
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. తెలంగాణ ప్రభుత్వం మెట్రో రైలు దశ 2 (బి) ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. మెట్రో రైల్ ఫేజ్ 2 (బి) ప్రతిపాదనతో పాటు అవసరమైన అన్ని పత్రాలు, డీపీఆర్లను ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. వారం క్రితం రెండో దశ మెట్రో ప్రాజెక్టుకు తెలంగాణ సర్కార్.. పరిపాలన అనుమతులు ఇచ్చింది.
మెట్రో రెండో దశ (బి) లో 86.1 కిలోమీటర్లు. 19,579 కోట్ల రూపాయలతో మెట్రో రెండో దశ నిర్మాణం జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యం తో మెట్రో రెండో దశ నిర్మాణం జరగనుంది. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ ఫేజ్ 2 (బి) ప్రాజెక్టులో 3 కారిడార్లు ఉన్నాయి. అందులో ఆర్జీఐఏ నుండి భారత్ ఫ్యూచర్ సిటీ (39.6 కిమీ; రూ.7,168 కోట్లు), జేబీఎస్ నుంచి మేడ్చల్ (24.5 కిమీ; రూ. 6,946 కోట్లు), జేబీఎస్ నుంచి షామిర్పేట (22 కిమీ; రూ. 5,465 కోట్లు). మొత్తం 86.1 కిమీ పొడవును కవర్ చేసే ఈ ఫేజ్ 2 (బి) ప్రాజెక్టులో మొత్తం రూ. 19,579 కోట్ల పెట్టుబడి ఉంటుంది.
గతంలో సమర్పించిన ప్లీజ్ 2 (ఎ) ప్రాజెక్ట్ ఐదు కారిడార్ల (76.4 కి.మీ) లాగానే, ఈ ఫేజ్ 2 (బి) ప్రాజెక్ట్ను కూడా కేంద్ర, రాష్ట ప్రభుత్వం జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. కేంద్ర ప్రభుత్వ JV ప్రాజెక్ట్ నిబంధనల ప్రకారం, ఫేజ్ 2 (బి) ఖర్చు రూ.19,579 కోట్లు. తెలంగాణ ప్రభుత్వ వాటా రూ. 5,874 కోట్లు (30 శాతం), భారత ప్రభుత్వం వాటా రూ. 3,524 కోట్లు (18 శాతం), అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణం రూ. 9,398 కోట్లు (48 శాతం), చిన్న పీపీపీ భాగం రూ. 783 కోట్లు (4 శాతం) కలిగి ఉంటుంది.