
సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్ బయటపడింది. దర్యాప్తు లోతుల్లోకి వెళ్లిన పోలీసులకు దిగ్భ్రాంతి కలిగించే విషయం ఒకటి తెలిసింది. ఐశ్వర్య(సహస్ర) కోసం ఆమె భర్తను మాత్రమే కాదు.. తన భార్యనూ అడ్డు తొలగించుకోవాలని బ్యాంకు ఉద్యోగి తిరుమల్ రావు ప్లాన్ వేసినట్లు వెల్లడైంది.
తిరుమల్ రావుకు ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. అయితే ఆ జంటకు పిల్లలు లేరు. దీంతో భార్యను అడ్డు తొలగించుకుని.. ఐశ్వర్యతోనే పిల్లలను కనాలని భావించాడు. ఈ క్రమంలో ఐశ్వర్య భర్త తేజేశ్వర్తో పాటు తన భార్యను చంపాలని ప్లాన్ వేసుకున్నాడు. ఆపై ఐశ్వర్యతో కలిసి లడాఖ్కు ట్రిప్ ప్లాన్ వేశాడు. అయితే భార్యను చంపితే బంధువుల్లో చెడ్డ పేరు వస్తుందన్న భయంతో ఆ ప్లాన్ను విరమించుకున్నాడు. కేవలం తేజేశ్వర్ను మాత్రమే చంపాలని ఆ ఇద్దరూ డిసైడ్ అయ్యారు.
ఇందుకోసం .. తేజేశ్వర్ హత్య జరిగిన ముందు రోజు బ్యాంకు నుంచి రూ.20 లక్షలు డ్రా చేశాడు. అయితే అప్పటికే భర్త తేజేశ్వర్ను చంపేందుకు ఐశ్వర్య ఐదుసార్లు ప్రయత్నించింది. జూన్ 17వ తేదీన ఆరోసారి చేసిన ప్రయత్నంలో తేజేశ్వర్ బలయ్యాడు. సుపారీ గ్యాంగ్కు సమాచారం అందించేందుకు తేజేశ్వర్ బైక్కు జీపీఎస్ ట్రాకర్ అమర్చింది ఐశ్వర్య. దాని ఆధారంగా అతనికి లొకేషన్ వివరాలను ఆ ముఠాకు అందించింది. ఆపై సర్వే పేరిట తేజేశ్వర్ను వెంట తీసుకెళ్లిన రాజు, పరమేశ్వర్, పరుశరామ్.. కత్తితో పొడిచి చంపారు.
కర్నూలు శివారులో పడేసిన మృతదేహాన్ని ఆ మరుసటిరోజు తిరుమల్ వెళ్లి చూసొచ్చాడు. అటుపైనే సుపారీ గ్యాంగ్కు రూ. 2 లక్షలు అందించాడు. ఇక ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తిరుమల్ కోసం నాలుగు బృందాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం అతను లడఖ్లోని ఉండి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
కేసు నేపథ్యం ఇదే..
జోగులాంబ గద్వాలకు చెందిన లైసెన్స్ సర్వేయర్ గంటా తేజేశ్వర్ హత్య కేసు తెలంగాణలో తీవ్ర సంచలనం రేపింది. భార్య ఐశ్వర్య తన ప్రియుడు తిరుమల్ రావుతో ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమనే అభియోగాలు ఉన్నాయి.
తేజేశ్వర్కు ఈ ఏడాది ఫిబ్రవరిలో కర్నూలు కల్లూరుకు చెందిన ఐశ్వర్య అనే యువతితో వివాహం నిశ్చయమైంది. అయితే ఐశ్వర్య కనిపించకుండా పోవడం.. ఆమె తిరుమలరావు అనే బ్యాంకు ఉద్యోగితో వెళ్లిపోయిందన్న ప్రచారంతో తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నారు. అయితే కొన్ని రోజులకే తిరిగి వచ్చిన ఐశ్వర్య.. కట్నం ఇవ్వలేకపోయామన్న కారణంతోనే తాను బంధువుల ఇంటికి వెళ్లిపోయానని తేజేశ్వర్ను నమ్మించింది.
దీంతో పెద్దలు ఒప్పుకోకపోయినా.. మే 18వ తేదీన ఐశ్వర్యను తేజేశ్వర్ వివాహం చేసుకున్నాడు. తిరుమల్రావు కోసం భర్త తేజేశ్వర్కు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే పెళ్లైన 29 రోజుల్లో.. 15 రోజులు ఐశ్వర్య కర్నూలులోనే గడిపింది. చివరకు.. తిరుమల్ రావు, సుపారీ గ్యాంగ్ సహకారంతో జూన్ 17వ తేదీన భర్త తేజేశ్వర్ను హత్య చేయించింది. ఆపై ఆ ముఠా తేజేశ్వర్ మృతదేహాన్ని పాణ్యం అటవీ ప్రాంతంలో వదిలేసి పారిపోయారు. ఆయుధాలు, ఫోన్, ల్యాప్టాప్ను కృష్ణానదిలో పడేశారు. ఈ కేసులో ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, తిరుమలరావు, సుపారీ గ్యాంగ్ సభ్యులను పోలీసులు నిందితులుగా చేర్చారు. ఐశ్వర్య తల్లి సుజాత తిరుమల్రావు పని చేసే బ్యాంకులోనే చిరుద్యోగి కాగా.. ఆమెతోనూ అతనికి శారీరక సంబంధం ఉన్నట్లు తేలింది.