
21 వరకు నిర్వహణకు సన్నాహాలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధన, స్వస్తీవాచనంతో బ్రహ్మోత్సవాలకు ఆచార్యులు శ్రీకారం చుట్టనున్నారు. 21న బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.
బ్రహ్మోత్సవాల షెడ్యూల్
♦ 11వ తేదీ ఉదయం విశ్వక్సేన ఆరాధన, స్వస్తీ వాచనం, రక్షాబంధనం, సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోపణ
♦ 12న ఉదయం అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, సాయంత్రం భేరీపూజ, దేవతాహ్వానం, హవనం
♦ 13న అలంకార, వాహన సేవలు ప్రారంభం. ఉదయం మత్స్య అలంకారం, వేద పారాయణం, సాయంత్రం శేష వాహనం సేవ
♦ 14న ఉదయం వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి హంస వాహన సేవ
♦ 15న ఉదయం శ్రీకృష్ణ (మురళీ కృష్ణుడు) అలంకారం, రాత్రి పొన్న వాహన సేవ
♦ 16న ఉదయం గోవర్థనగిరిధారి అలంకారం, రాత్రి సింహ వాహన సేవ
♦ 17న ఉదయం జగన్మోహిన అలంకారం, రాత్రి స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం
♦ 18న శ్రీరామ అలంకారంలో హనుమంత వాహనంపై శ్రీస్వామివారి ఊరేగింపు.రాత్రి గజవాహన, శ్రీస్వామి, అమ్మవార్ల తిరు కల్యాణం నిర్వహిస్తారు.
♦ 19న ఉదయం శ్రీమహావిష్ణు అలంకార సేవ, గరుఢ వాహనంసేవలో శ్రీస్వామి వారి ఊరేగింపు, రాత్రి దివ్య విమాన రథోత్సవం.
♦ 20న ఉదయం మహా పూర్ణాహుతి, చక్రతీర్థ స్నానం, రాత్రి శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవాలు
♦ 21న ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి శ్రీస్వామి వారి శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో రద్దుకానున్న సేవలు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా 11నుంచి 21వ తేదీ వరకు శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, జోడు సేవలను రద్దు చేయనున్నారు. 17, 18, 19 తేదీల్లో అర్చనలు, భోగములు, 20, 21 తేదీల్లో అభిషేకాలు, అర్చనలు రద్దు చేయనున్నారు. 18వ తేదీన శ్రీస్వామి, అమ్మవారి తిరు కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు రూ.3వేల టికెట్ కొనుగోలు చేసి సంప్రదాయ దుస్తుల్లో పాల్గొనాలని ఆలయ అధికారులు తెలిపారు.