
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో ప్రీ లాంచ్ మోసం వెలుగులోకి వచ్చింది. భారతీయ బిల్డర్స్ పేరుతో ప్రీ లాంచ్ అంటూ కోట్లాది రూపాయల ఘరానా మోసం బయటపడింది. ప్రీ లాంచ్ ప్రాజెక్ట్కు కోట్లు రూపాయలు చెల్లింపులు చేసిన 250 మంది బాధితులను ముంచేశారు. ఐదేళ్ల కిందట ప్రాజెక్ట్ మొదలు పెట్టిన భారతీయ బిల్డర్స్.. కనీసం 25 శాతం పనులు కూడా చేయలేదు.
బాధితులకు సాకులు చెబుతూ వచ్చారు. అనూహ్యంగా సునీల్ అహుజా అనే వ్యక్తికి భారతీయ బిల్డర్స్ ల్యాండ్ అమ్మేశారు. దీంతో బిల్డర్స్ను బాధితులు ప్రశ్నించారు. బిల్డర్స్, సునీల్ అహుజా అనే వ్యక్తి బాధితులపై బెదిరింపులకు దిగారు. భారతీయ బిల్డర్స్తో పాటు సునీల్ అహుజాపై సైబరాబాద్ ఈవోడబ్ల్యూలో కేసు నమోదైంది. మోసం చేసి ఆ తర్వాత భారతీయ బిల్డర్స్ పేరును శ్రీభారతి బిల్డర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్గా కేటుగాళ్లు మార్చేశారు.
ఈ కంపెనీకి 60 శాతం ఆశిష్ అహూజా, మిగిలిన నలభై శాతం వాటాలో భారతీ బిల్డర్స్ చైర్మన్ నాగరాజు, ఎండీ శివరామకృష్ణ లో పేరుతో షేర్లు ఉన్నాయి. ఇలా పేర్లు మారుస్తూ అమాయకులను నట్టేట ముంచుతున్నారు.
సిరిసింపద ఎస్టేట్స్ అండ్ బిల్డర్స్, భారతీ బిల్డర్స్, శ్రీ భారతీ బిల్డర్స్, భారతీ బిల్డర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. ఇలా పేర్లు మారుస్తున్న నిందితులు.. భానూరు, కోకోపేట్, విజయవాడ తదితర ప్రాంతాల్లో ప్రీలాంచ్ పేరుతో మోసాలకు తెరతీశారు. సునీల్ కుమార్ అహూజా, ఆశిష్ అహూజా, నాగరాజు, శివరామకృష్ణలను అరెస్టు చేయాలని.. తమ నగదును తిరిగి ఇప్పించాలంటున్న బాధితులు డిమాండ్ చేస్తున్నారు.