కదం తొక్కిన కార్మికులు | Sakshi
Sakshi News home page

కదం తొక్కిన కార్మికులు

Published Fri, Jun 24 2022 7:44 AM

Baldia Headquarters Rocked Dharna Of Outsourcing Workers - Sakshi

హిమాయత్‌నగర్‌: ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల ధర్నాతో గురువారం బల్దియా ప్రధాన కార్యాలయం దద్దరిల్లింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను ఎన్‌ఎంఆర్‌లుగా గుర్తించి పర్మనెంట్‌ చేయాలని, ఆరోగ్య భద్రతకు హెల్త్‌ కార్డు ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలని, బయోమెట్రిక్‌ మిషన్‌లను జీహెచ్‌ఎంసీనే నేరుగా కొనాలనే తదితర డిమాండ్లతో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (బీజేపీ) మజ్దూర్‌ సెల్‌ పిలుపు మేరకు ఉద్యోగ, పారిశుద్ధ్య, ఎంటమాలజీ, వెటర్నరీ, పార్క్‌ సెక్షన్, ట్రాన్స్‌పోర్ట్‌ సెక్షన్‌ విభాగాల కార్మికులు ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు రెండు గంటల పాటు కార్యాలయం లోపల కార్మికులు బైఠాయించారు.  అవుట్‌ సోర్సింగ్‌ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ.. ట్రాన్స్‌పోర్ట్‌ సెక్షన్‌ నుంచి తీసేసిన 700 మందిని విచారణ జరిపి వారిని విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. బయోమెట్రిక్‌ కారణంగా కట్‌ అయిన డబ్బులు తిరిగి ఇస్తామన్నారు. ఎంటమాలజీ విభాగంలో ఉన్న ఖాళీలను నియమించేందుకు, తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్షుడు ఉదిరి గోపాల్, ప్రధాన కార్యదర్శి నర్సింగ్‌ రావు, ఔట్‌ సోర్సింగ్‌ విభాగం అధ్యక్షుడు రాము తదితరులు పాల్గొన్నారు.  

(చదవండి: హైదరాబాద్‌కు పాడ్‌ కార్స్, రోప్‌వేస్‌)

Advertisement
Advertisement