సాక్షి, హైదరాబాద్: తెలుగు సినీ నటుడు శివాజీ శనివారం తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. దండోరా సినిమా ప్రమోషన్లో భాగంగా వేదికపై శివాజీ అనుచిత వాఖ్యలు(misogynistic remark) చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో..
ఆ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటోగా స్వీకరించి.. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ శివాజీకి నోటీసులు జారీ చేసింది. దీంతో మహిళా కమిషన్ విచారణలో ఆయన ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నాడనే ఉత్కంఠ నెలకొంది.
తన కెరీర్లో ఎప్పుడూ ఇలా జరగలేదన్న ఈ సీనియర్ నటుడు.. తన వ్యాఖ్యలను గానూ మహిళా లోకానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేశారు. అయితే తన వ్యాఖ్యల్లో దొర్లిన రెండు అసభ్య పదాలకు మాత్రమే సారీ చెబుతూనే.. తన స్టేట్మెంట్కు మాత్రం కట్టుబడి ఉన్నానంటూ చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఈ ఘటనలో శివాజీ మీద తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఫిర్యాదులు, కేసులు నమోదు కాకపోవడం మరో కొసమెరుపు.


