంగాణ ఎన్నారైలు పోషించిన పాత్ర అద్వి తీయం. పుట్టిన గడ్డకు వేలాది మైళ్ల దూరంలో ఉన్నా ఏనా డూ బతుకమ్మ, బతుకునిచ్చిన తెలంగాణ తల్లిని మర్చిపోలే దు. అమెరికాలో మన విద్యార్థులకు వస్తున్న ఇబ్బందులను తొలగించేందుకు లీగల్ సెల్ ఏర్పాటు చేసి అండగా నిలబడతామని కేసీఆర్ దూతగా మీకు మాట ఇస్తున్నా.
ఘనంగా రజతోత్సవ సభ
డాలస్లోని డాక్టర్ పెప్పర్ ఎరీనాలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సంబురాలకు వేలాదిమంది హాజరయ్యారు. విదేశాల్లో బహిరంగ సభ నిర్వహణ ద్వారా బీఆర్ఎస్ కొత్త సాంప్రదాయానికి తెరలేపింది. సభాప్రాంగణ సామర్థ్యం 7 వేల కెపాసిటీకాగా, ఫైర్కోడ్ యాక్టివేట్ కావడంతో సుమారు ఐదు వేల మంది సభా ప్రాంగణం బయటే ఉండిపోయారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. అమెరికాలో సభలు నిర్వహించే ప్రాంగణాల్లోకి నిర్ణీత సంఖ్యను దాటి జనం వస్తే ఫైర్కోడ్ యాక్టివేట్ అవుతుంది. కాగా అమెరికా నలుమూలల నుంచి ఈ సభకు ప్రవాస తెలంగాణవాసులు, ఎన్ఆర్ఐలు హాజరయ్యారు. ఈ సభా వేదికగా, బీఆర్ఎస్, తెలంగాణ విజయగాథను కేటీఆర్ ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తెలంగాణ సాంస్కృతిక ప్రదర్శన, ధూంధాంకు నేతృత్వం వహించారు.